T20 League: ప్లేఆఫ్స్కు చేరేదెవరు.. పోటీలో నిలిచేదెవరు?
భారత టీ20 లీగ్ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఈ మెగా సందడి ఇంకో 30 రోజుల పైనే సాగనుంది. ఇప్పటికే 37 మ్యాచ్లు పూర్తవ్వగా ఇంకా 33 మ్యాచ్లు మిగిలున్నాయి...
భారత టీ20 లీగ్ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఈ మెగా సందడి మరో 30 రోజులకు పైగా సాగనుంది. ఇప్పటికే 37 మ్యాచ్లు పూర్తవ్వగా ఇంకా 33 మ్యాచ్లు మిగిలున్నాయి. అయితే, అప్పుడే ప్లేఆఫ్స్ చేరే జట్లేవో ఓ అంచనాకు వచ్చేసింది. ఈ సీజన్లో కొత్తగా రెండు జట్లు చేరడంతో టోర్నీ ఎలా ఉంటుందోనని ఎదురుచూసిన అభిమానులకు పసందైన వినోదం అందిస్తోంది. గొప్ప పేరున్న జట్లు తేలిపోగా ఏమాత్రం అంచనాల్లేని జట్లు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరు ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందో చూద్దాం..
ప్రతి సీజన్లాగే ఈసారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు సాధించాలి. అంటే ఏడు మ్యాచ్ల్లో తప్పక గెలవాలి. ఒకవేళ నాలుగు కన్నా ఎక్కువ జట్లు 14 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్రన్రేట్ కీలకంగా మారుతుంది. ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్లే నాకౌట్ దశకు చేరుకుంటారు. మరోవైపు ఇప్పటికే అన్ని జట్లు 7, 8 మ్యాచ్లు పూర్తి చేసుకోగా ముంబయి మినహా మిగతావన్నీ ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలున్నాయి. ఇందులో గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ తేలిగ్గా చేరుకునే వీలుంది. దీంతో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
* గుజరాత్: ఏమాత్రం అంచనాల్లేని కొత్త జట్టు గుజరాత్ ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి టాప్లో దూసుకుపోతోంది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ జట్టు బలం చూస్తోంటే ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిచినా చాలు. అప్పుడు మొత్తం 18 పాయింట్లతో నిలిచే అవకాశం ఉంది. దీంతో తేలిగ్గానే ప్లేఆఫ్స్ చేరుతుంది.
* హైదరాబాద్: తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సినవి ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. వీటిల్లో కనీసం మూడు గెలిచినా 16 పాయింట్లతో నిలుస్తుంది. దాంతో హైదరాబాద్ అవకాశాలకు ఢోకా లేదు.
* రాజస్థాన్: హైదరాబాద్లాగే రాజస్థాన్ కూడా ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కానీ, రన్రేట్ పరంగా కాస్త వెనుకపడటంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్ల్లో ఈ జట్టు 3 గెలిచినా 16 పాయింట్లతో టాప్ ఫోర్లో చోటు దక్కించుకునే వీలుంది.
* లఖ్నవూ: గుజరాత్లాగే ఈసారి కొత్తగా వచ్చిన జట్టు లఖ్నవూ. ఇది కూడా బాగా రాణించడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి మొత్తం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్ల్లో సగం గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ, అప్పుడు ఇతర జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లఖ్నవూ వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాలి.
* బెంగళూరు: లఖ్నవూలాగే బెంగళూరు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. అయితే, రన్రేట్ పరంగా వెనుకపడిపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి రన్రేట్ మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి స్థానాల్లో ఉన్న దిల్లీ, కోల్కతా, పంజాబ్ జట్లు దీన్ని వెనక్కినెట్టే ప్రమాదం లేకపోలేదు.
* పంజాబ్: ఏటా ప్లేఆఫ్స్ కూడా చేరకుండా తీవ్ర నిరాశతో ఇంటిముఖం పట్టే పంజాబ్ ప్రదర్శన ఈ సారి మిశ్రమంగా ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. దీంతో 8 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జట్టు ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం మూడు విజయాలు సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే, నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసే వీలుంది.
* దిల్లీ: గత కొద్ది సీజన్ల నుంచి వరుసగా ప్లేఆఫ్స్కు చేరుకుంటున్న దిల్లీ ఈసారి కొంచెం గాడితప్పినట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సిన 7 మ్యాచ్ల్లో కనీసం 4 గెలిస్తే చివరికి 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ, అంతటితో సరిపెట్టుకుంటే టాప్ ఫోర్లో నిలవడం చాలా కష్టం. కాబట్టి ఇది కూడా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు సొంతం చేసుకోవాలి.
* కోల్కతా: గతేడాది రన్నరప్గా నిలిచిన కోల్కతాపై భారీ అంచనాలున్నా ఈ సీజన్లో పూర్తిగా తడబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో కోల్కతా ప్లేఆఫ్స్లో ఉండాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం నాలుగు గెలవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన శక్తికి మించి పోరాడాలి.
* చెన్నై: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్ల్లో 2 విజయాలే సాధించి కేవలం 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా చెన్నై ప్లేఆఫ్స్ ఆవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే చెన్నై తన 6 మ్యాచుల్లో 5 గెలవాలి. అప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆరింట్లో 5 గెలవడం జడేజా సేనకు కష్టమే. ఒకవేళ సోమవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలిచి ఉంటే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ ఆ మ్యాచ్లో చెన్నై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ చివరలో చేతులెత్తేసింది.
* ముంబయి: ముంబయి ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. తాజాగా లఖ్నవూతో ఆడిన మ్యాచ్లో ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు అవకాశాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్లు గెలిచినా అది ప్లేఆఫ్స్కు చేరే అవకాశం లేదు. కానీ, అనూహ్యంగా పుంజుకొని మూడు, నాలుగు విజయాలు సాధించినా.. దాని ప్రభావం ఇతర జట్లపై పడుతుంది. కాబట్టి ఒక విధంగా ముంబయి నుంచి వేరే జట్లకూ ప్రమాదం పొంచి ఉంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.