Higher pension: ఈపీఎఫ్‌వో సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌పై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

Updated : 28 Feb 2023 08:19 IST

అధిక పింఛను అప్లికేషన్‌ తెరుచుకున్నా సాంకేతిక సమస్యలు
సందేహాల నివృత్తికి ఈపీఎఫ్‌ కార్యాలయాలకు తాకిడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌పై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దరఖాస్తు తెరిచేందుకు ప్రయత్నించిన వారికి పేరు సరిగా లేదని, ఈపీఎఫ్‌ ఖాతా వివరాలు కనిపించడం లేదంటూ ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోంది. ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌ హోంపేజీ తెరుచుకునేందుకూ సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు మే 3 వరకు ఇచ్చినప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. చివరివరకు వేచి ఉంటే సర్వర్‌ సమస్యలతో అధిక పింఛను అవకాశం చేజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందులపై ఈపీఎఫ్‌వో వర్గాలను సంప్రదించగా సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొందని, నిర్వహణ బాధ్యతను కేంద్ర ఈపీఎఫ్‌ కార్యాలయం చూస్తోందని వెల్లడించాయి.

సందేహాల నివృత్తి కోసం కార్యాలయాలకు...

ఉమ్మడి ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులోకి వచ్చిన విషయం తెలియడంతో వేతన జీవులు, పింఛనుదారులు సోమవారం పెద్దసంఖ్యలో హైదరాబాద్‌లోని బర్కత్‌పుర కార్యాలయానికి వచ్చారు. అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌పై సందేహాలు నివృత్తి చేయాలని, మరింత సమాచారం కావాలని కోరారు. కార్యాలయ సిబ్బంది అందుబాటులోని సమాచారాన్ని వివరించి అందరినీ పంపించేశారు. ఈపీఎఫ్‌ చందాదారులు, పింఛనుదారులకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతినెలా 27న ఈపీఎఫ్‌వో ‘‘నిధి ఆప్‌కే నికత్‌’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సోమవారం హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో నాలుగు చోట్ల నిర్వహించగా ఆ కార్యక్రమాలకు హాజరైన వారిలో అధిక పింఛను ఆప్షన్‌ సందేహాల నివృత్తి కోసం వచ్చిన వారు దాదాపు 80శాతం మంది ఉన్నారని తెలిసింది.

2014 సెప్టెంబరు 1కు ముందు పదవీ విరమణ చేసిన వారికీ సమస్యలు

2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేసి, ఈపీఎస్‌ చట్టం పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ, ఆ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో గతంలో తిరస్కరించింది. వీరికి సుప్రీం తీర్పు ప్రకారం ఆప్షన్‌ ఇచ్చి, అధిక పింఛను పొందేందుకు తాజాగా అవకాశం దక్కింది. వీరికి మెంబర్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు నెల రోజుల క్రితమే అందుబాట్లోకి వచ్చింది. దరఖాస్తు గడువు మార్చి 3 తేదీతో ముగియనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తు తెరుచుకోవడం లేదు. గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసేందుకు వీలుగా సాంకేతిక సమస్యలుతొలగించాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు.


కొన్ని సందేహాలకు ఇవీ సమాధానాలు

అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ విషయమై ఈనెల 24న ఎంప్లాయర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ)లు సంయుక్తంగా కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌, పింఛను ప్రాంతీయ కమిషనర్‌తో వర్చువల్‌ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్‌ (పింఛను) కొన్ని సందేహాలను నివృత్తి చేశారని పేర్కొంటూ కర్ణాటక ఎంప్లాయర్స్‌ ఫెడరేషన్‌ (కేఈఏ) తమ సభ్యులకు తెలిపింది. ఈ సమావేశంలో కమిషన్‌ నివృత్తి చేసిన వివరాలు వెల్లడిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.

* ఉమ్మడి ఆప్షన్‌ను ఆన్‌లైన్లో నమోదు చేయాలి. ఉద్యోగులు ఆప్షన్‌ ఇచ్చినా, యజమాని పంపించలేదని.. ఇతరత్రా కారణాలతో ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

* దరఖాస్తు చేసేందుకు గడువుతేదీని ఆన్‌లైన్‌లో పేర్కొంటుంది. దీనిపై ఈపీఎఫ్‌వో ప్రత్యేక ఆదేశాలు ఏమీ జారీ చేయదు.

* ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో పనిచేసినపుడు ప్రతినెలా పొందిన వేతనం ఆధారంగా పింఛను లెక్కించేందుకు పూర్తివివరాలు అవసరం. ఈ నేపథ్యంలో ఉద్యోగి గతంలో పనిచేసిన యజమాని నుంచి అక్కడ పనిచేసిన సర్వీసుకు సంబంధించి నెలవారీగా పొందిన వేతనం, ఈపీఎఫ్‌, ఈపీఎస్‌కు చెల్లించిన చందా వివరాలు, యజమాని నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉమ్మడి ఆప్షన్‌లో పూర్తివివరాలు నమోదు చేస్తే అర్హులైన వారికి ఈపీఎఫ్‌వో అధిక పింఛను, ఈపీఎస్‌లో అదనంగా చెల్లించాల్సిన జమ వివరాలను లెక్కించేందుకు వీలవుతుంది.

* వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు పింఛనునిధికి అదనంగా జమచేయాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రస్తుత యజమానికి పీఎఫ్‌ విభాగం సూచిస్తుంది. అదనపు డిపాజిట్‌ విషయమై ప్రస్తుత యజమాని, ఉద్యోగి సంయుక్తంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేయాలి.

* పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆప్షన్‌ ఇచ్చేటప్పుడు అధిక పింఛను ఆప్షన్‌, అదనపు డిపాజిట్‌ తదితర వివరాలు, ఆర్థికభారం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలన్నీ మదింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.

* ఆన్‌లైన్‌ డిక్లరేషన్‌ ఆధార్‌తో అనుసంధానమవుతుంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఖాతాలకు ఆన్‌లైన్‌ డిక్లరేషన్‌ను పోర్టల్‌ అనుమతించదు. అధిక పింఛనుతో కలిగే లాభాల గురించి యజమానులు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు