ODI WC 2023: ఇలాంటి ఉత్కంఠ ఎక్కడ?.. వన్డే ప్రపంచకప్‌లో ఏకపక్ష మ్యాచ్‌‌లతో అభిమానుల్లో నిరాసక్తత

వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి.

Published : 29 Oct 2023 10:11 IST

వన్డే ప్రపంచకప్‌‌లో (ODI World Cup 2023) సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి. అంతా బాగానే ఉంది కానీ.. ప్రపంచకప్‌లో ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌లు ఎన్ని అని చూస్తే వేళ్ల మీద లెక్కబెట్టడం కూడా కష్టమవుతోంది. హోరాహోరీ పోరాటాలు లేకుండా.. చాలా వరకు ఏకపక్షంగా సాగిపోతూ.. ఫలితం మీద అసలు ఉత్కంఠ అన్నదే లేకుండా సాగిపోతున్న టోర్నీ సగటు క్రికెట్ అభిమానుల్లో నిరాసక్తతకు కారణమవుతోంది.

శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచకప్‌లో ఇది 26వ మ్యాచ్. కానీ ఇప్పటిదాకా జరిగిన 25 మ్యాచ్‌ల్లో లేని ఉత్కంఠను ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లోనే అనుభవించారు. నిజానికి ఇది కూడా ఏకపక్షంగా ముగిసే మ్యాచ్ లాగే కనిపించింది. అయిదు వికెట్లు చేతిలో ఉండగా.. 80 బంతుల్లో 36 పరుగులు చేయడం ఒక లెక్కా అనుకున్నారు. కానీ పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని వరుసగా వికెట్లు తీస్తూ పోటీలోకి వచ్చింది. మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చింది. దక్షిణాఫ్రికా చేతిలో ఒక్క వికెట్టే ఉండగా 27 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో ఫలితం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లలో బంతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రపంచకప్ మొదలయ్యాక ఏ మ్యాచ్‌లోనూ లేని ఉత్కంఠ ముగింపు ఈ మ్యాచ్‌కు లభించింది. శనివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ఆసీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని(389) ఛేదించే క్రమంలో కివీస్‌.. చివరి బంతి వరకూ పోరాడింది. చివరి ఓవరు వరకూ విజయం ఇరు జట్లను ఊరించినా.. ఆఖరికి ఆసీస్‌ 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌లు చూశాక కానీ.. ప్రపంచకప్‌లో ఏం మిస్సవుతున్నామో ఇప్పటివరకూ అభిమానులకు అర్థం కాలేదు.

సంచలనాల్లోనూ ఏకపక్షాలే..

ఈ ప్రపంచకప్‌లో కొన్ని సంచలన ఫలితాలు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టు.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోయింది. నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించింది. అఫ్గాన్, పాకిస్థాన్ మీదా సంచలన విజయం సాధించింది. కానీ ఇలాంటి సంచలన ఫలితాల్లో కూడా మ్యాచ్‌లేమీ ఉత్కంఠభరితంగా జరగలేదు. అఫ్గానిస్థాన్ ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఇక దక్షిణాఫ్రికా మీద నెదర్లాండ్స్ కూడా 38 పరుగుల తేడాతో నెగ్గడాన్ని బట్టి ఆ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో మిల్లర్ వికెట్ పడగానే దక్షిణాఫ్రికా ఓటమి తప్పదని ముందే అర్థమైపోయింది. పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ కూడా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. పాక్ పోటీలో లేకుండా ఏమీ లేదు కానీ.. అఫ్గాన్ సాధికారికంగానే గెలిచింది. మరీ ఉత్కంఠ ఏమీ లేదు. కాకపోతే మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే కొంచెం హోరాహోరీగా జరిగింది. నెదర్లాండ్స్‌పై శ్రీలంక కొంచెం కష్టపడింది కానీ.. 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ జట్టు మరీ ఏమీ కష్టపడలేదు. 10 బంతులుండగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చివరికి ఆ మ్యాచ్ కూడా..

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో మన జట్టే గెలవాలని అభిమానులు కోరుకున్నా.. ఆ మ్యాచ్‌ హోరాహోరీగా సాగాలని కోరుకుంటారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల పోరు ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో, ఎంత మజానిచ్చిందో తెలిసిందే. కానీ వన్డే ప్రపంచకప్‌లో మాత్రం ఈ రెండు జట్ల పోరు ఏకపక్షమైంది. పాక్ కేవలం 191 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్యాన్ని భారత్ 117 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ ఆడిన మిగతా మ్యాచ్‌లు సైతం ఆశించినంత ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఛేదన ఆరంభంలో తడబడ్డా చివరికి కానీ చివరికి 52 బంతులుండగానే 4 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చింది కానీ.. చివర్లో భారత్ సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తి ఏకపక్షం. ఇక టోర్నీలో మిగతా మ్యాచ్‌లేవీ కూడా హోరాహోరీగా సాగలేదు. ఉత్కంఠ రేకెత్తించలేదు. టీ20 ప్రపంచప్‌లో మాదిరి హోరాహోరీ పోరాటాలు.. ఉత్కంఠభరిత ముగింపులు లేకపోవడం వన్డే ప్రపంచకప్ పట్ల అభిమానుల్లో ఆసక్తిని మరింత తగ్గించేస్తోందనడంలో సందేహం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని