T20 World Cup: టీ20 ప్రపంచకప్‌.. టీమ్‌ఇండియా ముందు సవాళ్లు ఇవే!

పొట్టి ప్రపంచకప్‌ కోసం భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేసింది. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది టీ20 సిరీస్‌లతోపాటు ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా ఆడింది.

Published : 13 Oct 2022 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ కోసం భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేసింది. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది టీ20 సిరీస్‌లతోపాటు ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా ఆడింది. ఈ క్రమంలో భారత్‌ ఎదుట కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. 

గత టీ20 ప్రపంచకప్‌ నుంచి ఈసారి జరిగే వరల్డ్‌ కప్‌ వరకు భారత్‌ భారీగానే టీ20లను ఆడింది. అత్యధికంగా ద్వైపాక్షిక సిరీస్‌లను కైవసం చేసుకొంది. కానీ ఆసియా కప్‌లో ఘోర పరాభవం ఎదుర్కొని విమర్శలపాలైంది. రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా న్యూజిలాండ్, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో సిరీస్‌లను కైవసం చేసుకుంది. మొత్తం 35 టీ20 మ్యాచ్‌లను ఆడటం విశేషం. కీలక సమయాల్లో టాప్‌ బ్యాటర్లు, బౌలర్లు మాత్రం చేతులెత్తేయడం మాత్రం ఆగడం లేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ నిలకడలేని ఆటతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్‌ తర్వాత రోహిత్ శర్మ సారథిగా పొట్టి ప్రపంచకప్‌ బరిలో దిగుతున్నాడు. ఈసారైనా జట్టును సమర్థంగా నిర్వర్తించి టీమ్‌ఇండియాకు కప్‌ను అందించాలి.  

బుమ్రా షాక్‌..

వరుసగా భారత్‌ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను గెలిచినా.. ప్రపంచకప్ ముంగిట భారత్‌కు వెలితిగానే ఉంది. అదే డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం. ఇప్పటికే ‘నెర్వస్‌ 19’తో ఇబ్బంది పడుతోన్న భారత్‌ అభిమానులకు షాక్‌ తగలింది. డెత్‌ ఓవర్లలో అండగా నిలుస్తాడని భావించిన జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా బుమ్రా నిష్క్రమణతో భారత్‌కు బౌలింగ్ కష్టాలు రెట్టింపైనట్లే. అలాగే స్టాండ్ బై ఆటగాడు దీపక్ చాహర్‌ కూడా గాయం కారణంగా దూరం కావడం మరో ఎదురు దెబ్బ.

‘డెత్‌’కు పరిష్కారం ఎలా..?

సీనియర్‌ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ చేయగల సమర్థుడు. కానీ డెత్‌లో మాత్రం తేలిపోతున్నాడు. మరీ ముఖ్యంగా 19వ ఓవర్‌ వేసే బౌలర్‌ ధారాళంగా పరుగులు సమర్పిస్తుండటంతో టీమ్‌ఇండియా శిబిరంలో కలవరం కొనసాగుతోంది. బుమ్రాకి ప్రత్యామ్నాయంగా ఎవరు ఉంటారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. ఎందుకంటే సీనియర్‌ బౌలర్‌ మహమ్మద్ షమీ కరోనా బారిన పడి కోలుకున్నాడు. కానీ అతడు ఎంతవరకు ఫిట్‌గా ఉంటాడో ఎన్‌సీఏ ఇచ్చే రిపోర్ట్‌పైనే ఆధారపడి ఉందని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు. అయితే సిరాజ్‌ ఆసీస్‌ పిచ్‌లపై పేస్‌తో రాణిస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు. మిడిల్‌ ఓవర్లలో యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌తో కలిసి హార్దిక్‌ పాండ్య పేస్‌ బౌలింగ్‌ను సమర్థంగా వేయగలడు. చివరి ఐదు ఓవర్లు చాలా కీలకం. మ్యాచ్‌ గతిని మార్చే అవకాశం ఇక్కడే ఉంటుంది. ఏమాత్రం బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించారో స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. అందుకే 16-20 ఓవర్లను వేయడం కత్తిమీద సాములాంటిదని క్రీడా పండితులు చెబుతున్నారు. 

రిషభ్‌ పంత్ ఫామ్‌పైనే చర్చ!

సాధారణంగా క్రికెటర్లు టీ20లు, వన్డేల్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. టెస్టు ఫార్మాట్‌లో ఆచితూచి ఆడుతూ.. క్రీజ్‌లో పాతుకుపోయి పరుగులు రాబడతారు. గతంలో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ఆటగాడు టెస్టుల్లోనూ ధాటిగా ఆడేవాళ్లు అరుదుగా ఉంటారు. తాజాగా టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ కూడా ఇదే కేటగిరీ ప్లేయర్‌. అయితే వీరూ మాత్రం అన్ని ఫార్మాట్లలో దూకుడుగా ఆడేవాడు. కానీ రిషభ్ పంత్ కాస్త వెరైటీగా టెస్టుల్లో ధాటిగా ఆడుతూ.. టీమ్‌ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ దూకుడుగా ఆడాల్సిన టీ20 ఫార్మాట్‌లో మాత్రం పంత్ బ్యాట్‌ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతోంది. టాలెంట్‌పరంగా ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కానీ మిడిలార్డర్‌లో కీలకంగా మారతాడని భావించినా.. ధాటిగా ఆడటంలో విఫలమై తుది జట్టులో స్థానం కోసమే వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హార్డ్‌ హిట్టర్‌గా, ఫినిషర్‌గా పేరొందిన దినేశ్ కార్తిక్‌ వైపు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది. అయితే ఫైనల్‌ టీమ్‌లో కార్తిక్‌తోపాటు రిషభ్ కూడా ఉండాలని పలువురు సూచనలు చేశారు. దాంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఇద్దరినీ ఆడించడం గమనార్హం. 

హార్దిక్‌ హవా కొనసాగాలి

కపిల్‌ దేవ్‌.. ఇర్ఫాన్‌ పఠాన్‌... తర్వాత పేస్‌ ఆల్‌రౌండర్‌గా టీమ్‌ఇండియాకు కీలకంగా మారిన హార్దిక్‌ పాండ్య తన నైపుణ్యాలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడటం పెద్ద విషయం కాదు. కానీ టోర్నమెంట్లలో రాణిస్తేనే ఆటగాడి సత్తా ఏంటో తెలుస్తుంది. గత ఆసియా కప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లో పాక్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను విజయ తీరానికి చేర్చాడు. అయితే ఆ తర్వాత కీలక మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అనుకున్నంత మేర విజయవంతం కాలేకపోయాడు. అయితే  ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా హార్దిక్‌ సొంతం. ఈ క్రమంలో పాండ్య గాయాలపాలు కాకుండా ఉండేందుకు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. పని ఒత్తిడి అధికం కాకుండా జాగ్రత్తలు తీసుకొంది. ఎందుకంటే ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్‌ను రీప్లేస్‌ చేసే ఆటగాడు మరొకరు భారత్‌కు లేకపోవడం గమనార్హం.

చాహల్‌కు ఏమైంది..?

యుజ్వేంద్ర చాహల్‌.. లెగ్‌ స్పిన్నర్‌ ఆసీస్‌ పిచ్‌లపై కీలకంగా మారతాడని అంతా అంచనా వేస్తున్నారు. అక్కడన్నీ పెద్ద మైదానాలు కావడం.. బంతిని ఫ్లైట్‌ చేసి బ్యాటర్‌ను ఊరించేలా చేయగల సమర్థుడు చాహల్. క్యాచ్‌లు ఎక్కువగా లేచే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం పెద్దగా రాణించకపోవడం.. టీమ్‌ఇండియాను నిరుత్సాహపరిచే అంశం.  భారీగా పరుగులు సమర్పించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు అశ్విన్‌కు అవకాశం కల్పించింది. సఫారీల జట్టులో లెఫ్ట్ ఆర్మ్‌ బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో అశ్విన్‌ వైపు మొగ్గు చూపింది. అయితే పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం చాహల్‌ ‘కీ’ ప్లేయర్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

రిజర్వ్‌ బెంచ్‌ బలమెంత?

దీపక్‌ చాహర్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలగడం ఖాయమైంది. ఇంతకుముందు అతడు స్టాండ్‌బై ఆటగాడిగా మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. మరోవైపు బుమ్రా కూడా దూరం కావడంతో షమీని ప్రధాన జట్టులోకి పంపి.. సిరాజ్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే దీపక్ గైర్హాజరీతో ఒకరిని రిజర్వ్‌ బెంచ్‌లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం  టీమ్ఇండియా శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపింది. అందుకే షమీ, సిరాజ్‌తోపాటు శార్దూల్‌ను ఆస్ట్రేలియాకు పంపాలని నిర్ణయించింది. అయితే శనివారం (అక్టోబర్ 15) వరకు మార్పులు చేసుకోవడానికి గడువు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దీపక్ చాహర్‌ టీ20ల్లో ఆల్‌రౌండ్‌ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. అలాంటి దీపక్‌కు బదులు శార్దూల్‌ ఎంపిక సరైందేనని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నా.. చాహర్‌ స్థాయి మాత్రం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్‌ పాండ్యకు గాయమైతే పేస్‌ ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ మాత్రమే రిజర్వ్‌ బెంచ్‌లో ఉంటాడు. కానీ శార్దూల్‌ ఇటీవల వన్డేల్లో ఆడినప్పటికీ.. భారత మెగా లీగ్‌లో తప్ప టీ20ల్లో పెద్దగా ప్రాతినిధ్యం వహించారు. రిజర్వ్‌ బెంచ్‌లో బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్.. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఉండగా.. తాజాగా సిరాజ్‌ (ఫాస్ట్‌ బౌలర్‌), శార్దూల్ ఠాకూర్ (పేస్ ఆల్‌రౌండర్) వచ్చి చేరతారు.

నిలకడలేమి ప్రధాన సమస్య

ద్వైపాక్షిక సిరీసుల్లో అప్రతిహతంగా విజయపథంలో సాగిపోతున్న టీమ్‌ఇండియాకు ప్రధాన సమస్య నిలకడలేమి. ఫలానా బ్యాటర్‌ స్థిరంగా ఆడతాడని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ అదరగొట్టేస్తున్నప్పటికీ.. ఓపెనింగ్‌లో ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్‌, రోహిత్ శర్మ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంచనాకు దొరకడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ మెగా టోర్నీల్లో విఫలమవడం భారత్‌ను కలవరానికి గురి చేసే అంశం. ఇక లోయర్‌ఆర్డర్‌లో హార్దిక్‌ కూడా పెద్దగా నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఏదో ఒక మ్యాచ్‌లో మెరవడం.. ఆ తర్వాత తేలిపోవడం టీమ్‌ఇండియా బ్యాటర్లకు అలవాటుగా మారిందని మాజీలు విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా గత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని