ఏ ఫీల్డర్‌ ఎక్కడున్నాడో.. తెలుసుకోవడం ఇక సులువు!

క్రికెట్‌ మైదానంలో ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో టీవీ తెరపై చుక్కల(డాట్స్‌) రూపంలో చూపిస్తుంటారు కదా..! దీనికి సంబంధించి సరికొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ ఐటీ) అభివృద్ధి చేసింది.

Updated : 19 Oct 2022 07:02 IST

సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ట్రిపుల్‌ ఐటీ

మానవ ప్రమేయం లేకుండా గుర్తించే వీలు

స్టార్‌ స్పోర్ట్స్‌తో కలిసి రూపకల్పన

ఈనాడు, హైదరాబాద్‌: క్రికెట్‌ మైదానంలో ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో టీవీ తెరపై చుక్కల(డాట్స్‌) రూపంలో చూపిస్తుంటారు కదా..! దీనికి సంబంధించి సరికొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ ఐటీ) అభివృద్ధి చేసింది. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యం దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. టీ20 ప్రపంచకప్‌లోనూ దీన్ని వాడబోతున్నారు.

ఫీల్డర్ల స్థానాలను గుర్తించే సాంకేతికతను టీవీ ఛానెళ్లు వాడుతుంటాయి. దీని కోసం మూడు కెమెరాలు వినియోగిస్తారు. అయితే ఆటగాళ్లు కదిలితే కెమెరాల ట్రాకింగ్‌ వ్యవస్థ ఆగిపోతుంది. ఏ ఫీల్డర్‌ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రిపుల్‌ ఐటీ కంప్యూటర్‌ విజన్‌ సహాయ ఆచార్యుడు ప్రొఫెసర్‌ వినీత్‌ గాంధీ నేతృత్వంలో విద్యార్థులు శ్వేతాంజల్‌ దత్‌, జీత్‌ వోరా, కనిష్క్‌ జైన్‌ కలిసి మైదానంలోని ఫీల్డర్లను గుర్తించే మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌(ప్లేయర్‌ ట్రాకింగ్‌ సాంకేతికత)ను అభివృద్ధి చేశారు. దీంతో మానవ ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటిక్‌గా ఆటగాళ్ల కదలికలను గుర్తించొచ్చు. ఇందుకు ఒకే కెమెరా సరిపోతుంది. బ్యాటర్లు, అంపైర్లను కాకుండా కేవలం ఫీల్డర్లనే చూపించడం దీని ప్రత్యేకత. వాళ్ల పేర్లతో ఎప్పటికప్పుడు ట్రాకింగ్‌ చేస్తుంది. ఒక ఫీల్డర్‌ ఎంత వేగంతో, ఎక్కడికి కదులుతున్నాడు? తదితర విషయాలనూ తెలుసుకోవచ్చు. ‘‘మేము అభివృద్ధి చేసిన సాంకేతికతను 2019లో స్టార్‌ స్పోర్ట్స్‌తో కలిసి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో ఆటగాళ్ల కదలికలపై వినియోగించాం. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద ట్రిపుల్‌ఐటీలో తాజా సాంకేతికతను అభివృద్ధి చేశాం’’ అని వర్సిటీ ప్రొడక్ట్‌ ల్యాబ్స్‌ అధిపతి ప్రకాశ్‌ ఎల్ల వివరించారు. ‘‘రెండేళ్ల కిందట ప్రాజెక్టును స్టార్‌ స్పోర్ట్స్‌, ఏఈ.లైవ్‌ కంపెనీతో ప్రారంభించాం. గతేడాది తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో పరిశీలించాం. తొలిసారి ఆసియా కప్‌లో భారత్‌-హాంకాంగ్‌ మ్యాచ్‌లో వినియోగించాం’’ అని వినీత్‌ గాంధీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని