NO Balls: ‘నో బాల్స్‌’.. అర్ష్‌దీప్‌ చెత్త రికార్డు.. క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్ ప్రత్యేకతదే..!

కీలక బౌలర్‌గా రాణిస్తున్న యువ ఆటగాడు అర్ష్‌దీప్‌ సింగ్ (Arshdeep Singh) శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs SL T20) లయ తప్పాడు. ఏకంగా ఐదు నోబాల్స్‌ వేసి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు.

Updated : 07 Jan 2023 09:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకే ఓవర్‌లో మూడు (హ్యాట్రిక్).. ఆ పై మరో రెండు మొత్తం ఐదు నోబాల్స్‌ (NO-BALLS).. ఇదంతా ఒక్క బౌలర్‌ మాత్రమే వేశాడు. అతడికి తోడుగా మరో ఇద్దరు బౌలర్లు చెరొక నో బాల్‌ను సంధించడంతో.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఏడు నో బాల్స్‌ వేసిన జట్టుగా హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని టీమ్‌ఇండియా (team india) మరో మూడు టీమ్‌ల సరసన చేరింది. ఇక నో బాల్స్‌ను ఎలా ప్రకటిస్తారు.. దాని వల్ల బౌలింగ్‌ జట్టుకు కలిగే నష్టాలేంటి..? బ్యాటర్లకు చేకూరే ప్రయోజనాలేంటి..? ఇప్పటి వరకూ అత్యధికంగా నో బాల్స్‌ వేసిన బౌలర్లు ఎవరు..? ఒక్కటీ వేయని బౌలర్లు ఎవరనేది చూద్దాం..  

ఇప్పుడివే ఎక్కువ..

ప్రస్తుతం క్రికెట్‌లో ‘నో బాల్‌’కు సంబంధించి ఎక్కువగా మూడింటిని మాత్రమే తరచుగా చూస్తుంటాం. బౌలర్‌ తన క్రీజ్‌ను దాటి అడుగు ముందుకేసినప్పుడు.. బ్యాటర్‌ నడుము కంటే ఎక్కువ ఎత్తుతో బంతి వేసినప్పుడు.. బౌన్సర్‌ వేసినప్పుడు బ్యాటర్ భుజాల కంటే ఎత్తుగా వచ్చిన బంతిని నో బాల్‌గా పరిగణిస్తారు. నిర్దిష్ట సమయంలో సర్కిల్‌ లైన్‌ అవతల ఎక్కువగా ఫీల్డర్లను మోహరించినా ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇలా జరిగే ఛాన్స్‌లు చాలా తక్కువ. తరచూ బీమర్లు (బ్యాటర్‌ను గాయపరిచేలా) వేసినా నో బాల్‌గా ప్రకటించి.. ఆ బౌలర్‌ను బౌలింగ్‌ వేయకుండా చేసే అధికారమూ ఫీల్డ్‌ అంపైర్లకు ఉంటుంది. అయితే 1984 వరకు నో బాల్స్‌/వైడ్లు వేసినా బౌలర్‌ ఖాతాలో అదనంగా పరుగులు చేరేవి కావు. కానీ ఎంసీసీ మారిన రూల్స్ ప్రకారం ఇప్పుడు బౌలర్‌ ఖాతాలో పడిపోతున్నాయి. అలాగే నో బాల్‌ వల్ల పరుగుతోపాటు అదనంగా ఫ్రీ హిట్‌ రూపంలో బ్యాటర్‌కు అవకాశం దొరుకుతుంది. ఒక వేళ ఆ బంతికి రనౌట్‌ మినహా ఎలా ఔటైనా.. నాటౌట్‌గానే పరిగణిస్తారు.

బౌలింగ్‌ జట్టుకు భారీ నష్టం..

నో బాల్స్‌  వల్ల ఫలితమే మారిపోయే పరిస్థితులు ఉంటాయి. దీనికి ఉదాహరణ తాజాగా భారత్ -శ్రీలంక రెండో టీ20 మ్యాచ్‌ (ind vs sl 2023 second t20). ఒక్క నోబాల్‌ పడితేనే అదనంగా పరుగుతోపాటు మరొక బంతిని ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. అలాంటిది శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఏడు బంతులు ఇలా పడటంతో భారత్‌ ఓటమికి ప్రధాన కారణమైంది. నో బాల్‌ వేయడం వల్ల బ్యాటర్లకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుంది. ఫ్రీ హిట్‌ కారణంగా భారీ షాట్‌ కొట్టి పరుగులు రాబడతారు. కీలకమైన సమయంలో ఇలా వేయడం వల్ల బౌలర్ల లయ కూడా దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసం తగ్గి సరైన ప్రాంతంలో బంతులను సంధించడంలో విఫలమవుతారు. 

అత్యధికంగా నో బాల్స్ వేసినవారు.. 

తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐదు నో బాల్స్ వేసిన ఆ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అని తెలిసిందే. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన అర్ష్‌దీప్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా నో బాల్స్‌ వేసిన బౌలర్‌గా తన రికార్డును అతడే అధిగమించాడు. గతంలో ఒకే మ్యాచ్‌లో నాలుగు నోబాల్స్‌ వేశాడు. అరంగేట్రం చేసిన ఆరు నెలల్లోనే 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను ఆడిన అర్ష్‌దీప్‌ 33 వికెట్లు తీశాడు. అయితే కీలక బౌలర్‌గా మారిన అర్ష్‌దీప్‌ అప్పుడే 14 నో బాల్స్‌ కూడా వేయడం గమనార్హం. ఇలా పొట్టి ఫార్మాట్‌లో అత్యధికంగా ‘నో బాల్స్‌’ను వేసిన బౌలర్‌గా అవతరించాడు. అర్ష్‌దీప్‌ తర్వాత బుమ్రా (8), యుజ్వేంద్ర చాహల్ (5) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

భారత్‌ నుంచి కపిల్‌ మాత్రమే పొదుపు.. 

దాదాపు 350కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అతి తక్కువగా అదనపు పరుగులు ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కపిల్‌ కాకుండా ఇయాన్‌ బోథమ్ (ఇంగ్లాండ్), ఇమ్రాన్‌ ఖాన్ (పాకిస్థాన్‌), డెన్నిస్‌ లిల్లీ (ఆస్ట్రేలియా), లాన్స్ గిబ్స్ (విండీస్) వారు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు.

* ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా నోబాల్స్ వేసిన నాలుగో జట్టు టీమ్‌ఇండియా (7). అంతకుముందు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ కూడా ఏడేసి నోబాల్స్‌ను వేశాయి. అయితే 10 నోబాల్స్‌తో ఘనా పేరిట ఈ రికార్డు ఉంది. ఉగాండా మీద అత్యంత చెత్త బౌలింగ్‌ ఆ జట్టు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని