MLC Kavitha: సాక్షులను బెదిరించారు.. సాక్ష్యాలను చెరిపేశారు

భారాస ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంచేశారని, అందువల్ల ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు విన్నవించారు.

Updated : 29 May 2024 07:18 IST

కవిత సాధారణ మహిళ కాదు.. రాజకీయ శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి
2 రోజుల్లో 4 ఫోన్లను ఫార్మాట్‌ చేశారు
బెయిల్‌ ఇవ్వొద్దు.. దిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
తీర్పు రిజర్వ్‌.. 30 లేదా 31 తేదీల్లో వెల్లడి

ఈనాడు, దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంచేశారని, అందువల్ల ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఈడీ సమన్లు జారీచేసిన రెండురోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్‌ చేసినట్లు చెప్పారు. ఆమె సాధారణ గృహిణికాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తుచేశారు. అన్నీ తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్‌ ఇవ్వరాదని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్లో బెయిల్‌ కోరుతూ కవిత దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ ధర్మాసనం ముందు మంగళవారం ఈడీ న్యాయవాది జోయెబ్‌ హుస్సేన్‌ ఈమేరకు వాదనలు వినిపించారు. ఈకేసులో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైలని బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకొనేలా కవిత ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈకేసులో ఆమె పాత్ర గురించి 2022 నవంబర్‌లో ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈడీ తనను బెదిరించి, అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదుచేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారని పేర్కొన్నారు.

ఆయన ఈడీ ముందు చాలా వాంగ్మూలాలు ఇచ్చినా అందులో కేవలం కవిత పేరు ప్రస్తావించిన వాంగ్మూలాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం వెనక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ కుంభకోణం సాగిన 10 నెలల్లో హోల్‌సేల్‌ వ్యాపారులు మొత్తం రూ.338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్‌ సంస్థకు ఒక్కదానికే రూ.192 కోట్లు దక్కిందన్నారు. ఇదే సంస్థలో అరుణ్‌ పిళ్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరఫున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వివరించారు. ఆ రూ.32 కోట్లలో రూ.4.50 కోట్లు కవిత నేతృత్వంలో నడుస్తున్న ఇండియా అహెడ్‌ సంస్థకు వెళ్లాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాట్సప్‌ చాట్స్‌ ఉన్నాయన్నారు. కవిత గత ఏడాది మార్చి 21వ తేదీన తొమ్మిది ఫోన్లు దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారని... అందులో నాలుగు ఫోన్లు మార్చి 14, 15 తేదీల్లో ఫార్మాట్‌ చేసిఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఉందన్నారు. ఇలా సాక్ష్యాలను చెరిపేశారన్న కారణంతోనే కింది కోర్టు బెయిల్‌ తిరస్కరించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమెను తాము అరెస్టు చేశామన్న వాదనల్లోనూ ఎలాంటి నిజంలేదని... వచ్చే పది రోజులు ఆమెకు సమన్లు జారీచేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్‌ 15న ఏఎస్‌జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారని, అంతే తప్ప అరెస్టు చేయబోమని చెప్పలేదని పేర్కొన్నారు.

సీబీఐ తరఫు న్యాయవాదీ ఇదే తరహా వాదనలు వినిపించి ఆమె బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈ వాదనలను కవిత తరఫు న్యాయవాది నితేష్‌ రాణా తోసిపుచ్చారు. ఈకేసులో రూ.192 కోట్ల నేరపూరిత ఆర్జన జరిగినట్లు చెబుతున్నారని, అందులో ఒక్కపైసా కూడా కవితకు చేరలేదన్నారు. బుచ్చిబాబు ఈకేసులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నా ఇంతవరకూ ఆయన్ను ఈడీ అరెస్టే చేయలేదని గుర్తుచేశారు. తాము ఫోను ధ్వంసం చేసినట్లు 2023 మార్చిలోనే తెలిసినప్పటికీ అప్పుడే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకుంటే తన ఫోన్లను తనదగ్గర పనిచేసేవారికి ఇవ్వడానికి బదులు వాటిని ధ్వంసం చేసి ఉండేవారన్నారు. అలా కాకుండా ఆమె తన పాతఫోన్లను ఉద్యోగులనుంచి సేకరించి ఇచ్చారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌చేశారు. ఈనెల 30-31 తేదీల్లో ఏదో ఒక రోజులు వెలువరించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు