GHMC: జీహెచ్‌ఎంసీ సమావేశంలో రసాభాస.. భారాస కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్‌

Eenadu icon
By Telangana News Team Updated : 30 Jan 2025 15:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొంది. బడ్జెట్‌ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని భారాస పట్టుబట్టింది. ఈక్రమంలో కాంగ్రెస్‌, భారాస కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భారాసకు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్‌ బయటకు తీసుకెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ మిగతా భారాస కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను మళ్లీ తీసుకువచ్చి సభను నిర్వహించాలన్నారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని చెప్పారు. (Telangana News)

దీంతో సభలో గందరగోళం నెలకొంది. మేయర్‌ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పినా భారాస కార్పొరేటర్లు పట్టువీడలేదు. ఈక్రమంలో ఆమె అసహనం వ్యక్తంచేస్తూనే మార్షల్స్‌ తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఆ నలుగురు కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో భారాస కార్పొరేటర్లందరినీ మేయర్‌ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్‌ బయటికి పంపించగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :
Published : 30 Jan 2025 12:50 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని