సంక్షిప్త వార్తలు(8)

Eenadu icon
By Telangana News Desk Updated : 30 Oct 2025 04:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం

హైదరాబాద్, న్యూస్‌టుడే: పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో జరిగిన అభివృద్ధి, రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం ఉంటుంది కానీ మూలనపడ్డ కారు(భారత రాష్ట్ర సమితి)కు ఓటేస్తే ముందుకు పోలేమని జూబ్లీహిల్స్‌ ప్రజలు గమనించాలని కోరారు. మంత్రి బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. కాంగ్రెస్‌ అభివృద్ధికి, భారత రాష్ట్ర సమితి అబద్ధాలకు మధ్య జరగనుంది. భారత రాష్ట్ర సమితి నేతలు వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి.ఉప ఎన్నికలో నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని జూబ్లీహిల్స్‌ ఓటర్లను కోరుతున్నా’అని పొన్నం పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో మంత్రి పొన్నం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


నేడు కళాశాలల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ఏళ్లకొద్దీ పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్‌షిప్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ గురువారం రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, ఇతర వృత్తి విద్యా కళాశాలలతోపాటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బోధనా రుసుములను విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దానివల్ల అంతిమంగా పేద విద్యార్థులే నష్టపోతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌ ప్రకటించి సహకరించాలని వారు కోరారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో అధ్యాపకులకు కళాశాలల యాజమాన్యాలు వేతనాలు చెల్లించడం లేదని దీనిపై శనివారం సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


నేడు ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని, వాటిని తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్లో ఉంచుతామని టాస్‌ సంచాలకుడు పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించారు.


కాంట్రాక్టు టీచర్ల కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లు 1,125 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) కూడా కొనసాగించేందుకు ఆర్థికశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీఓ జారీ చేశారు. 2008 డీఎస్సీలో అన్యాయం జరిగిన కొందరు అభ్యర్థులకు ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు విధుల్లో కొనసాగుతారు. 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ చంద్ర వివాహ రిసెప్షన్‌ బుధవారం రాత్రి శంషాబాద్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌


వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆధునిక వ్యవసాయం 
ఇక్రిశాట్‌ స్మార్ట్‌క్రాప్‌ ప్రాజెక్టుకు ఎంపిక 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కృత్రిమమేథ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘స్మార్ట్‌క్రాప్‌’ ప్రాజెక్టును నిర్వహించాలని ఇక్రిశాట్‌ నిర్ణయించింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ ఫౌండేషన్, రాయచూర్‌ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయంతో కలిసి దీనిని అమలు చేయనుంది. ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌పాఠక్, ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఎండీ సంజయ్‌ప్రకాశ్, రాయచూర్‌ యూఏఎస్‌ ఎంటమాలజీ విభాగాధిపతి ఏజీ శ్రీనివాస్, తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో దివ్యాదేవరాజన్, రెండు జిల్లాల రైతులతో కలిసి బుధవారం ఇక్కడ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఎస్‌బీఐ ఫౌండేషన్‌.. జీవనోపాధి, పారిశ్రామిక మార్గనిర్దేశక కార్యక్రమం కింద మూడేళ్లలో దాదాపు ఆరు వేల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ ప్రాజెక్టు కింద సాయం అందిస్తుంది.


ఇంటర్‌ అతిథి అధ్యాపకుల పెండింగ్‌ వేతనాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం(2024-25)లో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన 1,665 మంది పెండింగ్‌ వేతనాలు రూ.17.56 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణఆదిత్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు పనిచేసిన కాలానికి జీతం మొత్తాన్ని విడుదల చేశారు. వాటిని ఆయా అధ్యాపకులకు చెల్లించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. 


హరీశ్‌రావుకు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పరామర్శ

సత్యనారాయణరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌. చిత్రంలో మధుయాస్కీగౌడ్, హరీశ్‌రావు

హైదరాబాద్, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాజీమంత్రి హరీశ్‌రావును పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి టి.సత్యనారాయణరావు వృద్ధాప్య సమస్యలతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన మహేశ్‌కుమార్‌గౌడ్‌.. సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాస్కీగౌడ్, ట్రైకార్‌ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ తదితరులు హరీశ్‌రావును పరామర్శించారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌ బుధవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Tags :
Published : 30 Oct 2025 03:45 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు