Team India: టాప్‌ ఆర్డర్‌లో ఒక్కడే ఆడితే ఎలా... ‘ఇందౌర్‌’ పరాజయం భారత్‌లో మార్పు తెస్తుందా?

ఆస్ట్రేలియా (Australia) సిరీస్‌లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌తో రెండు టెస్టులు గట్టెక్కిన భారత్‌ (Team India).. మూడో టెస్టు (India vs Australia 3rd Test)లో కుదేలైంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లోపం ఉందని తెలిసినా.. మూడో టెస్టులో అది కొట్టొచ్చినట్లు కనిపించింది.  

Updated : 06 Mar 2023 15:33 IST

టీమ్‌ ఇండియా (Team India) బ్యాటింగ్‌లో డెప్త్‌ ఎక్కువ. ముగ్గురు స్పిన్‌ ఆల్‌రౌండర్లు (Jadeja, Ashwin, Axar) ఉండటంతో ఆ అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ధీమానే భారత్‌ను దెబ్బకొట్టిందా? ఇండోర్‌ టెస్టు (Indore Test)లో ఫలితం చూశాక ఇదే అనిపిస్తోంది. 

భారత్‌ (Team India) టాప్‌ ఆర్డర్‌ ప్రదర్శన గత కొన్ని రోజులుగా ఏమంతగా బాలేదు. లోయర్‌ ఆర్డర్‌ అద్భుతమైన ప్రదర్శన వల్లనో, బౌలర్ల విజృంభణ వల్లో గెలుస్తూ వస్తోంది. ఆస్ట్రేలియా (Australia)తో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) కోసం తలపడుతున్న భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ను పేపర్‌ మీద రాస్తే.. KGF సినిమాలోని ఎలివేషన్‌ సీన్స్‌ కంటే తక్కువేం ఉండదు. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్య కుమార్‌ యాదవ్‌.. ఇలా అందరూ స్టార్‌ ఆటగాళ్లే. వీళ్లంతా ప్రపంచస్థాయి ప్రదర్శనతో ప్రత్యర్థికి చెమటలు పట్టించేవాళ్లే. కానీ గన్‌లో ఆరు బులెట్లు ఉండి.. ఒకటే పేలుతుంది.. మిగిలినవన్నీ తుస్‌ మంటాయి అంటే ఎలా? ఇప్పుడు టీమ్‌ ఇండియాలోనూ అంతే. ఒక టెస్టులో ఒకరు బాగా ఆడితే.. మరో టెస్టులో ఇంకొకరు ఆడుతున్నారు.

గత ఐదు ఇన్నింగ్స్‌లు చూస్తే ఈ విషయం మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆసీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు.  ఎవరికి వారు రావడం, పరుగులు కొట్టడం, వెళ్లిపోవడం. ఇదే తంతు. పార్ట్‌నర్‌ షిప్‌లు బిల్డ్‌ చేసి.. పెద్ద స్కోర్‌ చేసే ఆలోచన ఉన్నట్లు కనిపించలేదు. అయితే ఇదే సమయంలో మన స్టార్‌ ఆల్‌రౌండర్ల నుంచి మంచి పరుగులు  కనిపిస్తున్నాయి, పార్ట్‌నర్‌ షిప్‌లూ కనిపిస్తున్నాయి. పనిలో పనిగా వారి ప్రదర్శన వల్ల విజయాలూ వస్తున్నాయి. 

వెయిటింగ్‌ గేమ్ ఆడలేక...

క్రికెట్‌ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాటే.. టెస్టుల్లో ఎంతసేపు క్రీజులో నిలిస్తే అంత బాగా ఆడగలరు అని. అయితే దానికి ఓపిక కావాలి. మన జట్టులో ఆ ఓపిక ఏడో డౌన్‌ తర్వాతే వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే టాప్‌ ఆర్డర్‌లో పెద్దగా కనిపించడం లేదు కాబట్టి. ఒక టెస్టులో ఎక్కువసేపు నిలబడి మంచి పరుగులు చేశాడు, ఇక కుదురుకున్నట్లే అనుకోవడమే ఆలస్యం.. తర్వాతి ఇన్నింగ్స్‌లోనో, టెస్టులోనే ఆ ఆటగాడు బోల్తాపడుతున్నాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ వేసిన లోయర్‌ ఆర్డర్‌ వాళ్లకూ వేస్తున్నారుగా అనే డౌట్‌ కచ్చితంగా వస్తుంది. అయితే మరి లోయర్‌ ఆర్డర్‌ ఇండోర్‌ టెస్టులో భారత్‌ను ఎందుకు గెలిపించలేదు అనే ప్రశ్న రావొచ్చు. వాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించలేదు కాబట్టే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది అనేది విశ్లేషకుల అంచనా.

టాప్‌ ఆర్డర్‌లో ఏ మ్యాచ్‌లో ఎవరు ఆడారంటే...

  • తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ (120)తో కదం తొక్కాడు. మిగిలిన టాప్‌ ఆర్డర్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. అయితే రవీంద్ర జడేజా (70), అక్షర్‌ పటేల్‌ (84) అర్ధ శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు. 
  • రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ (44)నే టాప్‌ ఆర్డర్‌లో రాణించాడు. ఇక్కడ అక్షర్‌ పటేల్‌ (74), అశ్విన్‌ (37), జడేజా (26) తోడవడంతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు వచ్చి.. విజయం లభించింది.  
  • ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చూస్తే.. ఇటు టాప్‌ ఆర్డర్‌, అటు లోయర్‌ ఆర్డర్‌లో ఎవరూ అర్ధ సెంచరీ వరకు వెళ్లలేకపోయారు. ఆ మాటకొస్తే ముచ్చటగా 30 పరుగులు కూడా దాటలేదు. 
  • మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి ఛెతేశ్వర్‌ పుజారా (59) అర్ధ శతకంతో జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. టాప్‌ ఆర్డర్‌లో మిగిలిన వాళ్లు ఎప్పటిలాగే త్వరగా ఔటయ్యారు. మరోవైపు మన ముగ్గురు స్పిన్‌ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. 

గత 3 టెస్టుల్లో భారత్‌ బ్యాటింగ్‌ తీరు

అన్నిసార్లు లోయర్‌ ఆర్డర్‌ కాపాడుతుందని అనుకోవడం, ఆశించడమూ తప్పే. టాప్‌ ఆర్డర్‌ సరైన పునాది వేస్తే లోయర్‌ ఆర్డర్‌ దాని మీద ఏదో ఒకటి చేయగలుగుతుంది. కీలకమైన WTC ఫైనల్స్‌ అవకాశం సంపాదించాలన్నా, ఒకవేళ సాధించి ఫైనల్‌లో గెలవాలన్నా.. మన బ్యాటర్లు అందులోనూ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విజృంభించాలి. ఈ అద్భుతమైన సన్నివేశం అహ్మదాబాద్‌ టెస్టులో జరుగుతుందని ఆశిద్దాం! 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని