Virat Kohli : చేతికి స్టిచ్చెస్‌తో ఆడి.. అద్భుత సెంచరీ బాది.. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ గుర్తు చేసిన మాజీ ఆటగాడు

ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు జట్టుతో విరాట్‌ కోహ్లీ(Virat Kohl) ప్రయాణం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు.. ఆటపట్ల అతడి అంకితభావాన్ని గుర్తు చేశారు

Updated : 29 Mar 2023 19:19 IST

(ఫొటో : ఆర్సీబీ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ(Virat Kohli)కి.. ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు(RCB) జట్టుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ జట్టుతో అతడి అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో అతడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోకపోయినప్పటికీ.. ఈ మెగాటోర్నీలో బెంగళూరును విలువైన జట్టుగా అభిమానులు ఆదరిస్తున్నారంటే అందుకు కారణం కోహ్లీనే. అంకితభావం, అద్భుతమైన ఆటతీరు, గొప్ప నాయకత్వంతో ఆ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు విరాట్‌.

ఆర్సీబీతో కోహ్లీ ప్రయాణం 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ క్రీడా ఛానల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జట్టుతో విరాట్‌కు ఉన్న అనుబంధాన్ని మాజీ ఆటగాళ్లు గుర్తుచేసుకున్నారు. మాజీ ఆల్‌రౌండర్‌ సంజయ్‌ బంగర్‌(Sanjay Bangar) 2016 నాటి ఘటనను గుర్తుచేసుకొని కోహ్లీకి ఆట పట్ల ఎంత అంకితభావం ఉందో తెలియజేశాడు. చేతి గాయంతో బాధపడుతూ.. నొప్పిని పంటి బిగువనే అదిమిపట్టి సెంచరీ బాదిన అతడి ఆటతీరును వివరించాడు. ‘ఆ మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌తో అనుకుంటా.. చేతికి స్టిచ్చెస్‌తోనే కోహ్లీ బ్యాట్‌ పట్టాడు. వీరవిహారం చేసి 50 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడి ఆట తీరు అద్భుతం’ అంటూ బంగర్‌ మెచ్చుకున్నాడు.

వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 146 పరుగుల భాగస్వామ్యంతో కోహ్లీ, గేల్‌ చెలరేగి ఆడి.. జట్టుకు 15 ఓవర్లలోనే 211 పరుగులు భారీ స్కోరును చేసి పెట్టారు. అనంతరం పంజాబ్‌ను 120 పరుగులకే కట్టడి చేయడంతో 82 పరుగుల(DLS) తేడాతో కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది.

2008లో కోహ్లీ తన ఐపీఎల్‌ ప్రయాణాన్ని బెంగళూరు జట్టుతో ప్రారంభించాడు. 2013-21 మధ్య కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం డుప్లెసిస్‌ సారథ్యంలో అతడు ఆడుతున్నాడు. ఇక 16వ ఐపీఎల్‌(IPL-2023) సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని