IPL 2023: మిగిలిన మూడు ఎవరికి..? ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ లెక్కలు ఇలా..

ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతకుమించేలా ప్లేఆఫ్స్‌ రేసు కొనసాగుతోంది. గుజరాత్‌ అగ్రస్థానంతో తొలి బెర్తును ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ రేసులో చెన్నై, లఖ్‌నవూ ముందుండగా.. ముంబయి, రాజస్థాన్‌కు జట్లకు తక్కువ అవకాశాలు ఉన్నాయి.

Published : 19 May 2023 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో (IPL 2023) లీగ్‌ స్టేజ్‌ చివరి దశకు చేరింది. ఇప్పటికే అన్ని జట్లూ పదమూడేసి మ్యాచ్‌లు ఆడేశాయి. మే 21తో లీగ్‌ స్టేజ్‌ ముగుస్తుంది.  తాజాగా సన్‌రైజర్స్‌పై బెంగళూరు (SRH vs RCB) అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసును మరింత రసవత్తరంగా మార్చింది. నాలుగు ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో ఒకటి గుజరాత్‌ పేరిట ఇప్పటికే ఫిక్స్‌ అయిపోయింది.  ఇక మిగిలిన మూడింటి కోసం ఐదు జట్ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఆయా జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. 

  1. చెన్నై సూపర్‌ కింగ్స్‌: గుజరాత్‌ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న చెన్నై మే 20న (శనివారం) దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే, ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవాలి. 
  2. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌: కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ లేకపోయినా.. కీలక సమయంలో విజయాలు నమోదు చేసి ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం 15 పాయింట్లతో నెట్‌రన్‌రేట్‌ కాస్త తక్కువ ఉండటం వల్ల మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం. చెన్నై జట్టు పరిస్థితే లఖ్‌నవూకూ వర్తిస్తుంది. ఓడితే ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. మే 20న కోల్‌కతాతో లఖ్‌నవూ తలపడనుంది. 
  3. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రాజస్థాన్‌ను భారీ తేడాతో ఓడించి.. తాజాగా హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులోకి బెంగళూరు దూసుకొచ్చింది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌ను చివరి మ్యాచ్‌లో ఓడిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. చెన్నై, లఖ్‌నవూ, ముంబయి తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే బెంగళూరు రెండో స్థానంలోకీ వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ బెంగళూరు ఓడినా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఉంది. అప్పుడు ముంబయి, రాజస్థాన్‌ తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవాలి.
  4. ముంబయి ఇండియన్స్‌: గత మ్యాచ్‌లో లఖ్‌నవూ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన ముంబయి ఇండియన్స్‌ (14 పాయింట్లు) ప్లేఆఫ్స్‌ అవకాశాలను  సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్‌పై (మే 21న) ముంబయి భారీ విజయం సాధించినా.. బెంగళూరుతో నాలుగో స్థానం కోసం పోటీ తప్పదు. ముంబయి గెలిచి.. తన ఆఖరి మ్యాచ్‌లో బెంగళూరు ఓడితే మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా రోహిత్‌ సేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. అప్పుడు ముంబయి ఖాతాలో 16 పాయింట్లు, బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.  ఒకవేళ చివరి మ్యాచ్‌లో ముంబయి ఓడితే మాత్రం దాదాపు ఇంటిముఖం పట్టినట్లే. నెట్‌రన్‌రేట్‌ కారణంగా బెంగళూరు, రాజస్థాన్‌ జట్లలో ఒకటి నాలుగో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. 
  5. రాజస్థాన్‌ రాయల్స్‌: ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌తో రాజస్థాన్‌ తన చివరి మ్యాచ్‌లో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే  రాజస్థాన్‌ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరతాయి. రన్‌రేట్‌ ఎలాగూ ప్లస్‌లో ఉంది. ఇలాంటి సమయంలోనూ రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ముంబయి,  బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడితే.. మూడు జట్లూ పద్నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది. రాజస్థాన్‌ మంచి రన్‌రేట్‌తో పంజాబ్‌ను ఓడిస్తే.. ఆ జట్టే నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌లోకి వెళ్తుంది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌, రాజస్థాన్‌ ఎవరు ఓడినా.. ఆ జట్టు ఇంటిముఖం పట్టక తప్పదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని