Team India: పొట్టి టోర్నీలో కథ ముగిసింది.. టీమ్‌ఇండియా ఓటమికి కీలక కారణాలు ఇవేనా!

టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లోనే పోరాటం ముగించింది. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేయడంతో టీమ్‌ఇండియా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

Published : 11 Nov 2022 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సెమీస్‌కు వస్తుందని భావించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడంతోపాటు అదృష్టం తోడై పాకిస్థాన్‌ ఫైనల్‌కు వెళ్లింది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మాత్రం కీలకమైన సెమీస్‌లో బొక్కబోర్లాపడింది. ఇంగ్లాండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. పొట్టి కప్‌ సెమీస్‌ టీమ్‌ఇండియా ఓటమితోపాటు టోర్నీలో ప్రదర్శనపై ప్రభావం చూపిన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి ఏంటో ఓ సారి గమనిద్దాం..

పవర్‌ప్లేలో దూకుడు ఎక్కడ..?

టీ20 ఫార్మాట్‌లో ప్రతి బంతి.. ప్రతి ఓవరూ కీలకం. కానీ తొలి ఆరు ఓవర్లు అవేనండి పవర్‌ప్లే చాలా కీలకం. ఎందుకంటే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాలంటే.. ఆ 6 ఓవర్లలో వారి బౌలర్లను ఊచకోత కోయాలి. అప్పుడు తదుపరి వచ్చే బ్యాటర్లపైనా ఒత్తిడి పెద్దగా ఉండదు. కానీ టీమ్‌ఇండియా పరిస్థితిని చూస్తే.. ఒక్కసారంటే ఒక్కసారి కూడా 50 పరుగులు దాటిన పాపాన పోలేదు. భారత టీ20 లీగ్‌లో అయితే మన స్టార్‌ బ్యాటర్లు భారీ స్కోర్లతో విరుచుకుపడతారని.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆడరనే విమర్శలు అభిమానుల నుంచి వస్తున్నాయి. లీగ్‌ స్టేజ్‌లో జింబాబ్వే మీదనే భారత్‌ అత్యధికంగా 46/1 స్కోరు చేసింది. ఇక సెమీస్‌లో అయితే కేవలం 38 పరుగులే చేసింది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ అయితే ఏకంగా 63 పరుగులు చేసి విజయం ఖరారు చేసుకొంది. ఇక ఓపెనర్ల సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సాధికారికంగా ఒక్క ఇన్నింగ్సూ ఆడకపోవడం గమనార్హం. 

బౌలింగ్‌లో ‘పేస్‌’ పసలేదు

ఆస్ట్రేలియా పిచ్‌లు అంటేనే ఫాస్ట్‌బౌలర్లకు స్వర్గధామం. అలాంటిది టీమ్ఇండియాకు టోర్నీకి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో అతడు లేకుండా జట్టు ఆసీస్‌కు వచ్చేసింది. సీనియర్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ ఉన్నా.. అతడికి టీ20ల్లో సాధన లేకపోవడం ఈ ప్రపంచకప్‌లో స్పష్టంగా కనిపించింది. పొట్టి కప్‌ ముందు వరకు ఎక్కువగా వన్డేల్లోనే ఆడిన షమీ.. అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్‌ ఆడి దాదాపు సంవత్సరమైంది. అందుకే చాలా మంది సీనియర్లు, మాజీలు ఆసీస్‌ పేస్‌ పిచ్‌ల కోసం ఉమ్రాన్‌ మాలిక్‌ను తీసుకొంటే బాగుండేదని సూచనలు చేశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఫర్వాలేదనిపించినా.. భువీ, షమీ తమ స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేదు. మరో పేసర్ హర్షల్‌ పటేల్‌ను జట్టుతోపాటు తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. పేస్ ఆల్‌రౌండర్‌గా అక్కరకొస్తాడని భావించిన హార్దిక్‌ పాండ్య.. ఒకటీఅరా మ్యాచ్‌ల్లో తప్ప కీలక పాత్ర పోషించిన దాఖలాలు తక్కువే. 

చురుకైన ఫీల్డింగూ కరవు..

టీ20ల్లో చిరుతల్లా మైదానంలో తిరగాలి. ఎటు నుంచి బంతి వచ్చినా అందుకొనేలా పరుగెత్తాలి. టీమ్‌ఇండియా స్క్వాడ్‌లో విరాట్ కోహ్లీ మినహా ఎవరూ కూడా ఫీల్డింగ్‌లో మెప్పించలేదు. అయితే అలాంటి విరాట్ కూడా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా చేతిలో పడిన క్యాచ్‌ను వదిలి తీవ్ర విమర్శలపాలయ్యాడు. అయితే ఇక్కడ వయస్సు ప్రభావం కూడా టీమ్‌ఇండియాపై ఉందనేది విశ్లేషకుల వాదన. ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ (37) వయస్సు అందరికంటే ఎక్కువ. 15 మంది సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతావారంతా 32 దాటినవారే కావడం గమనార్హం. ఇలాంటి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఫీల్డింగ్‌ను ఆశించడం అత్యాశే అవుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యలు. ఆటపరంగా వీరంతా స్టార్లే. 

రిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండా.. 

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆరు మ్యాచ్‌లను ఆడింది. ఇందులో ఐదు గ్రూప్‌ స్టేజ్‌లో కాగా.. మరొకటి సెమీస్‌లో తలపడంది. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ వెంట తీసుకెళ్లిన యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. అతడొక్కడే రిస్ట్‌ స్పిన్నర్‌. కానీ చాహల్‌కు బదులు రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్ పటేల్‌కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది. టీ20 ఫార్మాట్‌లో రిస్ట్‌ స్పిన్నర్లు రాణించిన దాఖలాలు అధికం. ఆస్ట్రేలియాలోనూ ప్రభావం చూపే ఆస్కారం ఎక్కువ. అంతేకాకుండా తాజాగా ఇంగ్లాండ్‌తో సెమీస్‌లోనూ ఆడించలేదు. ఇంగ్లాండ్‌పై చాహల్‌కు మంచి రికార్డే ఉంది. 11 టీ20ల్లో 16 వికెట్లు తీసి అదరహో అనిపించాడు. ఎకానమీ కూడా 8 మాత్రమే. ఇక టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు (6/25) కూడా ఇంగ్లాండ్‌పైనే చేశాడు. కానీ అతడికి అవకాశం ఇవ్వకుండా అక్షర్, అశ్విన్‌ను మాత్రమే కెప్టెన్‌ రోహిత్ శర్మ నమ్ముకోవడం కూడా భారత్‌ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. 

నిర్ణయాల్లో దూకుడు లేదు.. 

గతంలో చెప్పినట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో జట్టును నడిపించడం పెద్ద విషయమే కాదు. అన్ని ఫార్మాట్లకు ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్. కానీ జట్టును ఆయా సందర్భాల్లో నడిపించేందుకు సిద్ధంగా అరడజను మంది కెప్టెన్లు రెడీగా ఉన్నారు. కానీ ఐసీసీ మెగా టోర్నీల్లో టీమ్‌కు నాయకత్వం వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. జట్టుపై ఒత్తిడి, అంచనాలు భారీగా ఉంటాయి. మన సారథి రోహిత్ శర్మ విషయానికొస్తే.. కానీ మెగా టోర్నీల్లో మాత్రం మరోసారి విఫలమయ్యాడు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో అనే విషయాలపై పట్టును కోల్పోయినట్లు అనిపించింది. పరిస్థితికి తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అదే రొటీన్ ఫార్ములాను నమ్ముకోవడంతో కీలక సమయాల్లో పాలుపోని పరిస్థితి వచ్చేసింది. దీపక్ హుడా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌ చేయగలడు. అలాగే యుజ్వేంద్ర చాహల్‌, హర్షల్‌ పటేల్‌కు ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఫలితం ఎలా ఉన్నా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం మంచిదే కానీ.. కీలకమైన టోర్నీల్లో అది వర్కౌట్‌ కాదు. 

‘‘ఎంఎస్ ధోనీ తర్వాత భారత్‌కు ఇద్దరు ప్రధాన సారథులు వచ్చారు. గత టీ20 ప్రపంచకప్‌ వరకు టీమ్‌ను అద్భుతంగా నడిపిన విరాట్‌ కోహ్లీ కూడా.. ఐసీసీ టోర్నీని గెలవలేదనే కారణంతో విమర్శలు ఎదుర్కొని మరీ కెప్టెన్సీని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు రోహిత్ కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై విమర్శలపాలువుతున్నాడు. ఇప్పటికప్పుడు అతడి పదవికి పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే కెప్టెన్సీగండం తప్పదు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని