IND vs ENG: ఐసీసీకి చేరిన ఐదో టెస్టు సమస్య.. సాయం చేయాలని కోరిన ఈసీబీ

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసీసీ వాకిలికి చేరింది. ఈ మ్యాచ్‌ భవితవ్యం సిరీస్‌ ఫలితంపై ఆధారపడటంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది...

Published : 12 Sep 2021 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసీసీకి చేరింది. ఈ మ్యాచ్‌ భవితవ్యం సిరీస్‌ ఫలితంపై ఆధారపడటంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్‌ రద్దయిందని ప్రకటిస్తే తమకు 40 మిలియన్‌ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకునే వీలుందని ఆ బోర్డు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీని ఈ విషయంలో సాయం చేయాలని కోరింది.

ఐదో టెస్టుకు ముందు భారత బృందంలో ఒక సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో సీనియర్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించారు. అదే విషయాన్ని బీసీసీఐకి తెలపడంతో ఇరు బోర్డుల మధ్య చర్చలు జరిపి మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే, దీని ఫలితం.. సిరీస్‌పై ఆధారపడటంతో పాటు ఇరు బోర్డులకు సమస్యగా మారింది. మరోవైపు ఇది ఆర్థికంగానూ నష్టం చేకూర్చే వీలుంది. మరోవైపు బీసీసీఐ రద్దయిన ఐదో టెస్టును భవిష్యత్‌లో తిరిగి నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం అధ్యక్షుడు సౌరభ్‌గంగూలీ త్వరలోనే ఇంగ్లాండ్‌కు వెళ్లి ఆ బోర్డు సభ్యులతో సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిరీస్‌ ఫలితంపై పరిష్కారం చూపాలని ఇంగ్లాండ్‌ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.

ఐసీసీ ముందున్న అవకాశాలు..
ఇప్పుడు ఐసీసీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి.

* ఒకవేళ ఐదో టెస్టును గనుక ఐసీసీ పూర్తిగా రద్దు చేస్తే టీమ్‌ఇండియా 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్‌గానే పరిగణిస్తారు.

* టీమ్‌ఇండియానే ఈ మ్యాచ్‌లో ఆడటానికి విముఖత చూపిన నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. చివరి టెస్టులో ఆడటానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా భారత్‌ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లాండ్‌కే కేటాయిస్తారు. దీంతో 2-2తో సిరీస్‌ సమానంగా మారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్‌ బోర్డు ఇన్సూరెన్స్‌ కూడా క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని