Hotel food: తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం

పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలో పరిస్థితి ఇది.

Updated : 20 May 2024 07:11 IST

పాడైపోయిన పదార్థాలు.. కాలం చెల్లిన మసాలాలు
వంటగదులు అపరిశుభ్రం.. మళ్లీ మళ్లీ నూనెల వినియోగం
రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి
ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి..

ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే..

  •  జహీరాబాద్‌ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి. మళ్లీ, మళ్లీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటినీ వినియోగిస్తున్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయి.
  • జూబ్లీహిల్స్‌లోని ఓ బార్‌ అండ్‌ కిచెన్‌లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌: పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలో పరిస్థితి ఇది. సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఉంది. ఘుమఘుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగులు, వేడి వేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం. వైద్య ఆరోగ్యశాఖ అధీనంలోని రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టగా.. సగానికి పైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది. నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. బాగా పేరొందిన, అత్యంత ప్రముఖ, ఆదివారం నాడు రద్దీతో కళకళలాడే కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లోనూ శుచీశుభ్రత లేని వంటశాలలు..

ఓ రెస్టారెంట్‌లో కుళ్లిన ఉల్లి

చెడిపోయిన పదార్థాలు... బూజుపట్టిన కూరగాయలు.. ఫ్రిజ్‌లలో వండి నిల్వఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. పలుచోట్ల నకిలీ బ్రాండ్‌ల వాటర్‌ బాటిళ్లు, కోల్డ్‌ చైన్‌ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్‌విచ్‌ బ్రెడ్‌లు, కల్తీ పదార్థాలు వెలుగుచూశాయి. ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో చాక్లెట్లు గడువు తీరిపోయి.. లీకవుతున్నట్లు గుర్తించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడాది 14,889 నమూనాలు సేకరించగా.. వీటిలో 3,803 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపర్చుకోవాలని సూచించారు. 2,534 శాంపిళ్లు నాణ్యతగా లేవని గుర్తించారు. 311 శాంపిళ్లలో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు.

వెజ్‌ బిర్యానీలోకి పాడైపోయిన క్యారెట్‌ 

తాజాగా తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని..

  • తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు ప్రత్యేకం అన్న ప్రచారంతో లక్డీకాపుల్‌లో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.
  • హయత్‌నగర్‌లోని ఒక మండీలో వంటగది మురికిమయంగా ఉంది. మురుగునీరు, మూతలేని డస్ట్‌ బిన్‌లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్‌ రంగుల్ని వాడుతున్నారు.
  • ఓ వెజ్‌ రెస్టారెంట్‌లో ఫంగస్‌ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్‌ బిర్యానీని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. వంట గదిలో మురుగునీరు నిల్వ ఉంది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుళ్లు లేవు.
  • హైదరాబాద్‌ బార్కస్‌లోని ఒక ఇండో అరబిక్‌ రెస్టారెంట్‌లో కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుళ్లు లేని వాటర్‌ బాటిళ్లు విక్రయిస్తున్నారు. 
  • బంజారాహిల్స్‌లోని ఓ పెద్ద మాల్‌లోని పేరొందిన ఫుడ్‌స్టాళ్లలోని ఆహారంలో నాణ్యతలేదని తేలింది.
  • ప్రఖ్యాత బిస్కట్‌ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్‌లు, రస్క్‌లు, క్యాండీలు, చాక్‌లెట్‌ కేక్‌లు విక్రయిస్తున్నారు. 
  • ఒక ప్రముఖ ఐస్‌క్రీం అవుట్‌లెట్‌లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్‌ టిట్‌బిట్‌ క్యాన్‌లు, తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేని కేక్‌లు, పేస్ట్రీలు వాడుతున్నారు.

నాణ్యతా మృగ్యం

పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలావరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని ఆహార భద్రత తనిఖీ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్‌ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని పేర్కొన్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి, మసాలాలు కలిపి ఇస్తున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని