T20 world Cup 2007: అవమానాలను ఎదుర్కొని.. ధోనీ నాయకత్వంలో విశ్వవిజేతగా నిలిచి!
సరిగ్గా 15 ఏళ్ల కిందట.. సెప్టెంబర్ 24న దాయాది దేశం పాకిస్థాన్ను చిత్తు చేసి తొలిసారి దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ను ...
ఫైనల్లో దాయాది దేశంపై టీమ్ఇండియా అద్భుత విజయం
ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా 15 ఏళ్ల కిందట.. సెప్టెంబర్ 24న దాయాది దేశం పాకిస్థాన్ను చిత్తు చేసి దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ను టీమ్ఇండియా సొంతం చేసుకున్న రోజు. 2007లోనే జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ ఘోర వైఫల్యం చెందింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు ఉన్నాసరే బంగ్లాదేశ్ చేతిలో పరాభవం ఎదుర్కొంది. దీంతో అభిమానుల నుంచి అవమానాలతోపాటు విమర్శలను టీమ్ఇండియా భారీ స్థాయిలో మూటగట్టుకోవాల్సి వచ్చింది. కెప్టెన్సీతోపాటు జట్టులోనూ బీసీసీఐ సమూల మార్పులు చేసింది. ఝార్ఖండ్ డైనమేట్ మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ కుర్రాడేం చేస్తాడులే.. అని అనుకొన్న విశ్లేషకుల అంచనాలను తప్పని ధోనీ నిరూపించాడు. జట్టును అద్భుతంగా నడిపించిన ధోనీ భారత్కు కప్ను సాధించి పెట్టి.. అప్పటి వరకు ఆగ్రహంతో ఉన్న క్రికెట్ అభిమానుల్లో సంతోషం నింపాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియా సాధించిన ఏకైక ట్రోఫీ గురించి గత జ్ఞాపకాలను ఓసారి నెమరేసుకొందాం..
గ్రూప్ దశలో ఇలా..
ఫస్ట్ మ్యాచ్ రద్దు.. రెండో మ్యాచ్ బౌల్ అవుట్ ద్వారా విజయం సాధించిన టీమ్ఇండియా.. మూడు పాయింట్లతో గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించింది. స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్లో పాకిస్థాన్, భారత్ స్కోర్లు సమంకావడంతో బౌల్ అవుట్కు వెళ్లింది. అయితే టీమ్ఇండియా 3-0 తేడాతో పాక్పై గెలిచి మ్యాచ్ను కైవసం చేసుకోవడంతోపాటు సూపర్-8కి అర్హత సాధించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రాబిన్ ఉతప్ప (50) అర్ధశతకం చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ కూడా తమ తొలి మ్యాచ్లో స్కాట్లాండ్ను చిత్తు చేయడంతో తదుపరి దశకు చేరుకొంది.
సూపర్-8లోనూ అగ్రస్థానమే..
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్లతో భారత్ సూపర్-8 పోరులో తలపడింది. న్యూజిలాండ్ మీద మినహా మిగతా మ్యాచుల్లో టీమ్ఇండియావిజయం సాధించింది. ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్కూడా గెలవకపోవడం గమనార్హం. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అప్పటి యువ ఆటగాడు.. ప్రస్తుత టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (50) అర్ధశతకం సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 153/5 స్కోరు సాధించింది. అనంతరం ఆర్పీ సింగ్ (4/13) విజృంభణతో దక్షిణాఫ్రికా 116/9 స్కోరుకే పరిమితమైంది. సూపర్-8 గ్రూప్ -ఈ నుంచి అగ్రస్థానంతో భారత్ సెమీఫైనల్కు వెళ్లింది.
యువరాజ్ కీలక ఇన్నింగ్స్
సూపర్-8 దశలో రెండు గ్రూప్ల నుంచి భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్లాయి. సెమీస్లో భారత్-ఆస్ట్రేలియా, కివీస్-పాక్ జట్లు తలపడ్డాయి. అప్పటికే ఆసీస్ వన్డే ప్రపంచకప్లను అత్యధికంగా సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ కూడా భయంకరంగా ఉండేది. బ్రెట్లీ, నాథన్ బ్రాకెన్, మిచెల్ జాన్సన్ వంటి పేసర్లతోపాటు ఆండ్రూ సైమండ్స్, మైకెల్ క్లార్క్ స్లో బౌలర్లు ఉండేవారు. ఒక్క బ్రెట్లీని తప్ప మిగతా బౌలర్లను లక్ష్యంగా చేసుకొని భారత బ్యాటర్లు దాడి చేశారు. మరీ ముఖ్యంగా యువరాజ్ సింగ్ (70: 30 బంతుల్లో 5 సిక్స్లు, 5 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యువీతోపాటు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (36), రాబిన్ ఉతప్ప (34), గౌతమ్ గంభీర్ (24) రాణించారు. అయితే భారత్ నిర్దేశించిన 189 పరుగుల ఛేదనలో ఆసీస్ ధాటిగానే ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించి వికెట్లను తీయడంతో ఆసీస్ 173/7 స్కోరుకు పరిమితమై 15 పరుగుల తేడాతో ఓడింది.
మళ్లీ దాయాదుల పోరు..
గ్రూప్ దశలో ఒకసారి తలపడిన దాయాదులు.. మరోసారి ఢీకొట్టుకున్నారు. అదీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ కోసం కావడం విశేషం. ఫైనల్లోనూ హోరాహోరీగా సాగింది. గౌతమ్ గంభీర్ (75 పరుగులు: 54 బంతుల్లో 2 సిక్స్లు, 8 ఫోర్లు) అదరగొట్టాడు. రోహిత్ శర్మ (30*) కూడా కీలక పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను ప్రారంభించిన పాక్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆర్పీసింగ్ దెబ్బకు పాక్ బ్యాటర్ హఫీజ్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్కు చేరాడు. ఇమ్రాన్ నజీర్ (33) దూకుడుగా ఆడటంతో పాక్ మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే భారత బౌలర్లు మరోసారి విజృంభించి స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ పాక్పై ఒత్తిడి పెంచారు.
చివరి ఓవర్ అనూహ్యం
చివరి ఓవర్లో పాక్కు 13 పరుగులు అవసరం కాగా.. ఒక్క వికెట్ తీస్తే కప్ టీమ్ఇండియా సొంతమవుతుంది. ఈ క్రమంలో కెప్టెన్ ధోనీ అనూహ్యంగా మీడియం పేసర్ జోగిందర్ శర్మ చేతికి బంతినిచ్చాడు. అయితే క్రీజ్లో మిస్బా ఉల్ హక్ (43) ఉండటంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. జోగిందర్ తొలి బంతిని వైడ్గా వేశాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులు.. కానీ జోగిందర్ కాస్త తెలివిగా బంతిని సంధించాడు. దీంతో పరుగేమీ రాలేదు. అప్పుడు సమీకరణం 5 బంతుల్లో 12 పరుగులుగా మారింది. అయితే రెండో బంతిని మిస్బా సిక్స్గా మలిచాడు. దీంతో టీమ్ఇండియా అభిమానుల్లో కంగారు మొదలైంది. చివరి నాలుగు బంతులకు కేవలం ఆరు పరుగులు చేస్తే చాలు పాక్దే విజయం. అయితే మూడో బంతికి మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్కు యత్నించగా.. నేరుగా షార్ట్ ఫైన్ లెగ్లో కాచుకొని ఉన్న శ్రీశాంత్ చేతిలో పడటం.. టీమ్ఇండియా అభిమానుల కేరింతలు.. టైటిల్ను భారత క్రికెటర్లు అందుకోవడం చకచకా జరిగిపోయాయి.
సలహాలను స్వీకరించేవాడు: హర్భజన్
తొలిసారి టీ20 ప్రపంచకప్లో నెగ్గిన జట్టులో హర్భజన్ సింగ్ ఒకడు. 2007 వరల్డ్ కప్ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు ఓ క్రీడా ఛానెల్ నిర్వహించిన ‘07 ఛాంపియన్స్’ కార్యక్రమంలో భజ్జీ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి టైటిల్ను ఎత్తుకొనే వరకు ధోనీ మా జట్టుకు కెప్టెన్ అని మేం భావించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అందులో ఉంది. ప్రతి మ్యాచ్లో అవసరమైన పరిస్థితుల్లో ఆటగాళ్ల సలహాలను, సూచనలను ధోనీ స్వీకరించేవాడు. అత్యుత్తమంగా రాణించేందుకు ఏం చేయాలని భావిస్తున్నారో అలాగే చేయండని ప్రోత్సహించేవాడు. పాక్తో బౌల్ అవుట్ సందర్భంగా మేం ఎక్కువగా రన్అప్ తీసుకోకూడదని ముందే అనుకున్నాం. ఓ మూడు నాలుగు స్టెప్పులు వేసేలా ప్రణాళిక చేసుకున్నాం. దూరం నుంచి పరిగెత్తుకొస్తే బ్యాలెన్స్ను కోల్పోయే ప్రమాదం ఉందని భావించి.. అలా నిర్ణయం తీసుకున్నాం’’ అని హర్భజన్ వివరించాడు. ఫస్ట్ టీ20 ప్రపంచకప్లో ఆడి.. ఇప్పటికీ క్రికెట్లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఇద్దరే.. వారిలో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మరొకరు దినేశ్ కార్తిక్. వీరిద్దరూ ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2022 జట్టులోనూ సభ్యులు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత