WTC Final: భారత జట్టా.. ఫ్రాంచైజీ క్రికెట్టా..?ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో కొత్త క్లాజ్‌ చేర్చాలన్న రవిశాస్త్రి

ఐపీఎల్‌లో రాణించిన బ్యాటర్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)లో తేలిపోవడంపై విమర్శలు వస్తున్న క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 10 Jun 2023 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023) తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్ వంటి ఆటగాళ్లు తేలిపోవడంపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కఠిన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ 14 పరుగులు చేయగా.. గిల్ 13 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో బీసీసీఐ ముందు రవిశాస్త్రి పలు ప్రతిపాదలను తీసుకొచ్చాడు. ఆటగాళ్లు భారత జట్టుకు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారా..? ఫ్రాంచైజీ క్రికెట్‌ను మాత్రమే ఆడతారా..? అనే క్లాజ్‌ను ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో పొందుపరిచే విధంగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.

‘‘ఆటగాళ్ల ప్రాధాన్యత ఏది..? ఫ్రాంచైజీ క్రికెట్టా..? భారత్‌ జట్టు తరఫున లేదా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడతారో నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ అంటే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి మరిచిపోండి. ఒకవేళ ఇదే (wtc final) ముఖ్యమని భావిస్తే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బీసీసీఐనే బాస్‌. అందుకే, ఐపీఎల్ కాంట్రాక్ట్స్‌లో ఒక క్లాజ్‌ను చేర్చాలి. భారత్‌ తరఫున ఆడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఐపీఎల్‌ నుంచి బయటకు వచ్చేలా రూల్‌ చేయాలి. అయితే, ఫ్రాంచైజీ నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేసి ఆటగాళ్లను సొంతం చేసుకుంటాయి. కానీ, కస్టోడియన్ మాత్రం బీసీసీఐ కాబట్టి తుది నిర్ణయం దానిదే. భారత్‌లో క్రికెట్‌ను నియంత్రించే బాధ్యత బీసీసీఐదే’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని