BCCI-Dravid: రాహుల్‌.. అప్పటి వరకు కోచ్‌గా కొనసాగు.. బీసీసీఐ మరో ప్రతిపాదన

రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) ప్రధాన కోచ్‌గా కొనసాగుతాడా? లేదా..? అనే ఉత్కంఠ భారత క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. మిస్టర్ డిపెండబుల్‌కు బీసీసీఐ ఆఫర్లు ఇస్తూనే ఉన్నా అతడు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. 

Updated : 29 Nov 2023 10:47 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ఇటీవల కాంట్రాక్ట్‌ను పూర్తి చేసుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ను (Rahul Dravid) కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. మరో రెండేళ్లు అతడికి అవకాశం ఇస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రతిపాదించింది. ద్రవిడ్‌ మాత్రం కొనసాగేందుకు సుముఖంగా లేకపోవడంతో మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. కనీసం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ వరకైనా జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరింది. ఒకవేళ ద్రవిడ్ ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే.. అతడితోపాటు వన్డే ప్రపంచకప్‌ వరకు ఉన్న సహాయక సిబ్బంది కూడా కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేకు కాంట్రాక్ట్‌ పొడిగింపు లభించనుంది. 

ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌ కూడా మద్దతుగా నిలిచారు. అలాగే ద్రవిడ్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ‘‘కాంట్రాక్ట్‌ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు వెళ్లకూడదని ద్రవిడ్‌ భావిస్తే.. వన్డేల నాటికి భారత జట్టుతో కలవచ్చు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌నే పంపాలని యాజమాన్యం బలంగా భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్‌కు అవకాశంపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికే ఎన్‌సీఏ పనులతో బిజీగా ఉన్నాడని.. అండర్-19 వరల్డ్‌ కప్‌ కూడా సమీస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికా పర్యటనకు పంపడమూ కష్టమేనని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్‌ ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఆశిశ్ నెహ్రా వద్దన్నాడా..?

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తొలిసారే కప్‌ సాధించడంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతోపాటు భారత మాజీ పేసర్‌ ఆశిశ్ నెహ్రా కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆశిశ్‌ను పొట్టి ఫార్మాట్‌కు భారత కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావించిందని సమాచారం. కానీ, ఆశిశ్ మాత్రం ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో మళ్లీ రాహుల్‌ ద్రవిడ్‌ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై అటు ఆశిశ్ లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని