బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రెండు జాతీయ పార్టీలదే

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jul 2025 06:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

 ఈ డిమాండ్‌ నెరవేర్చకుంటే 17న రైల్‌రోకో  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఈనాడు, దిల్లీ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయించే బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలదేనని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో గతంలో మాట ఇచ్చినట్లుగా 42% రిజర్వేషన్లు అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీకి చెప్పడానికే తాను దిల్లీకొచ్చినట్లు ప్రకటించారు. దేశంలో జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల ద్వారానే ప్రజలకు ఎక్కువగా న్యాయం జరిగిందన్నారు.

‘‘రాజ్యాంగాన్ని చేతబట్టి దేశవ్యాప్తంగా తిరిగే రాహుల్‌గాంధీ అందులోని 243(డి) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక్క మాట చెబితే చాలు.. రాష్ట్రంలో అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్రం వద్దకు వెళ్లి ఉంటుంది. ఓబీసీగా చెప్పుకొనే ప్రధాని మోదీ.. వారి హక్కులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడులో అమలు చేస్తున్న 69% రిజర్వేషన్ల విధానాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రక్షిస్తున్నట్లుగానే తెలంగాణ ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకూ రక్షణ కల్పించాలి. స్థానిక ఎన్నికల్లో ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయకపోయినా, కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపకపోయినా ఈ నెల 17న రైల్‌రోకో నిర్వహించి దక్షిణాది నుంచి దిల్లీకి ఒక్క రైలు కూడా రాకుండా చూస్తామని హెచ్చరించారు. రైల్‌రోకోలో భారత రాష్ట్ర సమితి అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు పాల్గొంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ త్వరలో దీనిపై తాను అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాయబోతున్నానన్నారు.

Tags :
Published : 09 Jul 2025 03:59 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని