IND vs ENG : ఇంగ్లాండ్‌ వేదికగా.. పొట్టి కప్‌ కోసం సమర శంఖం పూరించేనా..?

ఇంగ్లాండ్‌ పర్యటనలో టెస్టు మ్యాచ్‌ ఫలితం ఏంటో తేలిపోయింది. ఇక టీ20, వన్డే సిరీస్‌లు మిగిలాయి. జులై 7 నుంచి...

Published : 07 Jul 2022 01:39 IST

గురువారం నుంచి మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్న భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ఇంగ్లాండ్‌ పర్యటనలో టెస్టు మ్యాచ్‌ ఫలితం ఏంటో తేలిపోయింది. ఇక టీ20, వన్డే సిరీస్‌లు మిగిలాయి. జులై 7 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. మరి మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌తో పోరు ఆషామాషీగా ఉండదు. ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ పోటీలకు సమయం మరెంతో లేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా బలాలు ఏంటి..? ఇంగ్లాండ్‌తో ఎన్నిసార్లు ఢీకొట్టింది..? ఆధిపత్యం ఎవరు సాధించారు..? వంటి విషయాలను తెలుసుకుందాం.. 

రోహిత్‌కు అసలైన పరీక్ష

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకు టీమ్‌ఇండియాదే. అయితే గత టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా లీగ్‌ స్థాయిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలేశాడు. అనంతరం జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వరుసగా న్యూజిలాండ్‌, శ్రీలంక, విండీస్‌ టీమ్‌లపై సిరీస్‌లను ఒడిసిపట్టాడు. అయితే అవన్నీ భారత్‌లోనే జరగడం గమనార్హం. తర్వాత దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ 2-2తో సమమైంది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే దీనికి రిషభ్‌ పంత్ సారథ్యం వహించాడు. ఇక తర్వాత ఐర్లాండ్‌పై రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య నేతృత్వం వహించాడు. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్‌తో వారి గడ్డపైనే టీ20 సిరీస్ ఆడనున్న రోహిత్ నేతృత్వంలోని టీమ్ఇండియాకు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. కరోనా కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన రోహిత్‌ పొట్టి ఫార్మాట్‌ బరిలోకి దిగుతున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ కూడా విదేశాల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

టీమ్‌ఇండియా కుర్రాళ్ల హవా.. 

తొలి టీ20 మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్, బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్ దూరమవుతారు. టెస్టు మ్యాచ్‌ జరిగిన బర్మింగ్‌హామ్‌లోనే రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈ ఐదుగురు రెండో మ్యాచ్‌కు జట్టుతో కలుస్తారు. అయితే తొలి మ్యాచ్‌ ఆడే జట్టులో సూర్యకుమార్‌, హార్దిక్‌, దీపక్ హుడా, సంజూ శాంసన్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి కుర్రాళ్లు ఉన్నారు. వీరిలో రుతురాజ్‌ మినహా మిగతావారంతా ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో వీరికి తోడుగా సీనియర్‌ బ్యాటర్లు రోహిత్ శర్మ (కెప్టెన్), దినేశ్‌ కార్తిక్‌ ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎలానూ ఉన్నాడు. అతడికి తోడుగా అవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్, హర్షల్‌ పటేల్‌, చాహల్‌ అండగా నిలిచే అవకాశం ఉంది. అక్టోబర్‌లో ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచకప్ ప్రారంభమయ్యే నాటికి భారత్‌ మహా అయితే 20 టీ20 మ్యాచ్‌లను ఆడే అవకాశం ఉంది. కాబట్టే ప్రతి మ్యాచ్‌లో రాణించడం ఆటగాళ్లకు కీలకం. 

ఇంగ్లాండ్‌ను తక్కువగా అంచనా వేయలేం..

భారత్‌ ఎంత బలంగా కనిపిస్తున్నా.. మైదానంలో రాణించాలి. అసలే అక్కడ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌. టెస్టులోనే భారీ లక్ష్య ఛేదనను అలవోకగా చేసేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో చెలరేగడం ఖాయం. భారత టీ20 లీగ్‌లో అదరగొట్టేసిన జోస్ బట్లర్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్‌తోపాటు జాసన్ రాయ్‌, డేవిడ్ మలన్, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ వంటి అగ్రస్థాయి బ్యాటర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ఏమాత్రం అవకాశం దొరికినా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు. అయితే టీమ్‌ఇండియా బౌలింగ్‌తో పోలిస్తే ఇంగ్లాండ్‌ కాస్త వీక్‌గానే ఉంది. క్రిస్‌ జొర్డాన్‌, సామ్‌ కరన్, మిల్స్, డేవిడ్ విల్లే వంటి పేసర్లు ఉన్నప్పటికీ ఎంతమేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే. మొయిన్‌ అలీ, పార్కిన్‌సన్, లియామ్‌ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌ దాడితో భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలు తక్కువే. పార్కిన్‌సన్ మినహా మిగతా బౌలర్లను టీ20 లీగ్‌లో ఎదుర్కొన్న అనుభవం టీమ్‌ఇండియా ఆటగాళ్లకు ఉంది. 

భారత్‌Xఇంగ్లాండ్‌.. ఎవరిది ఆధిపత్యం..?

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు ఇప్పటి వరకు 19 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ కాస్త పైచేయి సాధించింది. టీమ్‌ఇండియా పది టీ20ల్లో విజయం సాధించగా.. ఇంగ్లాండ్‌ తొమ్మిందిట్లో గెలుపొందింది. భారత్‌, ఇంగ్లాండ్‌ చివరిసారిగా 2021లో అహ్మదాబాద్‌ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో 11 మ్యాచుల్లో స్వదేశంలో తలపడినా భారత్‌ ఆరు మ్యాచుల్లో విజయం సాధించగా.. 6 మ్యాచులను ఇంగ్లాండ్‌లో ఆడితే టీమ్‌ఇండియా కేవలం రెండింట్లోనే గెలిచింది. తటస్థ వేదికల్లో జరిగిన రెండు మ్యాచ్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ను వారి గడ్డపైనే ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదని ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి టీ20 సిరీస్‌ను గెలవాలంటే ఇంగ్లాండ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. 

మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

* జులై 7న రాత్రి 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) 

* జులై 9న రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) 

* జులై 10న రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) 

జట్లు ఇవే..: 

భారత్‌: తొలి టీ20కి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 

మిగిలిన రెండు టీ20లకు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్‌ మాలిక్

ఇంగ్లాండ్‌: జోస్ బట్లర్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జొర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, మిల్స్, మ్యాథ్యూ పార్కిన్‌సన్, జాసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీసె టోప్లే, డేవిడ్ విల్లే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని