Year Ender 2022: భారత క్రీడావని 2022.. క్రికెట్‌లో డీలా.. మిగతావన్నీ భళా!

క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనే చేశారు. క్రికెట్‌లో కాస్త నిరాశకు గురిచేసినప్పటికీ.. ఇతర ఆటల్లో మాత్రం భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

Updated : 30 Dec 2022 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రీడా భారతావనికి 2022 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు దక్కాయి. అద్భుతాలు.. ఘోర పరాభవాలు.. రికార్డులు, చరిత్రల్లో నిలిచే విజయాలు.. కీలక నిర్ణయాలు.. ఇలా అన్ని రకాలుగా కాలం గడిచిపోయింది. క్రికెట్, హాకీ, బాక్సింగ్‌, చెస్, జావెలిన్ త్రో, బ్యాడ్మింటన్.. ఇలా కీలక ఆటల్లో మనవాళ్లు సత్తా చాటారు. మరి ఏడాది ముగుస్తున్న క్రమంలో సాధించిన ఘనతలు.. మూటగట్టుకొన్న ఓటములను ఓసారి తెలుసుకొందాం..  

16 ఏళ్ల తర్వాత: ఒకప్పుడు హాకీ అంటే భారత్‌ అనేలా ఉండేది. కానీ గత కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. అయితే బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళా హాకీ జట్టు రజత పతకం సొంతం చేసుకొంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా ఖాతాలో పతకం చేరడం గమనార్హం. 

పెద్ద టోర్నీల్లో డీలా: భారత్‌లో భారీ సంఖ్యలో అభిమానులు కలిగిన క్రీడ క్రికెట్‌. అయితే టీమ్‌ఇండియాకు మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌.. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌ల్లో మాత్రం చేతులెత్తేసింది. మహిళల జట్టు మాత్రం కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించింది.

శరత్‌ కమల్‌ అద్భుత పోరాటం: 40 ఏళ్ల ఆచంట శరత్‌ కమల్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో అద్భుతం చేశాడు. బంగారు పతకం గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే టీటీలో మూడు స్వర్ణాలను భారత క్రీడాకారులు గెలిచారు. భారీ ఆశలు పెట్టుకొన్న మనికా బాత్రా మాత్రం కామన్వెల్త్‌లో విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్‌లో మాత్రం పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 

థామస్ కప్‌ ఛాంపియన్‌: క్రికెట్‌ తర్వాత అత్యధిక ప్రజాదరణ కలిగిన గేమ్‌ బ్యాడ్మింటన్. ఈ ఏడాది జరిగిన థామస్‌ కప్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా థామస్‌ కప్‌ను సొంతం చేసుకొంది. ఇండోనేషియాపై ఫైనల్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది.

తెలంగాణ యువతి ఛాంపియన్‌: అత్యుత్తమ బాక్సర్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మేరీ కోమ్‌. అయితే ఈసారి మాత్రం సంచలన విజయాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణకు చెందిన బాక్సర్ కావడం విశేషం. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకొన్న నిఖత్‌.. తాజాగా జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (50 కేజీల విభాగం)లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. 

నీరజ్‌కు రజతం : జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా ఖాతాలో రజత పతకం పడింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. తొలిసారి ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన భారత జావెలిన్‌ త్రో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే డైమండ్‌ లీగ్‌లో గోల్డ్‌ గెలిచిన భారత అథ్లెట్‌గానూ నిలిచాడు. 

సంబరంగా చెస్‌ ఒలింపియాడ్‌: మొదటిసారిగా చెస్‌ ఒలింపియాడ్‌ను నిర్వహించే అవకాశం భారత్‌కు దక్కింది. 44వ ఎడిషన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో దాదాపు 346 దేశాల నుంచి 350కిపైగా జట్లు పాల్గొన్నాయి. 98 ఏళ్ల చరిత్ర కలిగిన చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు చెన్నై వేదికగా తొలిసారి భారత్‌లో జరిగాయి. 

కామన్వెల్త్‌ గేమ్స్: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆర్చరీ, షూటింగ్‌ వంటి క్రీడలు లేకపోయినప్పటికీ.. పతకాలను సాధించడంలో మాత్రం టీమ్‌ఇండియా క్రీడాకారులు వెనుకడుగు వేయలేదు. మొత్తం 61 పతకాలను సాధించారు. అందులో 22 గోల్డ్‌, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. 

ఫోర్బ్స్‌ జాబితాలోకి పీవీ సింధు: ఒలింపిక్స్‌ పతకాల విజేత, స్టార్ షట్లర్‌ పీవీ సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. ఈ ఏడాది తన కెరీర్‌లో తొలిసారి సూపర్ 500 టైటిల్‌ను గెలిచిన పీవీ సింధు.. తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకొంది. టాప్‌ 25 క్రీడాకారిణుల్లో సింధు 12వ స్థానంలో నిలిచింది. దాదాపు రూ.58 కోట్ల సంపాదనను ఆర్జించినట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది.

అరంగేట్రంలోనే కప్‌ కొట్టేసి..: అత్యంత రిచెస్ట్‌ టీ20 లీగ్‌ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). అడుగు పెట్టిన తొలి ఏడాదే  ఐపీఎల్‌ 2022 సీజన్‌ కప్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ ఎగరేసుకొని పోయింది. అలాగే ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (రూ.15.25 కోట్లు) టాపర్‌గా నిలవగా.. డిసెంబర్‌ 23న జరిగిన మినీ వేలంలో సామ్‌ కరన్ (రూ. 18.50 కోట్లు) రికార్డు సృష్టించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని