Suryakumar: డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే మా అసలైన ట్రోఫీలు.. నా మ్యాచ్‌ ఫీజు వారికే: సూర్యకుమార్‌

Eenadu icon
By Sports News Team Updated : 29 Sep 2025 09:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ చరిత్రలోనే తొలిసారి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా (India vs Pakistan Final) ఫైనల్‌ ఆడింది. ఒకే ఎడిషన్‌లో మూడుసార్లు ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం ట్రోఫీ ప్రెజెంటేషన్‌, మెడల్స్‌ స్వీకరించే కార్యక్రమం దాదాపు గంటరన్నపాటు ఆలస్యంగా జరిగింది. చివరికి ట్రోఫీతోపాటు మెడల్స్‌ను భారత ప్లేయర్లు తీసుకోలేదు. దానికి కారణం ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ. కేవలం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలపై కెప్టెన్ సూర్యకుమార్ (Suryakumar Yadav) స్పందించాడు. అభిషేక్ శర్మతో కలిసి విలేకర్లతో మాట్లాడాడు.

‘‘నేను క్రికెట్‌ ఆడటం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం చూడలేదు. నాకు తెలిసి ఇదే తొలిసారి అనుకుంటున్నా. చాలా కష్టపడి మేం సాధించాం. అయితే, అసలైన ట్రోఫీలు నాతోపాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాయి. జట్టులోని సహచర 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నా రియల్‌ ట్రోఫీలు. మేం విజేతలుగా నిలిచిన తర్వాత సంబరాలు చేసుకొనేందుకు దాదాపు గంటరన్నరపాటు వేచి చూశాం. ఛాంపియన్‌ ట్రోఫీ బ్యానర్‌ తీసుకురావడంలోనూ ఆలస్యమైంది. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని మాకు ఎవరి నుంచీ ఆదేశాలు రాలేదు. మేం మైదానంలోనే అలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా నేను ఓ ప్రకటన చేస్తున్నా. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ నాకు వచ్చిన మ్యాచ్‌ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నా ’’ అని సూర్యకుమార్ వెల్లడించాడు.

ఆ ట్రోఫీ లేకపోతేనేం..

ఆసియా కప్‌ (Asia Cup)ను మోసిన్ నఖ్వీ చేతులమీదుగా తీసుకొనేందుకు భారత్‌ అంగీకరించలేదు. దీంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. అయితే, భారత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఆసియా కప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అయితే, అవి సాంకేతికను వినియోగించి ట్రోఫీని యాడ్‌ చేసిన ఫొటోలు కావడం గమనార్హం. ‘మ్యాచ్‌ ముగిశాక కేవలం ఛాంపియన్లే గుర్తుంటారు. ట్రోఫీ ఫొటో కాదు’ అంటూ సూర్య క్యాప్షన్ ఇచ్చాడు. ‘3-0’ అంటూ హార్దిక్‌ పాండ్య ఫొటోలను షేర్ చేశాడు.

Tags :
Published : 29 Sep 2025 07:37 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు