2013 Champions Trophy: ధోనీ నమ్మకాన్ని నిలబెట్టిన ఇషాంత్‌, జడ్డూ, అశ్విన్‌

అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్‌ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ లాంటి....

Published : 23 Jun 2022 15:04 IST

అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్‌ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ లాంటి బలమైన జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్‌లో టీమ్‌ఇండియా తక్కువ స్కోరే చేసినా కెప్టెన్‌ ధోనీ ధైర్యం.. ఆటగాళ్ల పట్టుదలతో విజయం సాధించింది. ముఖ్యంగా ధోనీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఇషాంత్‌, జడేజా, అశ్విన్‌.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు. ఆ మధుర క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.

టాస్‌ ఓడి.. బ్యాటింగ్‌లో తడబడి..

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాను.. ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. బ్రాడ్‌, రవి బొపారా, జేమ్స్‌ అండర్సన్‌ వంటి స్టార్‌ బౌలర్లు చెలరేగడంతో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్‌ (9), దినేశ్‌ కార్తీక్‌ (6), సురేశ్‌ రైనా (1), ధోనీ (0) పూర్తిగా విఫలమైనా శిఖర్‌ ధావన్‌ (31), విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) పోరాడటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ దక్కింది. ముఖ్యంగా 14 నుంచి 19 ఓవర్ల మధ్య కోహ్లీ, జడేజా ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. లేకపోతే జట్టు పరిస్థితి మరింత ఘోరమయ్యేది చివరికి 129/7తో నిలిచి ఇంగ్లాండ్‌ ముందు ఊరించే లక్ష్యం నిర్దేశించారు.

ఇంగ్లాండ్‌ కూడా అంతంతే..

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ కూడా ఛేదనలో తడబడింది. భారత బౌలర్లు ఆదిలో వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టుకు కష్టమైంది. ఉమేశ్‌ యాదవ్ రెండో ఓవర్‌లోనే అలిస్టర్‌ కుక్‌ (2) వంటి ప్రమాదకర బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపగా.. తర్వాత అశ్విన్‌, జడేజా మెరిశారు. దీంతో జొనాథన్‌ ట్రాట్‌ (20), జోరూట్‌ (7), ఇయాన్‌ బెల్‌(13) వంటి టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. అయితే, నాలుగు వికెట్లు పడ్డాక జోడీ కట్టిన ఇయాన్‌ మోర్గాన్‌ (33), రవిబొపారా (30) నిలకడగా ఆడారు. వీరిద్దరూ సుమారు 9 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి వికెట్లు కాపాడుకుంటూనే మెల్లి మెల్లిగా లక్ష్యం వైపు సాగారు. దీంతో 17 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 102/4 స్కోర్‌తో నిలిచి తేలిగ్గా విజయం సాధించేలా కనిపించింది.

మలుపుతిప్పిన ఇషాంత్‌..

ఇక అంతా ఇంగ్లాండ్‌కు ట్రోఫీ ఖాయం అనుకున్న సమయంలో కెప్టెన్‌ ధోనీ బంతిని ఇషాంత్‌కు అప్పగించాడు. ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్‌ కొట్టిన మోర్గాన్‌ మూడో బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా ఇంకో షాట్‌ ఆడబోయాడు. బంతి బ్యాట్‌ అంచున తాకడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్‌ చేతుల్లో పడింది. దీంతో 64 పరుగుల కీలక ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఇషాంత్‌ మరుసటి బంతిని షార్ట్‌పిచ్‌గా వేయడంతో బొపార సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి బ్యాట్‌కు తాకి గాలిలోకి లేవడంతో అశ్విన్‌ మరోసారి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ 18 ఓవర్లకు 111/6తో నిలిచింది.

జడేజాను ప్రయోగించి..

ఇక ధోనీ మరోసారి ప్రయోగం చేసి 19వ ఓవర్‌ను జడేజాతో బౌలింగ్ చేయించాడు. అప్పటికి ఇంగ్లాండ్‌ గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులే కావాలి. క్రీజులో బట్లర్‌, బ్రెస్నన్‌ ఉండటంతో పాటు చేతిలో ఇంకో నాలుగు వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్‌ విజయావకాశలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో జడేజా వేసిన తొలి బంతికి బ్రెస్నన్‌ (2) సింగిల్‌ తీశాడు. మరుసటి బంతికే బట్లర్‌ ఔట్‌. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే మిడిల్‌ స్టంప్‌ ఎగిరింది. దీంతో ప్రమాదకర బట్లర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన స్టువర్ట్‌ బ్రాడ్‌ (7) సింగిల్‌ తీశాడు. ఇక నాలుగో బంతిని స్వీప్‌ షాట్‌ ఆడిన బ్రెస్నన్‌ ఎల్బీడబ్ల్యూగా అనిపించడంతో టీమ్‌ఇండియా అప్పీల్‌ చేసింది. అంపైర్‌ నాటౌటిచ్చాడు. అయితే, అదే సమయంలో చురుగ్గా ఫీల్డింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ సింగిల్‌ కోసం వెళ్లిన బ్రెస్నన్‌ను రనౌట్‌ చేశాడు. తర్వాత రెండు సింగిల్స్‌ మాత్రమే రావడంతో జడ్డూ ఆ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చాడు.

టీమ్‌ఇండియా విజయోత్సాహం..

ఇంగ్లాండ్‌ చివరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా ధోనీ బంతిని అశ్విన్‌కు ఇచ్చాడు. తొలి బంతికి పరుగులు చేయలేని బ్రాడ్‌ రెండో బంతికి బౌండరీ బాది.. మూడో బంతికి సింగిల్‌ తీశాడు. తర్వాత ట్రెడ్‌వెల్‌ నాలుగు, ఐదు బంతులకు రెండేసి పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ స్కోర్‌ 125/8కి చేరుకొంది. దీంతో ఆఖరి బంతికి ఇంగ్లాండ్‌కు 5 పరుగులు అవసరం కాగా ఉత్కంఠ నెలకొంది. కానీ, అశ్విన్‌ మాయ చేసి బౌలింగ్‌ చేయడంతో చివరికి పరుగులేమీ రాలేదు. దీంతో టీమ్‌ఇండియా 5 పరుగుల స్వల్ప తేడాతో అతిగొప్ప విజయాన్ని నమోదు చేసింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని