IND vs AUS: భారత్ X ఆసీస్‌.. రెండో టెస్టులో రికార్డుల మోత మోగేనా..?

భారత్ X ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య దిల్లీ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా (Team India) 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో విజయం సాధించి సిరీస్‌ రేసులో ముందుకు సాగాలని భావిస్తోంది.

Updated : 16 Feb 2023 14:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో (Ind vs Aus) రెండో టెస్టు కోసం భారత్‌ సన్నద్ధమవుతోంది. నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌ (Team India).. రెండో టెస్టులోనూ విజయం సాధించి ముందడుగు వేయాలని ఆశిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరువగా వచ్చిన భారత్‌.. తొలి స్థానం దక్కించుకోవాంటే ఈ విజయం చాలా కీలకం. ఈ క్రమంలో దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో పలు రికార్డులను సొంతం చేసుకొనేందుకు అవకాశం ఉంది.

దాదాపు ఐదేళ్ల తర్వాత దిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్‌ జరగబోతోంది. ఇక్కడ భారత్‌ను కాదని గెలవడం పర్యాటక దేశానికి అంత ఈజీ కాదు. దిల్లీ స్టేడియంలో 1959లో చివరిసారిగా గెలిచిన ఆసీస్‌.. ఇప్పటి వరకు మరొక విజయం సాధించలేకపోయింది. ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, అశ్విన్‌, నాథన్‌ లయన్, స్టీవ్‌ స్మిత్ లు అరుదైన ఘనతలను తమ ఖాతాలో వేసుకొనేందుకు ఇదొక చక్కటి అవకాశం. దిల్లీ మైదానం కూడా నాగ్‌పుర్ మాదిరిగానే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

రికార్డులు, ఘనతలు ఇవీ.. 

* జడేజా కేవలం ఒక్క వికెట్‌ తీస్తే టెస్టుల్లో 250 మార్క్‌ను తాకుతాడు. అలాగే 2500 పరుగులు, 250 వికెట్లు తీసిన రెండో వేగవంతమైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్‌ (51 టెస్టుల్లో) ఈ ఘనతను సాధించగా.. ఇప్పుడు వికెట్‌ తీస్తే 62 టెస్టుల్లో జడేజా కూడా జాబితాలోకి వచ్చేస్తాడు. 

* మరో రెండు వికెట్లు తీస్తే అక్షర్‌ పటేల్‌ పేరిట కూడా ఓ రికార్డు నమోదవుతుంది. అదీనూ రవిచంద్రన్ అశ్విన్‌ తర్వాతే కావడం విశేషం. ప్రస్తుతం 9 టెస్టుల్లో 48 వికెట్లు తీశాడు. ఇంకో రెండు పడగొడితే తక్కువ టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్‌ను తాకిన రెండో భారత బౌలర్‌గా అవతరిస్తాడు. అశ్విన్‌ కేవలం 9 టెస్టుల్లోనే ఈ మార్క్‌ను అందుకొన్నాడు. 

* రవిచంద్రన్ అశ్విన్‌ కూడా మూడు వికెట్లు తీస్తే తన ఖాతాలోనూ ఓ రికార్డు వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియాపై వంద వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. కుంబ్లే మాత్రమే ఆసీస్‌పై 100 వికెట్లు పడగొట్టాడు. మరోసారి 5 వికెట్ల ప్రదర్శన చేస్తే అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశం అశ్విన్‌కు ఉంది. స్వదేశంలో 25 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో సమానంగా ఉన్నారు. 

* బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్‌ లయన్ మారడానికి కేవలం ఐదు వికెట్ల దూరంలో నిలిచాడు. అతడికి దరిదాపుల్లో ప్రస్తుత ఆసీస్‌ బౌలర్లు ఎవరూ లేరు. బ్రెట్‌ లీ మాత్రం 53 వికెట్లు తీశాడు. 

* టెస్టు క్రికెట్‌లో ఆసీస్‌ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్ టాప్‌ -20 జాబితాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరో 73 పరుగులను స్మిత్‌ చేస్తే ఏబీ డివిలియర్స్ (8,765), వీవీఎస్‌ లక్ష్మణ్ (8,781)ను దాటేసి టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల టాప్‌ -20 జాబితాలోకి వచ్చేస్తాడు.

* ఛెతేశ్వర్‌ పుజారా వందో టెస్టు ఆడుతున్న 13వ భారతీయ క్రికెటర్‌గా మారతాడు. ఇప్పుడున్న జట్టు సభ్యుల్లో విరాట్ కోహ్లీ మాత్రమే వంద టెస్టులు ఆడిన ఆటగాడు కావడం విశేషం. ఇక మరో వంద పరుగులు చేస్తే ఆసీస్‌పై 2వేల పరుగులు చేసిన బ్యాటర్‌గానూ పుజారా రికార్డు సృష్టిస్తాడు. ఇలా సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా ఘనత అందుకొంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని