KTR: హస్తం పార్టీ డిపాజిట్‌ కోల్పోతేనే 6 గ్యారంటీల అమలు

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 05:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

భారత రాష్ట్ర సమితి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి
జూబ్లీహిల్స్‌లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్‌కు బుద్ధి రావాలి
షేక్‌పేట రోడ్‌ షోలో కేటీఆర్‌

షేక్‌పేట రోడ్‌షోలో ప్రసంగిస్తున్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. చిత్రంలో అభ్యర్థి మాగంటి సునీత తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌; షేక్‌పేట, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలవుతాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఆపద మొక్కులకు పోతోందని, ఇన్నిరోజులు గుర్తుకురాని మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులు తదితరులకు ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రెండేళ్లయినా కాంగ్రెస్‌కు ముస్లిం మైనార్టీల సంక్షేమం గుర్తుకురాలేదని.. ఈ ఎన్నికలో భారత రాష్ట్ర సమితి భయంతో హడావిడిగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక  ప్రచారంలో భాగంగా తొలిరోజు శుక్రవారం షేక్‌పేట రోడ్‌ షోలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత తరఫున కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘జూబ్లీహిల్స్‌ మళ్లీ కొడుతున్నాం, ఇక్కడ గెలుపు పక్కా, మెజార్టీ ఎంతో తేలాల్సి ఉంది. రెండేళ్లలో ఒక్క హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదు.. ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు? హామీల గురించి అడిగితే రేవంత్‌రెడ్డి దబాయిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 4 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్‌కు బుద్ధి చెబితే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. ఇక్కడ చిత్తుచిత్తుగా ఓడిస్తేనే ఆ పార్టీకి బుద్ధి వచ్చి హామీలన్నీ అమలవుతాయి’’ అని కేటీఆర్‌ అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే తానేం చేయకపోయినా వీళ్లు మళ్లీ తనకే ఓటేస్తారని రేవంత్‌రెడ్డి అనుకుంటారని హెచ్చరించారు. 

కేటీఆర్‌ రోడ్‌షోకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు 

రెండేళ్లలో రాష్ట్రాన్ని పాతాళానికి దిగజార్చిన రేవంత్‌

‘‘కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అనతికాలంలోనే దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారు. రెండేళ్లలోనే రేవంత్‌రెడ్డి పాతాళానికి దిగజార్చారు. రేవంత్‌.. అరచేతిలో స్వర్గం చూపి.. అడ్డగోలు హామీలు ఇచ్చి రైతాంగం నుంచి ప్రతి వర్గాన్నీ వంచించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడానికి ఒక్కటంటే ఒక్క కారణముందా? ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రూ.2,500 వచ్చాయా? పెన్షన్‌ రూ.4 వేలు అందాయా? ఆడబిడ్డలకు స్కూటీలు వచ్చాయా? తాగునీటిని మేము ఉచితంగా అందించాం.. ఇప్పుడు బిల్లులు ఇస్తున్నారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివిలేదు.. కనీసం మా పథకాలను కొనసాగించే విజ్ఞతా లేదు. 

హైడ్రాతో ఇళ్ల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? 

మా హయాంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 3,500, నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చాం.. రెండేళ్లలో ఒక్క ఇల్లయినా కాంగ్రెస్‌ ఇచ్చిందా? ఇళ్లు ఇవ్వకపోగా హైడ్రా పేరుతో గూడు లేకుండా చేశారు. ఇళ్ల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరుతో బుల్డోజర్‌లు పంపిస్తుండడంతో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. కాంగ్రెస్‌ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారిపోయింది. కాంగ్రెస్‌ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి. మైనార్టీలకు సబ్‌ప్లాన్, మైనార్టీల సంక్షేమానికి రూ.4 వేల కోట్లు ఏమైనట్లు’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు