T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లు.. పరుగుల హోరు.. రికార్డుల జోరు

తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌ (2007)ను భారత్‌ గెలుచుకొంది. ఆసీస్‌ వేదిగా ప్రారంభమైన ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకొనే జట్టేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఆలోపు గత పొట్టి కప్‌ టోర్నీల్లో నమోదైన పలు రికార్డులను తెలుసుకొందాం.. 

Updated : 16 Oct 2022 13:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏడాది కాలం గిర్రున తిరిగింది. గతేడాదే టీ20 ప్రపంచకప్‌ను ఆస్వాదించిన క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మళ్లీ పొట్టి కప్‌ వచ్చేసింది. నిరుడు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. టీమ్‌ఇండియా తొలి ట్రోఫీని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఎనిమిదోసారి జరుగుతున్న టోర్నీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ఆలోపు ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో నమోదైన పలు రికార్డులను తెలుసుకోండి.. 

  1. శతక వీరులు వీరే..: టీ20ల్లో సెంచరీ చేయడమంటే అంత సులువేం కాదు. ప్రపంచకప్‌ వంటి పోటీల్లో ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో తొమ్మిది సెంచరీలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి ఫీట్‌ను క్రిస్‌ గేల్‌ రెండుసార్లు (117, 100) సాధించాడు. ఇక మన టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్‌ రైనా (101) కూడా ఒక శతకం చేయడం విశేషం. అత్యధిక వ్యక్తిగత స్కోరు కివీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్ (123) 2012 వరల్డ్‌ కప్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌పై బాదాడు. ఇతర బ్యాటర్లలో మహేల జయవర్థెనె, అలెక్స్‌ హేల్స్‌, అహ్మద్ షెహ్‌జాద్‌, తమిమ్‌ ఇక్బాల్, జోస్‌ బట్లర్ కూడా సెంచరీ వీరులే. 
  2. అర్ధశతకాలు.. విరాట్ అగ్రస్థానం: శతకం కంటే అర్ధశతకం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 10 హాఫ్‌ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత క్రిస్‌ గేల్‌ (9), రోహిత్ శర్మ (8), జయవర్థెనె (6), డేవిడ్ వార్నర్ (6) టాప్‌ -5లో నిలిచారు. పాక్ కెప్టెన్‌ బాబర్ అజామ్‌ (4) కూడా ఈ రేసులో ఉన్నప్పటికీ.. ఎనిమిదో స్థానంలో కొనసాగడం గమనార్హం. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ విరాట్ కోహ్లీ (319) రికార్డు నమోదు చేశాడు.
  3. అంతా పాతవారే: బ్యాటింగ్‌ దూకుడు చూపించే టీ20 ఫార్మాట్‌లో బంతితో కళ్లెం వేయడమంటే సాధారణ విషయం కాదు. సిక్స్‌, ఫోర్లను బాదడమే పనిగా బ్యాటర్లు బరిలోకి దిగుతారు. అయితే పొట్టి ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు మాత్రం మాజీ క్రికెటర్లపై ఉన్నాయి. శ్రీలంక బౌలర్‌ అజంతా మెండిస్‌ (6/8) పేరిట రికార్డు ఉంది. 2012 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే మీద విజృంభించాడు. వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్‌. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ లంకకు చెందిన హసరంగ (16). అయితే మొత్తం ప్రపంచకప్‌ పోటీల్లో మాత్రం ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షకిబ్ అల్ హసన్ 41 వికెట్లతో రికార్డు తన పేరిట లిఖించుకొన్నాడు. 
  4. భారీ స్కోరు ఆ జట్టుదే: 2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కెన్యాపై 260/6 భారీ స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు పొట్టి వరల్డ్‌ కప్‌లో ఏ జట్టైనా సాధించిన అత్యధిక స్కోరు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ 230/8 చేసింది. 2016లో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సాధ్యమైంది. ఇక టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ రెండు సార్లు 200కిపైగా స్కోరు నమోదు చేసింది. అందులో 2007లోనే ఇంగ్లాండ్‌పై (218/4), గతేడాది అఫ్గానిస్థాన్‌పై (210/2) సాధించింది. 
  5. అత్యల్ప స్కోర్లు..: బ్యాటర్లు పైచేయి సాధించే టీ20 క్రికెట్‌లో బౌలర్ల దెబ్బకు పేకమేడలా కుప్పకూలితే ఎలా ఉంటుందో నెదర్లాండ్స్‌ను చూస్తే అర్థమవుతుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో చెత్త రికార్డైన అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రెండుసార్లు నెదర్లాండ్స్ నిలిచింది. 2014లో లంక మీద కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. అలాగే 2021లోనూ శ్రీలంకపైనే 44 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత భారీ హిట్టర్లు కలిగిన వెస్టిండీస్‌ కూడానూ 55 పరుగులకే (ఇంగ్లాండ్‌ మీద) చేతులెత్తేసింది.
  6. నలుగురే ‘హ్యాట్రిక్’ ధీరులు: ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రపంచకప్‌ పోటీల్లో నలుగురు మాత్రమే హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టారు. అందులో ఆసీస్‌కు చెందిన బ్రెట్ లీ తొలి ప్రపంచకప్‌లోనే ఘనత సాధించగా.. ఐర్లాండ్‌ బౌలర్ కుర్టిస్ కాంఫెర్, శ్రీలంక స్పిన్నర్ హసరంగ, కగిసో రబాడ గతేడాది వరల్డ్‌ కప్‌లో హ్యాట్రిక్‌ తీశారు. అలాగే తొమ్మిది మంది ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. వారిలో అజంత మెండిస్ (6/8), హెరాత్‌ (5/3), ఉమర్ గుల్ (5/6), అహ్సాన్ మాలిక్ (5/19), ఆడమ్ జంపా (5/19), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (5/20), జేమ్స్ ఫాల్కనర్‌ (5/27), లసిత్ మలింగ (5/31) ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. 
  7. సూపర్‌ ఓవర్/బౌలౌట్‌: టీమ్‌ఇండియా తొలి టీ20 ప్రపంచకప్‌ను (2007) నెగ్గిన విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్థాన్‌ మీద గ్రూప్‌ స్టేజ్‌లో బౌలౌట్‌ పద్ధతిలోనే భారత్‌ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ఐసీసీ బౌలౌట్‌ను తీసేసి సూపర్‌ ఓవర్‌ను తీసుకొచ్చింది. అయితే కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి వచ్చింది. రెండుసార్లూ న్యూజిలాండ్‌ ఉండటం గమనార్హం. 2012 టీ20 ప్రపంచకప్‌లోనే శ్రీలంక, వెస్టిండీస్‌ మీద కివీస్‌ సూపర్‌ ఓవర్‌ ఆడింది. పాపం రెండు మ్యాచుల్లోనూ కివీస్‌ ఓటమిపాలైంది. 
  8. అత్యధిక మ్యాచ్‌లు ఆడింది వీరే: టీ20 ప్రపంచకప్‌లో తమ జాతీయ జట్టు తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. అలా శ్రీలంక టాప్‌ బ్యాటర్‌ తిలకరత్న దిల్షాన్‌ (35), షాహిద్‌ అఫ్రిది (34), డ్వేన్ బ్రావో (34), షోయబ్‌ మాలిక్ (34), ఎంఎస్ ధోనీ (33) గేల్ (33), ముస్తాఫికర్‌ రహీమ్ (33), రోహిత్ శర్మ (33), జయవర్థెనె (31), లసిత్ మలింగ (31) ఉన్నారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2022లో పాల్గొనే కెప్టెన్‌ రోహిత్ శర్మ  రికార్డును అధిగమించడం ఖాయం. మరో మూడు మ్యాచ్‌లు ఆడినా టాప్‌ ప్లేయర్‌గా మారిపోతాడు. అయితే కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన రికార్డు మాత్రం ఎంఎస్ ధోనీ (33) పేరిటే ఉంది.
  9. ఒడిసి పట్టేశారు..: ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండే ఏబీ డివిలియర్స్‌ పేరిట అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు ఉంది. 30 మ్యాచుల్లో 23 క్యాచ్‌లు ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మార్టిన్‌ గప్తిల్ (19), డేవిడ్ వార్నర్ (18), రోహిత్ శర్మ (15), స్టీవ్‌ స్మిత్ (14), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (14), రాస్‌ టేలర్ (14) ఉన్నారు. వీరిలో ఏబీడీ, రాస్‌ టేలర్ మినహా మిగతా ఆటగాళ్లు తమ పేరిట కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈసారి వీరంతా బరిలోకి దిగారు. మార్టిన్ గప్తిల్‌, వార్నర్‌ కాస్త చేరువగా ఉన్నారు. 
  10. హిట్టర్లే.. డక్‌ అయ్యారు: భారీ షాట్లు కొడుతూ.. వేగంగా పరుగులు సాధించడంలో సాటిలేని ఆటగాళ్లు.. అయితే వారే అత్యధిక డకౌట్లుగా మారడం విశేషం. పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది, దిల్షాన్‌ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు డకౌట్లు అయిన బ్యాటర్‌. ఐదుసార్లు ‘సున్నా’ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. వీరిద్దరి తర్వాత సిమన్స్ (4), ఆండ్రూ రస్సెల్ (4), సనత్ జయసూర్య (4), లూక్ రైట్ (4), ఆశిశ్‌ నెహ్రా (3) డకౌట్లు అయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని