Suryakumar Yadav: రెచ్చగొట్టిన దాయాది... రెచ్చిపోని బిగ్‌ బ్రదర్‌..

Eenadu icon
By Sports News Team Updated : 29 Sep 2025 15:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్ డెస్క్‌: రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా మూడు మ్యాచుల్లో గెలిచింది. ఫైనల్‌లోనూ ఆ జట్టును చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్ క్రికెటర్లు ఎంత రెచ్చగొట్టేలా వ్యవహరించినా సరే.. భారత్‌ ప్లేయర్లు మాత్రం సంయమనం పాటించారు. ఛాంపియన్‌గా నిలిచినా సరే ఎక్కడా పొరుగు దేశాన్ని హేళన చేసేలా ప్రవర్తించలేదు. ఇప్పుడదే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఇదే ప్లేస్‌లో పాక్‌ ఉండుంటే కచ్చితంగా ‘ఓవర్‌’ యాక్షన్‌ చేసేదని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, తాము ఇక్కడికి నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు మాత్రమే వచ్చామని మరోసారి టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ స్పష్టం చేశాడు. పాక్‌ చెందిన క్రికెటర్లు తమను ఎంత కవ్వించినా హుందాగానే ఉన్నామని వ్యాఖ్యానించాడు. ఓ జాతీయ ఛానల్‌తో సూర్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌కు తమ జట్టుకు ఉన్న చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు.

‘‘మేం ఎప్పుడూ వెకిలి చేష్టలు చేయలేదు. చేతులతో హావభావాలు ప్రదర్శించలేదు. ఇరు జట్లకూ చాలా తేడా ఉందనేది నా అభిప్రాయం. మేం ఆటను గౌరవప్రదంగా ఆడాలని భావించాం. అలాగే చేశాం. వారు మాత్రం చాలా ప్రకటనలు చేస్తున్నారు. ఫలితం ఏదొక జట్టుకు అనుకూలంగా ఉంటుంది. అయితే, మేం కమ్‌బ్యాక్ చేసిన విధానం ఎప్పటికీ మరిచిపోలేం. బయట నుంచి ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉంటారు. వారి అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. అప్పుడు సహచరులకు ఒకటే చెప్పా.. ‘భావోద్వేగాలను పక్కన పెట్టండి. నాణ్యమైన క్రికెట్ ఆడండి. ఆఖరికి ఫలితం ఎలా ఉన్నాసరే చూసుకుందాం’ అని మాత్రమే చెప్పా’’ అని సూర్య వెల్లడించాడు. 

బీసీసీఐకి ధన్యవాదాలు..

‘‘మన క్రికెట్ బోర్డు చాలా పెద్దది. చాలా మంది క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. బీసీసీఐ ఇచ్చిన మద్దతు ఎప్పటికీ మరిచిపోలేం. అలాంటి బోర్డుకు నాణ్యమైన క్రికెట్ ఆడి తిరిగిఇవ్వగలం. ట్రోఫీలను గెలిచి ఇవ్వగలం. నేను గాయపడినప్పుడు ఎక్కువగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో గడిపా. భారత క్రికెట్ కొత్త శిఖరాలకు చేరుకొనేందుకు ఇదొక మంచి సమయం. అక్కడి సౌకర్యాలు అద్భుతం. చాలా మంది క్రికెటర్లు నెలలపాటు ఆట ఆడలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఆసియా కప్‌లోకి వచ్చారు. అయినా సరే, మాపై బోర్డు నమ్మకం ఉంచింది. ఈ సందర్భంగా బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నా’’ అని సూర్యకుమార్‌ తెలిపాడు. 

నఖ్వీపై నవంబర్‌లో నిరసన!

ఆసియా కప్‌ ఫైనల్‌ అనంతరం విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు రావాల్సిన ట్రోఫీతోపాటు మెడల్స్‌ను ఏసీసీ చీఫ్‌గా ఉన్న మోసిన్‌ నఖ్వీ తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నఖ్వీపై ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. అలాగే నవంబర్‌లో జరగనున్న ఐసీసీ సర్వసభ్య సమావేశంలోనూ నిరసన తెలపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మోసిన్ నఖ్వీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Tags :
Published : 29 Sep 2025 14:34 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు