BHEL: ఆలస్యానికి రూ.460 కోట్ల జరిమానా!

థర్మల్‌ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్‌(బీహెచ్‌ఈఎల్‌)కు తెలంగాణ జెన్‌కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్‌కు స్పష్టంచేసింది.

Published : 18 May 2024 03:44 IST

యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ   పనుల్లో జాప్యానికి రూ.344 కోట్లు
భద్రాద్రికి గతంలోనే రూ.116 కోట్ల విధింపు.. 
తాజాగా భెల్‌కు చెల్లింపుల్లో ఈ మొత్తం నిలిపివేసిన తెలంగాణ జెన్‌కో
యాదాద్రి ప్లాంటుతో ఇప్పటికే నష్టం.. జరిమానా తగదు: భెల్‌

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: థర్మల్‌ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్‌(బీహెచ్‌ఈఎల్‌)కు తెలంగాణ జెన్‌కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్‌కు స్పష్టంచేసింది. నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ కేంద్రం పనుల్లో జాప్యానికి తాజాగా రూ.344 కోట్లు, భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద చేపట్టిన భద్రాద్రి ప్లాంటు నిర్మాణంలో జాప్యానికి గతంలోనే రూ.116 కోట్ల జరిమానా విధించింది. భెల్‌కు చెల్లించాల్సిన బిల్లుల నుంచి ఈ నిధులు నిలిపివేసింది. అయితే, ఇలా బిల్లుల చెల్లింపులు నిలిపివేయడం తగదని, యాదాద్రి ప్లాంటు పనుల్లో జాప్యం వల్ల ఇప్పటికే తమ సంస్థకు నష్టం వస్తోందని.. జరిమానా పేరుతో అదనంగా వసూలు తగదని భెల్‌ సంస్థ తాజాగా జెన్‌కోకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్లాంటు నిర్మాణ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించాలనీ అందులో కోరినట్లు తెలిసింది. 

ఆలస్యంతో మరింత భారమై...

యాదాద్రి ప్లాంటు నిర్మాణ అంచనా వ్యయం రూ.17,950 కోట్లని తొలుత భెల్‌కు 2015 జూన్‌ ఒకటిన తెలంగాణ జెన్‌కో ఇచ్చిన లేఖలో తెలిపింది. కానీ, కీలకమైన పర్యావరణ అనుమతి(ఈసీ) 2017 జూన్‌ 29న రావడంతో నిర్మాణం ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఈసీ వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయం రూ.20,379 కోట్లు అని, నిర్మాణ ప్రారంభతేదీ 2017 అక్టోబరు 10 అని నిర్ణయించి జెన్‌కో భెల్‌కు మరో ఉత్తర్వు ఇచ్చింది. ఈ ప్రకారం ప్లాంటులోని మొత్తం 5 యూనిట్లకుగాను 2020 అక్టోబరు నాటికి రెండింటిలో, 2021 అక్టోబరు నాటికి మరో మూడింటిలో విద్యుదుత్పత్తి ప్రారంభించాలి. కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధరలు పెరిగాయని అంచనా వ్యయాన్ని రూ.20,444 కోట్లకు పెంచారు. ఈ కాంట్రాక్టు ఒప్పందం చేసుకునే సమయంలో ‘ధరల్లో మార్పు నిబంధన’ (ప్రైస్‌ వేరియేషన్‌ క్లాజ్‌-పీవీసీ)ను పెట్టడానికి జెన్‌కో అంగీకరించలేదు. దీంతో నిర్మాణం పూర్తయ్యేలోగా ధరలు పెరిగినా వ్యయం పెంచేది లేదని.. రూ.20,444 కోట్లే చెల్లిస్తామని జెన్‌కో కాంట్రాక్టు ఒప్పందంలో తెలిపింది. నిర్మాణంలో జాప్యం జరిగితే చెల్లింపులపై 5 శాతం సొమ్మును ‘లిక్విడిటీ డామేజెస్‌’(ఎల్‌డీ) పేరుతో జరిమానా వేస్తామనే షరతునూ ఒప్పందంలో జెన్‌కో పెట్టగా భెల్‌ అంగీకరించింది. 

జాప్యంతో ‘యాదాద్రి అప్పు’పై వడ్డీ భారమే రూ.8,745 కోట్లు!

వాస్తవానికి 2021 అక్టోబరు నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా.. పలుమార్లు గడువు పొడిగించిన జెన్‌కో చివరగా 2024 డిసెంబరుగా ఖరారు చేసింది. అయితే, ఇది కూడా సరిపోదని.. గడువును 2025 మార్చి 31 వరకూ పొడిగించాలని భెల్‌ తాజాగా అడిగింది. ఇప్పటికే దీని నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం రూ.34,450 కోట్లకు చేరింది. పైగా దీనిపై రూ.29 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నందున ‘నిర్మాణం జరిగే కాలంలో వడ్డీ’ (ఇంట్రెస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌-ఐడీసీ)ని జెన్‌కో చెల్లిస్తోంది. ఐడీసీ భారం 2024 డిసెంబరు నాటికి రూ.8,400 కోట్లకు చేరనుంది. కానీ, భెల్‌ అడిగినట్లుగా మరోసారి గడువు పొడిగిస్తే ఐడీసీ భారం రూ.8,745 కోట్లకు చేరుతుందని.. ఇంత వడ్డీని విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందే చెల్లించడం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థికభారం పడుతుందని జెన్‌కో భావిస్తోంది. ప్లాంటు నిర్మాణంలో జాప్యంతో ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్‌ ధర రూ.6 దాటుతుందని విద్యుత్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘యాదాద్రి’ నిర్మాణంలో జాప్యానికి బాధ్యత వహిస్తూ ఎల్‌డీ కింద రూ.344 కోట్ల జరిమానాను చెల్లించాలని భెల్‌కు తాఖీదును జారీచేసింది. గతంలోనూ ఇలాగే భద్రాద్రి ప్లాంటు పనుల్లో జాప్యానికి సంబంధించి రూ.116 కోట్ల ఎల్‌డీ పేరుతో జరిమానా విధించినా.. ఆ సంస్థ చెల్లించలేదు. దీంతో భెల్‌కు చెల్లించాల్సిన బిల్లుల నుంచి మొత్తం రూ.460 కోట్లను జెన్‌కో నిలిపివేసింది. మరోవైపు యాదాద్రి విషయంలో తమ జాప్యం ఏమీ లేదని, ఈ ప్లాంటు పనులు ఆలస్యం కావడానికి అనేక సాంకేతిక కారణాలున్నాయని భెల్‌ వాదిస్తోంది. ఈ ప్లాంటు నిర్మాణంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ జ్యుడీషియల్‌ విచారణ జరుపుతున్నందున.. ఆర్థిక భారం అధికంగా పడటానికి బాధ్యులెవరనేది త్వరలో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని