Rohit Sharma: హిట్మ్యాన్ 2.0.. అభిమానులు కోరుకున్నదీ ఇదే!
వన్డేల్లో రోహిత్కు తిరుగులేకపోయినా.. టీ20ల్లో మాత్రం నిలకడ ఉండటం లేదనే చెప్పాలి. కానీ, అఫ్గాన్తో మూడో టీ20లో రోహిత్ 2.0 కనిపించాడు. తనవి కాని స్విచ్ షాట్లను కూడా సమర్థంగా ఆడాడు.
14 నెలలుగా అంతర్జాతీయ టీ20ల్లో ఆడలేదు.. పైగా పొట్టి ఫార్మాట్లో రోహిత్కు నిలకడ లేదనే వ్యాఖ్యలు. మరోవైపు టీ20 ప్రపంచకప్ దిశగా యువ జట్టును సిద్ధం చేస్తున్నారు.. జట్టును నడిపించేందుకు యంగ్ కెప్టెన్నూ తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి సమయంలో రోహిత్ను మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావడం, అంతే కాకుండా కెప్టెన్నూ చేయడంపై ఓ వర్గం నుంచి విమర్శలూ వచ్చాయి.
అఫ్గానిస్థాన్తో తొలి రెండు మ్యాచ్ల్లో అతను డకౌట్ కావడంతో రోహిత్పై విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో రోహిత్ను టీ20ల్లోకి తిరిగి తీసుకురావడం బెడిసికొడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్.. ఒకే ఒక్క మ్యాచ్తో రోహిత్పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇది కదా రోహిత్ అంటే అని అభిమానులు సంబరపడిపోతున్నారు.
వీరోచిత శతకంతో విజయశిఖరాల వైపు
అఫ్గానిస్థాన్తో జరిగిన చివరి టీ20తో రోహిత్ కెరీర్ తిరిగి కొత్తగా మొదలైందనే చెప్పాలి. ఇది అతని కొత్త వర్షన్ అని చెప్పుకోవచ్చు. అసలు టీ20లు ఆడతాడో, లేదో అనే సందేహాలను దాటి.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్లోనూ జట్టును నడిపించేలా అతను సాగుతున్నాడు. అఫ్గాన్తో మూడో టీ20లో బ్యాట్తో, కెప్టెన్సీతో రోహిత్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 వికెట్లు కోల్పోయి.. ఓటమి ప్రమాదంలో పడిన జట్టును వీరోచిత శతకంతో రోహిత్ విజయశిఖరాల వైపు నడిపించాడు.
మరో వికెట్ పడకుండానే జట్టు 212 పరుగులతో ఇన్నింగ్స్ ముగించిందంటే అందుకు కారణం రోహిత్. రింకు సింగ్తో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించిన తీరు.. చివర్లో ధనాధన్ షాట్లతో చెలరేగిన వైనం.. టీ20ల్లో ఒకప్పటి రోహిత్ను గుర్తుచేసింది. వన్డేల్లో రోహిత్కు తిరుగులేకపోయినా.. టీ20ల్లో మాత్రం నిలకడ ఉండటం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ మ్యాచ్తో రోహిత్ 2.0 కనిపించాడు. తనవి కాని స్విచ్ షాట్లను కూడా సమర్థంగా ఆడాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక శతకాల (5) రికార్డు రోహిత్దే. రెండు సూపర్ ఓవర్లలోనూ సత్తా చాటాడు. మొదట రెండు సిక్సర్లు, తర్వాత ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. తొలి సూపర్ ఓవర్లో చివరి బంతికి బౌలింగ్ ఎండ్లో ఉన్న అతను.. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి వేగంగా పరుగెత్తడం కోసం రింకు సింగ్ను పిలిపించడం అతని తెలివికి నిదర్శనం. ఇక రెండో సూపర్ ఓవర్లో పేసర్ అవేశ్ను కాదని మ్యాచ్లో భారీగా పరుగులిచ్చిన స్పిన్నర్ రవి బిష్ణోయ్కు బంతి అందించడం కూడా మంచి ఎత్తుగడే. అది అద్భుత ఫలితాన్నివ్వడంతో మ్యాచ్ సొంతమైంది. ఇలాగే టీ20 ప్రపంచకప్లోనూ బ్యాటర్గా, కెప్టెన్గా రోహిత్ సత్తా చాటితే.. భారత ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరపడ్డట్లే!
టీ20 ప్రపంచకప్కూ అతనేనా?
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్షిప్పై ఫోకస్ పెట్టడం కోసం టీ20ల్లో ఆడలేదు. ఆ సమయంలో టీ20ల్లో యువ రక్తాన్ని ఎక్కించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. యువ ఆటగాళ్లను పొట్టి ఫార్మాట్లో ఆడిస్తోంది. అలాగే టీ20ల్లో జట్టును హార్దిక్ నడిపిస్తున్నాడు. కానీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తిరిగి రోహిత్ను జట్టులోకి తీసుకొచ్చి, సారథ్య బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగింది.
బీసీసీఐ కూడా దీనికి మొగ్గు చూపినట్లే కనిపించింది. పైగా హార్దిక్ గాయం కూడా రోహిత్ను తిరిగి పరిగణలోకి తీసుకోవడంలో కీలకంగా మారింది. దీంతో టీ20 ప్రపంచకప్కు ముందు చివరగా అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ కోసం రోహిత్తో పాటు కోహ్లీని తిరిగి జట్టులోకి తీసుకుంది. రోహిత్ను కెప్టెన్ను చేసింది. ఇప్పుడీ సిరీస్లో, ముఖ్యంగా చివరి టీ20లో బ్యాటర్గా, కెప్టెన్గా రోహిత్ ఉత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లోనూ జట్టును అతనే నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి లోగా హార్దిక్ కోలుకున్నా.. పొట్టి కప్లో రోహిత్కే సారథ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.