IND vs PAK: అక్టోబర్‌ 23 ఎంతో ప్రత్యేకం.. ఎప్పుడూ లేనంత శక్తి వచ్చినట్లుంది: విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియా సెమీస్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌ మీద ఆడిన ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని విరాట్ కోహ్లీ తన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 

Published : 26 Nov 2022 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. పొట్టి కప్‌లో భారత్‌ సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్‌ స్టేజ్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించడంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఒక్క మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీ ఆసాంతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీకి పాక్‌పై చేసిన 82* పరుగులు ప్రత్యేకమైనవి. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి భారత్‌కు విజయం చేకూర్చి పెట్టాడు. ఈ క్రమంలో అప్పటి మ్యాచ్‌ను మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గుర్తుకు తెచ్చాడు. 

‘‘ అక్టోబర్ 23వ తేదీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు చాలా మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఎప్పుడూలేనంత బలమొచ్చినట్లు అనుభూతి కలిగింది. ఆ సాయంత్రం అద్భుతం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేశాడు. ఏడు ఓవర్లకే 31 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయిన భారత్‌ను హార్దిక్ పాండ్యతో (40)తో కలిసి విరాట్ నిలబెట్టాడు. షహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, హారిస్ రవుఫ్ వంటి పేసర్లను తట్టుకొని అజేయంగా నిలిచాడు. పొట్టి కప్ టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌ కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని