T20 League: ఉత్కంఠ రేపుతున్న ప్లేఆఫ్స్‌ బెర్తులు

భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్‌ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్‌లో కొనసాగుతూ ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖాయం...

Updated : 07 May 2022 14:45 IST

వరుసగా ఓడిపోతున్న టాప్‌ జట్లు

భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్‌ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్‌లో కొనసాగుతూ ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖాయం చేసుకునేలా కనిపించిన ఫేవరెట్‌ జట్లు ఇప్పుడు అనూహ్యంగా ఓటముల పాలవుతున్నాయి. దీంతో లీగ్‌స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కడ నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలున్న జట్లు.. వరుస వైఫల్యాలకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..


గుజరాత్‌ ఇలాగే ఆడితే..

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో ఇన్ని రోజులు వరుస విజయాలతో దూసుకుపోయిన గుజరాత్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండి.. ప్లేఆఫ్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నప్పటికీ.. ఈ ఓటములు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ముంబయి, పంజాబ్‌ చేతుల్లో ఓటమిపాలైంది. దీంతో ఇదే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయంగా మారింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ వైఫల్యమే గుజరాత్‌ కొంపముంచింది. ఆ జట్టుకు మిడిల్‌ ఆర్డర్‌లో వెన్నెముకలా ఉండే డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా లాంటి ఆటగాళ్లు ఉన్నా శుక్రవారం రాత్రి ముంబయితో ఆడిన మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఒకవేళ ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌ ఇలాగే విఫలమైతే పాయింట్ల పట్టికలో టాప్‌-4లో వెనుకబడే ప్రమాదం ఉంది.


రాజస్థాన్‌ మెరుగవ్వకుంటే..

బ్యాటింగ్‌లో జోస్‌బట్లర్‌ చెలరేగుతుండటంతో అద్భుత విజయాలు సాధించి టాప్‌ రెండులోకి దూసుకుపోయిన రాజస్థాన్ ఇటీవల వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా చివర్లో కొనసాగుతున్న కోల్‌కతా, ముంబయి చేతుల్లోనే విఫలమవ్వడం గమనార్హం. బ్యాటింగ్‌లో బట్లర్‌ లేదంటే కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాత్రమే రాణిస్తున్నారు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తర్వాత వచ్చే డారిల్‌ మిచెల్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నా విఫలమవుతున్నారు. దీంతో రాజస్థాన్‌ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నా ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో ఇలాగే ఆడితే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి.


హైదరాబాద్‌ పరిస్థితి ఇదీ..

తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలు సాధించి అభిమానుల్లో సంతోషం నింపింది. కానీ, గత మూడు మ్యాచ్‌ల్లో మళ్లీ ఓటములపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విలియమ్సన్‌ నేతృత్వంలో బ్యాటింగ్‌ పరంగా బాగున్నా.. బౌలింగ్‌లోనే ధారాళంగా పరుగులిస్తోంది. ఇటీవల ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోని గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. బౌలింగ్‌లో కాస్త జాగ్రత్త పడితే హైదరాబాద్‌ పుంజుకునే వీలుంది. ఒకవేళ ఈ విషయంలో మార్పు చేసుకోకపోతే గతేడాదిలాగే ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో కనీసం 3 గేమ్స్‌ తప్పక గెలవాలి.


బెంగళూరు గాడిలో పడాలి..

ఇక బెంగళూరు సీజన్‌ ఆరంభంలో పలు విజయాలతో మంచి స్థితిలో నిలిచినా మధ్యలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటములపాలై కాస్త కంగారు పెట్టింది. కానీ, గత మ్యాచ్‌లో చెన్నైపై గెలుపొంది మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. టాప్ ఆర్డర్‌లో కోహ్లీ, అనూజ్‌ రావత్, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్‌ ఆర్డర్‌లో మొదట్లో దంచికొట్టి భారీ అంచనాలు నెలకొల్పిన దినేశ్‌ కార్తీక్‌ సైతం ఇటీవల రాణించలేకపోతున్నాడు. అతడు మళ్లీ బ్యాట్‌ ఝుళిపిస్తే తప్ప ఆ జట్టు పూర్తి స్థాయిలో గాడిలో పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్‌లో టాప్‌ రెండులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. లేదంటే మిగతా జట్లతో పోటీపడాల్సి ఉంటుంది.


రేసులోకి దూసుకొస్తున్న దిల్లీ, పంజాబ్‌..

మరోవైపు నిన్న మొన్నటి వరకు దిగువ స్థాయిలో కొనసాగిన దిల్లీ, పంజాబ్‌ జట్లు ఒక మ్యాచ్‌ గెలుస్తూ, ఒక మ్యాచ్‌ ఓడిపోతూ పాయింట్ల పట్టికలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు జట్లూ హైదరాబాద్‌ మాదిరే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదేసి విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇకపై ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో గట్టి పోటీనివ్వాలి. కానీ, ఈ జట్ల పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో వీరు టాప్‌-4లో నిలవాలంటే శక్తికి మించి రాణించాలి.   

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని