Sikandar Raza: విరాట్‌ను అధిగమించాడు.. పాక్‌ను పడగొట్టాడు.. ఎవరీ సికందర్ రజా!

సికందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వే క్రికెట్‌లో సంచలనం. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ను జింబాబ్వే ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను తుడిచి పెట్టాడు. జింబాబ్వే జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు.

Published : 30 Oct 2022 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌లో పుట్టి.. పాక్‌ క్రికెట్‌ జట్టునే గడగడలాడించిన సికందర్‌ రజా.. ఇప్పుడు జింబాబ్వేలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆల్‌రౌండర్‌. కీలకమైన పోరులో మూడు వికెట్లు తీసి పాక్‌పై సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. జింబాబ్వే మ్యాచ్‌ గెలిస్తే చాలు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు రజాదే. అంతలా జింబాబ్వే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సికిందర్ రజా టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించేశాడు. మరి ఆ రికార్డు ఏంటి.. అతడి ప్రస్థానం ఎలా ప్రారంభమైందో కూడా తెలుసుకోండి.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ సియాల్‌కోట్‌లో 1986లో జన్మించిన సికందర్‌ రజా.. అక్కడి ఎయిర్‌ఫోర్స్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. అయితే 2002లో అతడి కుటుంబం జింబాబ్వేకి వలస వచ్చేసింది. దేశీయ పోటీల్లో అత్యద్భుత ప్రదర్శనతో జింబాబ్వే జాతీయ క్రికెట్‌ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2013లో జాతీయ జట్టుకు ఎంపికైన సికందర్ రజా ఇప్పటి వరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. 

కోహ్లీని ఎలా అధిగమించాడంటే..

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జింబాబ్వే నాలుగు మ్యాచ్‌లను ఆడింది. మరొక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. అర్హత మ్యాచుల్లో మూడు.. సూపర్ -12 దశలో ఒక దాంట్లో తలపడింది. మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌ను ఓడింది. గెలిచిన అన్ని మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌’ విన్నర్‌గా సికందర్ రజా రికార్డు సృష్టించాడు. ఇలా ఒకే ప్రపంచకప్‌లో మూడుసార్లు ఇలాంటి అవార్డు అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ 2016 పొట్టి కప్‌లో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అలాగే ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్‌లో విరాట్ 6 అవార్డులను అందుకోగా.. సికందర్‌ రజా ఇప్పటికే ఏడింటిని సొంతం చేసుకొని మరో రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో విరాట్ కూడా ఒక అవార్డు అందుకొన్న విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈసారి వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. 

 

జింబాబ్వే తరఫున 2013లో అరంగేట్రం చేసిన సికందర్ రజా మరుసటి ఏడాదే వన్డేల్లో తొలి శతకం బాదాడు.  2015లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే తర్వాత సంవత్సరం నుంచి గతేడాది వరకు దాదాపు ఆరేళ్లపాటు ఒక్క శతకం లేకుండా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం శక్తిసామర్థ్యాలను ఈ ఏడాదే ప్రయోగించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు శతకాలు బాదేయడమే కాకుండా.. 645 పరుగులు సాధించాడు. అందులో టీమ్‌ఇండియాపైనా ఒక సెంచరీ ఉంది. అలాగే టీ20 ఫార్మాట్‌లోనూ 20 ఇన్నింగ్స్‌ల్లో ఐదు అర్ధశతకాలతో 661 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌లో 1,185 పరుగులు చేయగా.. ఈ ఏడాదిలోనే సగాకిపైగా చేయడం విశేషం.

బంగ్లాదేశ్‌ను చితక్కొట్టడంతో వెలుగులోకి.. 

దాదాపు పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. రాని క్రేజ్‌ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌తోపాటు ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో వచ్చింది. మూడువన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాపై వరుస పెట్టి శతకాలు బాది జింబాబ్వేకు సిరీస్‌ను సాధించి పెట్టాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన సందర్భంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతం. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైతే.. బౌలింగ్‌లో రాణించైనా సరే కీలక పాత్ర పోషించడం విశేషం. పాకిస్థాన్‌ మీద సంచలన విజయం సాధించిన మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో విఫలమైన సికందర్‌ రజా.. బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను గెలిపించాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం జింబాబ్వే సూపర్‌ -12 దశలో అద్భుతాలు చేసే జట్టుగా మారడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని