IND vs AUS: అక్షర్ X కుల్‌దీప్‌.. నేను మాత్రం అలా చేయను: రవిశాస్త్రి

నాలుగు టెస్టుల్లోనూ (IND vs AUS) రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన టీమ్‌ఇండియా బౌలర్లలో సీనియర్ కుల్‌దీప్‌ యాదవ్‌ ఒకడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కింది.

Updated : 11 Mar 2023 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు (IND vs AUS) ఎంపికైన చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజాతోపాటు మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను ఫైనల్‌ XIలోకి టీమ్‌ఇండియా తీసుకుంది. దీంతో కుల్‌దీప్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే బౌలర్‌గా అక్షర్ పటేల్ పెద్దగా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో విమర్శల నుంచి తప్పించుకోగలిగాడు. కానీ, అక్షర్ - కుల్‌దీప్‌ స్థానాలపై చర్చ మాత్రం కొనసాగుతోంది. దీనిపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 

‘‘అక్షర్‌ పటేల్‌ (Axar Patel) బ్యాటింగ్ చేయకుండా ఉంటే ఈ సిరీస్‌లో అతడి పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పుడు నేను కుల్‌దీప్‌ వైపు మొగ్గు చూపేవాడిని. అయితే, బ్యాటింగ్‌లో రాణించిన అక్షర్‌ను తప్పించాలని నేనూ అనుకోను. క్లిష్టమైన పిచ్‌ల మీద ఆడేటప్పుడు తమ బ్యాటింగ్ విభాగం బలంగా ఉండాలని టీమ్‌ఇండియా భావించింది. అందుకే ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అదేవిధంగా ఫలితం కూడా రాబట్టింది. లేకపోతే తొలి రెండు టెస్టుల్లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లేదే కాదు. అక్షర్ పటేల్‌ కూడా బ్యాటింగ్‌తో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి మూడు టెస్టుల్లో అతడు బౌలింగ్‌లో కీలకంగా మారలేదు.  బంతి ఎక్కువగా తిరగడంతో తొలి మూడు టెస్టుల్లో ఎక్కువగా జడేజా, అశ్విన్‌తోనే రోహిత్ బౌలింగ్‌ వేయించాడు. కానీ, అహ్మదాబాద్‌ టెస్టులో మాత్రం అక్షర్ కీలకమవుతాడని అనిపిస్తోంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 28 ఓవర్లు వేసి కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. కానీ, అదే కీలకమైన వికెట్ కావడం విశేషం. సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ ఉస్మాన్‌ ఖవాజాను ఎల్బీ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని