MS Dhoni: కీపింగ్‌లో తగ్గని పదును.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై బోణీ కొట్టింది. బెంగళూరును చిత్తు చేసి తొలి విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ కూడా ఓ ఘనత సాధించాడు.

Updated : 23 Mar 2024 09:10 IST

ఇంటర్నెట్ డెస్క్: గత సీజన్‌లో చెన్నైను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత ఎంఎస్ ధోనీ (MS Dhoni) మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఈ ఐపీఎల్‌ ఎడిషన్‌ కోసం సిద్ధమయ్యాడు. కొత్త హెయిర్‌స్టైల్‌తో మునుపటి ధోనీని చూసిన అనుభూతి అభిమానులకు కలిగింది. బెంగళూరుతో మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు తన కెప్టెన్సీని వదిలేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి ఆడతాడని అంతా భావించారు. అనూహ్యంగా వికెట్‌ కీపర్ - బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. చాలా విరామం వచ్చినప్పటికీ అతడి కీపింగ్‌లో మాత్రం పదును తగ్గలేదు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం విశేషం. బెంగళూరు కోల్పోయిన ఐదు వికెట్లలో మూడింట్లో ధోనీ భాగస్వామ్యం ఉంది.

చెన్నై బౌలర్‌ ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ తేలిగ్గానే అందుకున్నాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఆఫ్‌సైడ్‌ కొట్టే క్రమంలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కాస్త దూరంగా వెళ్తున్న బంతిని ధోనీ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే గ్లెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇక బెంగళూరు ఇన్నింగ్స్‌ చివరి బంతికి అనుజ్‌ రావత్ (48)ను ఔట్‌ చేసిన తీరు గత ధోనీని గుర్తుకు తెచ్చింది. తుషార్‌ పాండే బౌలింగ్‌లో చివరి బాల్ డాట్‌గా పడింది. కానీ, స్ట్రైకర్‌ దినేశ్ కార్తిక్‌ పరుగు కోసం ప్రయత్నించాడు. అనుజ్‌ రావత్‌ డైవ్‌ చేశాడు. కానీ, అక్కడుంది ఎంఎస్ ధోనీ.. అంత దూరం నుంచి వికెట్లను గిరాటేస్తూ థర్డ్‌ అంపైర్‌ వైపు చూశాడు. రిప్లేలోనూ అనుజ్‌ రనౌట్‌ అని తేలింది. ఈ క్రమంలో ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ధోనీ ఇప్పటి వరకు 24 రనౌట్లు చేశాడు. ఇంతకుముందు రవీంద్ర జడేజా (23)తో కలిసి సంయుక్తంగా ఉండేవాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని