Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలలో సీపేజీ

‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్‌ పునాదుల వద్ద సీపేజీని గుర్తించాం. దానిని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలి’ అని మరో నిపుణుల కమిటీ సూచించింది.

Published : 06 Jun 2024 06:06 IST

రాఫ్ట్‌ పునాదుల వద్ద గుర్తించాం  
అరికట్టేందుకు చర్యలు తీసుకోండి
సూచించిన న్యాయ కమిషన్‌ నిపుణుల కమిటీ 
ఈనాడు, హైదరాబాద్‌

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ ప్రాంతంలో పియర్‌ను పరీక్షిస్తున్న సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌ బృందం 

‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్‌ పునాదుల వద్ద సీపేజీని గుర్తించాం. దానిని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలి’ అని మరో నిపుణుల కమిటీ సూచించింది. మేడిగడ్డ కుంగిన సంఘటనతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్‌కు సహాయపడేందుకు గత నెల 22న నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వరంగల్‌ ఎన్‌.ఐ.టి. ప్రొఫెసర్‌ రమణమూర్తి, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ రాజశేఖర్, విశ్రాంత ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులతో కూడిన కమిటీ ఈ నెల 1న బ్యారేజీలను సందర్శించింది. వెంట ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్, కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లకు ఈఎన్సీ సూచించారు. ఇప్పటికే నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల ప్రకారం పనులు చేస్తున్నారు. తాజాగా ఈ కమిటీ కొన్ని పనులు సూచిస్తూ వేగంగా చేయాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ సూచనల్లో పలు అంశాలు ఇలా ఉన్నాయి.

  • మూడు బ్యారేజీలలోనూ దిగువ వైపు ఆప్రాన్‌ దెబ్బతింది. పక్కకు వెళ్లిపోయిన బ్లాక్‌లను వెంటనే అమర్చే పనిని పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు సూచించాలి.
  • సీసీ బ్లాక్‌ల కింద రాఫ్ట్‌ పునాదుల వద్ద సీపేజీ ఉంది. మూడు బ్యారేజీలలోనూ ఈ సమస్య ఉంది. ఇసుక, సిమెంటు కలిపి సీపేజీని అరికట్టాలి.
  • బ్యారేజీలకు ఎగువన సీకెంట్‌పైల్‌ పొడవునా సిమెంట్, బెనోటైన్‌ మిక్స్‌తో గ్రౌటింగ్‌ చేయాలి. సీకెంట్‌పైల్‌కు మూడు మీటర్ల దూరంలో ఇసుకబెడ్‌ వద్ద ఈ మిక్సింగ్‌తో గ్రౌటింగ్‌ చేయాలి.
  • మేడిగడ్డలో ఏడవ బ్లాక్‌ వద్ద పడిన బుంగలు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది. కాంక్రీట్‌ లేదా ఎపాక్సీ కోటింగ్‌తో బీటలను పూడ్చాలి. రాఫ్ట్‌ దిగువన ఉన్న స్థలంలోకి నీరు నేరుగా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సీకెంట్‌ పైల్స్, రాఫ్ట్‌ స్లాబ్‌ బ్యారేజీ ఎగువన, దిగువన సీల్‌ చేయాలి.
  • గేట్లు ఎత్తేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గేట్లు ఎత్తే మెకానిజాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలి. 
  • మోడల్‌ స్టడీస్‌కు తగ్గట్లుగా బ్లాక్‌ల వారీగా గేట్ల నిర్వహణకు ‘స్కాడా’ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.
  • గ్రౌటింగ్‌ పని పూర్తయిన వెంటనే బ్యారేజీ రాఫ్ట్‌ మీద డ్రిల్లింగ్‌ కోసం వేసిన రంధ్రాలను పూడ్చివేయాలి.
  • అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పునరుద్ధరణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వాటి వేగాన్ని పెంచాలి. వర్షాలు వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలి.
  • మోడల్‌ స్టడీస్‌కు తగ్గట్లుగా బ్యారేజీల ఎగువన, దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి.

రేపటి నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ పర్యటన

కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఈ నెల 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 20 వరకు  హైదరాబాద్‌లో ఉండి విచారణను పూర్తి చేయనున్నట్లు తెలిసింది. జూన్‌ ఆఖరు లోగా నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో ఈ లోగా విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7న మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులను పరిశీలించనున్నారు.


మేడిగడ్డలో సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌ బృందం పరీక్షలు 

మహదేవపూర్, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ పరిధిలో బుధవారం దిల్లీకి చెందిన సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చి స్టేషన్‌(సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌) నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కమిటీ సూచనల మేరకు నిపుణులు పరీక్షలు చేసి నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపడతారు. సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌కు చెందిన హరిదేవ్‌ నేతృత్వంలో ఏడుగురు నిపుణుల బృందం కొన్ని పరీక్షలను అక్కడికక్కడే చేస్తుండగా మరికొన్ని నమూనాలను సేకరిస్తోంది. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ పరిధిలో పలు చోట్ల బుధవారం 25 అడుగుల మేర డ్రిల్లింగ్‌ చేసి అందులో నుంచి నమూనాలను సేకరించింది. పియర్లను డ్రిల్‌ చేసి కూడా పరీక్షించింది. ఈ బృందం జియో ఫిజికల్, జియో టెక్నికల్, కాంక్రీట్‌ పరీక్షలను వారం రోజుల పాటు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఈఈ తిరుపతిరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు