మద్యం కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో తొలి ఛార్జిషీట్‌ను సీబీఐ శుక్రవారం దిల్లీ రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించింది. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట విచారణ జరిగింది.

Published : 26 Nov 2022 06:12 IST

ఏడుగురు నిందితుల్లో బోయినపల్లి అభిషేక్‌, ముత్తా గౌతమ్‌

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో తొలి ఛార్జిషీట్‌ను సీబీఐ శుక్రవారం దిల్లీ రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించింది. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట విచారణ జరిగింది. ఎన్ని పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారని ప్రత్యేక జడ్జి ప్రశ్నించగా సుమారు పది వేల పేజీలున్నాయని, ఇంకా సీడీలు, పెన్‌డ్రైవ్‌లు ఉన్నట్లు సీబీఐ తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న విజయ్‌ నాయర్‌, తిహాడ్‌ జైలులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. తొలి ఛార్జిషీట్‌లో నిందితులుగా 7గురిని చేర్చారు.

ఏ1: కుల్‌దీప్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్‌
ఏ2: నరేందర్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ అసిస్టెంట్‌ కమిషనర్‌
ఏ3: విజయ్‌నాయర్‌, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి
ఏ4: బోయినపల్లి అభిషేక్‌, హైదరాబాద్‌ వ్యాపారి
ఏ5: ముత్తా గౌతమ్‌, ఇండియా ఏహెడ్‌ అధినేత
ఏ6: అరుణ్‌ రామచంద్ర పిళ్లై, రాబిన్‌ డిస్టిలరీస్‌  
ఏ7: సమీర్‌ మహేంద్రు, ఇండో స్పిరిట్‌ యజమాని

ఆగస్టు 17నాటి ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా...

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తాము ఈ ఏడాది ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని పేర్లను మాత్రమే తొలి ఛార్జిషీటులో నమోదు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించింది. విచారణ ప్రారంభమైన 60 రోజుల తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉండడంతో.. తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతిపై 10 మంది మద్యం లైసెన్సుదారులు, వారి సహచరులు, ఈ దందాతో సంబంధమున్న ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఆబ్కారీ విధానంలో సవరణలు, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాల కల్పన, లైసెన్సు రుసుములో మినహాయింపు/రాయితీ, ఆమోదించకుండానే ఎల్‌-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఖాతా పుస్తకాల్లో తప్పుడు వివరాల నమోదుతో సంపాదించిన దానిలో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారు. నిందితులకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి విలువైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 30న నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తెలిపారు.

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాతో పాటు నాడు దిల్లీ ఆబ్కారీ శాఖ కమిషనర్‌గా ఉన్న అర్వ గోపీకృష్ణ, నాటి ఆబ్కారీ శాఖ ఉప కమిషనర్‌ ఆనంద్‌ కుమార్‌ తివారీ, మరికొందరు అధికారులు, వ్యాపారవేత్తలతో కలిపి మొత్తంగా 16 మంది పేర్లను సీబీఐ చేర్చింది. తర్వాత కాలంలో దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌, విజయ్‌ నాయర్‌లను అరెస్టు చేసింది. ఓ వైపు విచారణ జరుగుతుండగానే మనీష్‌ సిసోదియా సన్నిహితుడు, కేసులో నిందితునిగా ఉన్న దినేష్‌ అరోడా అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తొలి నుంచి ప్రచారం జరిగినట్లు సిసోదియా పేరు ఛార్జిషీట్‌లో లేదు.

అనుబంధ ఛార్జిషీట్లలో...

ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న పలువురి పేర్లు తొలి ఛార్జిషీట్‌లో లేకపోవడంపై సీబీఐ స్పందించింది. లైసెన్సుల జారీ, కుట్రపూరితంగా వ్యవహరించడం, సిండికేటుగా మారి ఆబ్కారీ విధానం రూపకల్పన చేయడంతో పాటు అమలు చేసే వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్న వారిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మనీష్‌ సిసోదియాతో పాటు కేసుల్లో తదుపరి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల్లో ఉన్న నిందితుల వ్యవహారాలపై సీబీఐ అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని