పెద్దపులులను పలకరిద్దామా!.. జంతుగణనలో విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు అవకాశం

Eenadu icon
By Telangana News Desk Updated : 30 Oct 2025 07:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడ వేయకూడదు..పెద్దపులి పలకరించింది కదా అని పక్కన నిల్చొని ఫొటో తీయించుకోకూడదురోయ్‌! ఓ సినిమా డైలాగ్‌ ఇది. పెద్దపులిని పలకరించడమే కాదు..అవి తిరిగే అవాసాల్లో తిరుగుతూ..వాటిని లెక్కించే అవకాశాన్ని కల్పిస్తామంటోంది అటవీశాఖ. నవంబరు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2026’లో డిగ్రీ, పీజీ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు వాలంటీర్లుగా పాల్గొనే వీలు కల్పిస్తోంది. ఆయా జిల్లాల అటవీశాఖ అధికారిని సంప్రదించి వివరాలు అందిస్తే సరిపోతుంది.

నాలుగేళ్లకు ఒకసారి

‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌’ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి నవంబరు-మార్చి మధ్య కాలంలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. తెలంగాణలో నవంబరు 20-26 వరకు వారం రోజుల పాటు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తేదీలు ఖరారు కానున్నాయి. ఇందులో భాగంగా పులులతోపాటు చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, దుప్పులు ఇలా మాంసాహార, శాకాహార జంతువులన్నింటినీ లెక్కిస్తారు. ఆయా వివరాలు ఓ యాప్‌లో నమోదుచేస్తారు. అందుకోసం అటవీ బీట్ల వారీగా బృందాలను నియమిస్తారు. ఒక్కో బృందంలో అటవీ అధికారులతోపాటు విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, ఎన్జీవోలు ఉంటారు. వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. గణన పూర్తయిన తర్వాత రాష్ట్రాల వారీగా పెద్దపులులు, చిరుతల సంఖ్యను కేంద్రం వెల్లడిస్తుంది. ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ అంటే కేవలం పులులు, చిరుతల లెక్కింపు మాత్రమే కాదు. అడవులు ఎంత సజీవంగా ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియ కూడా. ప్రకృతిలో మమేకమై..దాన్ని అర్థం చేసుకుంటూ వన్యప్రాణుల జీవన గమనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం’ అని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.


ఇలా లెక్కిస్తారు..

పెద్దపులులు, ఇతర జంతువుల్ని ప్రత్యక్ష, పరోక్ష ఆధారాల ద్వారా లెక్కించి అంచనా వేస్తారు. కెమెరా ట్రాప్‌లు, పాదముద్రల విశ్లేషణ (పగ్‌ మార్క్‌ విధానం), విసర్జనలు వంటి పద్ధతులను అనుసరిస్తారు. 

జంతుగణనలో పాల్గొనేవారు ప్రతి రోజు 5 కి.మీ పరిధిలో అటవీ ప్రాంతంలో తిరుగుతారు. 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :
Published : 30 Oct 2025 07:53 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని