Virat Kohli: నా టీ20 గేమ్‌ గురించి కొందరి భావన అదే: విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) రెండు శతకాలు సాధించాడు. అయినా, బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలం కావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన టీ20 ఆటతీరుపై విరాట్ (Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 22 May 2023 14:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో (IPL) అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు సృష్టించాడు. క్రిస్‌ గేల్‌ (6 శతకాలు)ను అధిగమించి తాజాగా గుజరాత్‌పై ఏడో సెంచరీ కొట్టాడు. అయితే, గుజరాత్‌ చేతిలో ఓటమి మాత్రం తప్పలేదు. శుభ్‌మన్‌ గిల్ కూడా సెంచరీ చేసి గుజరాత్‌ను గెలిపించాడు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అయినా, విరాట్ ఇన్నింగ్స్‌ మాత్రం అద్భుతం. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో విరాట్ (639 పరుగులు) మూడోస్థానంలో నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌పై వరుసగా రెండు శతకాలు సాధించిన బ్యాటర్‌గానూ అవతరించాడు. ఈ క్రమంలో తన టీ20 క్రికెట్‌ ఆటతీరుపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘చివరి లీగ్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం బాగుంది. అయితే, బెంగళూరు ఓడిపోవడం మాత్రం బాధించే అంశమే. చాలా మంది నా టీ20 క్రికెట్‌లో వేగం తగ్గిపోతుందని అనుకుంటున్నారు. అయితే, నాకేమీ అలా అనిపించడం లేదు. ఇప్పుడు నా అత్యుత్తమ టీ20 క్రికెట్‌ ఆడుతున్నట్లు ఉంది. ఆటను ఎంజాయ్ చేస్తున్నా. పొట్టి ఫార్మాట్‌లో ఖాళీల్లో బంతిని పంపించడంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా భారీ షాట్లు కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నా ఆట తీరుతో చాలా సంతృప్తిగా ఉన్నా. వర్షం గురించి ఆందోళన పడలేదు. నా ఫోకస్‌ అంతా మ్యాచ్‌ జరగడంపైనే ఉంది. జట్టు విజయం కోసం ఏం చేయాలనే దాని గురించి ఆలోచించా’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

నమ్మకం ఉంచా: శుభ్‌మన్‌ గిల్

‘‘ప్రస్తుతం నేను చాలా మంచి ఫామ్‌లో ఉన్నా. శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచడం సంతోషంగా ఉంది. తొలి అర్ధభాగంలో ఎక్కువగా 40లు, 50లు మాత్రమే చేశా. కీలక సమయంలో భారీ స్కోర్లు నమోదు చేయగలుగుతున్నా. టీ20 క్రికెట్‌లో షాట్లు కొడుతూనే ఉండాలి. పరుగులు సాధించగలననే నమ్మకంతో ఆడాల్సి ఉంటుంది. బెంగళూరుతో మ్యాచ్‌లో తేమ ప్రభావం అధికంగా ఉంది. వారి బౌలర్లు సరైన ప్రాంతంలో బంతులను సంధించడానికి చాలా శ్రమించారు. విజయ్‌ శంకర్‌ అద్భుతంగా ఆడాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నా’’ అని గిల్ చెప్పాడు. 

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

* ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు కావడం ప్రస్తుత సీజన్‌లో రెండోసారి. ప్రతి సందర్భంలోనూ విరాట్‌ కోహ్లీ ఉండటం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనా విరాట్ సెంచరీ కొట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా శతకం బాదాడు. 

* గుజరాత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్ (104*)అవతరించాడు. ఇదే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పైనే గిల్ 101 పరుగులు చేశాడు. 

* వరుసగా రెండు శతకాలు చేసిన ఇద్దరు బ్యాటర్లు ఒకే సీజన్‌లో ఉండటం విశేషం. విరాట్ కోహ్లీ, గిల్ శతకాలు చేశారు. గతంలో 2020 సీజన్‌లో శిఖర్ ధావన్‌, జోస్‌ బట్లర్ 2022 సీజన్‌లో రెండేసి సెంచరీలు సాధించారు. 

* గుజరాత్‌ తరఫున ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్. ఈ మ్యాచ్‌లో గిల్ 8 సిక్స్‌లు కొట్టాడు. తొలి స్థానంలో రషీద్‌ ఖాన్‌ 10 సిక్స్‌లతో ఉన్నాడు. 

* ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం చేసిన జోడీగా విరాట్ కోహ్లీ - ఫాఫ్‌ డుప్లెసిస్‌ నిలిచారు. వీరిద్దరూ 939 పరుగులను జోడించారు. గతంలో (2016 సీజన్‌లో) విరాట్ - ఏబీ డివిలియర్స్‌ 939 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.

* గుజరాత్‌ టైటాన్స్‌ 17 మ్యాచుల్లో లక్ష్య ఛేదనకు దిగగా.. 14 మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని