ODI WC 2023: ఇలాంటి ఉత్కంఠ ఎక్కడ?.. వన్డే ప్రపంచకప్లో ఏకపక్ష మ్యాచ్లతో అభిమానుల్లో నిరాసక్తత
వరల్డ్ కప్లో (ODI World Cup 2023) సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి.
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి. సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి. అంతా బాగానే ఉంది కానీ.. ప్రపంచకప్లో ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్లు ఎన్ని అని చూస్తే వేళ్ల మీద లెక్కబెట్టడం కూడా కష్టమవుతోంది. హోరాహోరీ పోరాటాలు లేకుండా.. చాలా వరకు ఏకపక్షంగా సాగిపోతూ.. ఫలితం మీద అసలు ఉత్కంఠ అన్నదే లేకుండా సాగిపోతున్న టోర్నీ సగటు క్రికెట్ అభిమానుల్లో నిరాసక్తతకు కారణమవుతోంది.
శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచకప్లో ఇది 26వ మ్యాచ్. కానీ ఇప్పటిదాకా జరిగిన 25 మ్యాచ్ల్లో లేని ఉత్కంఠను ప్రేక్షకులు ఈ మ్యాచ్లోనే అనుభవించారు. నిజానికి ఇది కూడా ఏకపక్షంగా ముగిసే మ్యాచ్ లాగే కనిపించింది. అయిదు వికెట్లు చేతిలో ఉండగా.. 80 బంతుల్లో 36 పరుగులు చేయడం ఒక లెక్కా అనుకున్నారు. కానీ పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని వరుసగా వికెట్లు తీస్తూ పోటీలోకి వచ్చింది. మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చింది. దక్షిణాఫ్రికా చేతిలో ఒక్క వికెట్టే ఉండగా 27 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో ఫలితం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లలో బంతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ప్రపంచకప్ మొదలయ్యాక ఏ మ్యాచ్లోనూ లేని ఉత్కంఠ ముగింపు ఈ మ్యాచ్కు లభించింది. శనివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ఆసీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని(389) ఛేదించే క్రమంలో కివీస్.. చివరి బంతి వరకూ పోరాడింది. చివరి ఓవరు వరకూ విజయం ఇరు జట్లను ఊరించినా.. ఆఖరికి ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు మ్యాచ్లు చూశాక కానీ.. ప్రపంచకప్లో ఏం మిస్సవుతున్నామో ఇప్పటివరకూ అభిమానులకు అర్థం కాలేదు.
సంచలనాల్లోనూ ఏకపక్షాలే..
ఈ ప్రపంచకప్లో కొన్ని సంచలన ఫలితాలు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టు.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోయింది. నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించింది. అఫ్గాన్, పాకిస్థాన్ మీదా సంచలన విజయం సాధించింది. కానీ ఇలాంటి సంచలన ఫలితాల్లో కూడా మ్యాచ్లేమీ ఉత్కంఠభరితంగా జరగలేదు. అఫ్గానిస్థాన్ ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఇక దక్షిణాఫ్రికా మీద నెదర్లాండ్స్ కూడా 38 పరుగుల తేడాతో నెగ్గడాన్ని బట్టి ఆ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ మ్యాచ్లో మిల్లర్ వికెట్ పడగానే దక్షిణాఫ్రికా ఓటమి తప్పదని ముందే అర్థమైపోయింది. పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్ కూడా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. పాక్ పోటీలో లేకుండా ఏమీ లేదు కానీ.. అఫ్గాన్ సాధికారికంగానే గెలిచింది. మరీ ఉత్కంఠ ఏమీ లేదు. కాకపోతే మిగతా మ్యాచ్లతో పోలిస్తే కొంచెం హోరాహోరీగా జరిగింది. నెదర్లాండ్స్పై శ్రీలంక కొంచెం కష్టపడింది కానీ.. 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ జట్టు మరీ ఏమీ కష్టపడలేదు. 10 బంతులుండగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చివరికి ఆ మ్యాచ్ కూడా..
భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో మన జట్టే గెలవాలని అభిమానులు కోరుకున్నా.. ఆ మ్యాచ్ హోరాహోరీగా సాగాలని కోరుకుంటారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల పోరు ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో, ఎంత మజానిచ్చిందో తెలిసిందే. కానీ వన్డే ప్రపంచకప్లో మాత్రం ఈ రెండు జట్ల పోరు ఏకపక్షమైంది. పాక్ కేవలం 191 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్యాన్ని భారత్ 117 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ ఆడిన మిగతా మ్యాచ్లు సైతం ఆశించినంత ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో ఛేదన ఆరంభంలో తడబడ్డా చివరికి కానీ చివరికి 52 బంతులుండగానే 4 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. న్యూజిలాండ్ భారత్కు గట్టి పోటీనే ఇచ్చింది కానీ.. చివర్లో భారత్ సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తి ఏకపక్షం. ఇక టోర్నీలో మిగతా మ్యాచ్లేవీ కూడా హోరాహోరీగా సాగలేదు. ఉత్కంఠ రేకెత్తించలేదు. టీ20 ప్రపంచప్లో మాదిరి హోరాహోరీ పోరాటాలు.. ఉత్కంఠభరిత ముగింపులు లేకపోవడం వన్డే ప్రపంచకప్ పట్ల అభిమానుల్లో ఆసక్తిని మరింత తగ్గించేస్తోందనడంలో సందేహం లేదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.