Higher EPFO pension: అధిక పింఛనుపై ఏ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకోవాలి

ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టినా, అందులో చేరినా చివర్లో వచ్చే ప్రతిఫలం ముందుగానే వెల్లడించి ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు వివిధ రకాల పెట్టుబడి పథకాల్లో చేర్చుకుంటాయి.

Updated : 05 Mar 2023 07:34 IST

చట్టానికి సవరణలు అంగీకరించాలి
దరఖాస్తులో ఈపీఎఫ్‌వో ఆంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టినా, అందులో చేరినా చివర్లో వచ్చే ప్రతిఫలం ముందుగానే వెల్లడించి ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు వివిధ రకాల పెట్టుబడి పథకాల్లో చేర్చుకుంటాయి. ఆ మేరకు ప్రతిఫలం దక్కుతుంది. కానీ అధిక పింఛను పథకంలో చేరేందుకు ఆన్‌లైన్లో అందుబాటులోకి వచ్చిన దరఖాస్తులో ఈపీఎఫ్‌వో పేర్కొన్న షరతులు అర్హులైన పింఛనుదారుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధిక పింఛను కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అర్హత దక్కకుండా ఆచరణ సాధ్యం కాని షరతులను భవిష్యనిధి సంస్థ పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అధిక పింఛను అర్హులకు ఎంత మేర పింఛను... ఏ లెక్కన వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పింఛను లెక్కింపు విధానంపై స్పష్టత ఇవ్వని ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌ దరఖాస్తులో పింఛను పథకం కింద ఈపీఎఫ్‌వో నిర్ణయించే లెక్కింపు సూత్రం ప్రకారం పింఛను పొందేందుకు అంగీకరించినట్లు హామీ తీసుకుంటోంది.

ఫార్ములా చెప్పకుండా దరఖాస్తు ఎలా..?

కనీస పింఛనును రూ.వెయ్యికి పెంచిన ఈపీఎఫ్‌వో పింఛను లెక్కింపు ఫార్ములాను పూర్తిగా మార్చివేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులకు తక్కువ పింఛను వచ్చేలా నిబంధనలు చేర్చింది. తాజాగా అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అంగీకరించిన నేపథ్యంలో.. అర్హులైన ఉద్యోగులకు వాస్తవికంగా రావాల్సిన పింఛను కన్నా తక్కువ వచ్చేలా ఫార్ములా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే అధిక పింఛను ఆన్‌లైన్‌ దరఖాస్తుకు అనుమతించే సమయంలో ఇచ్చిన ఆదేశాల్లో పింఛను ఫార్ములాను తరువాత లెక్కిస్తామని పేర్కొందని విమర్శిస్తున్నాయి. ఈ ఫార్ములా చెప్పకుండా ఆన్‌లైన్లో దరఖాస్తులు తీసుకుంటోందని పేర్కొన్నాయి.

పథకాన్ని సవరించే హక్కు ప్రభుత్వానిదే..

ఈపీఎఫ్‌ పింఛను పథకాన్ని మార్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రం తీసుకునే ఆమోదయోగ్యమైన సవరణలు అర్థం చేసుకుని అంగీకరిస్తామన్న హామీని ఆన్‌లైన్‌ దరఖాస్తులో తీసుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఈ ఉమ్మడి ఆప్షన్‌ ఇస్తున్నట్లు చెప్పడంతో పాటు ఏవైనా తప్పులు పేర్కొన్నా, పొరపాటు చేసినా ఈపీఎఫ్‌వో తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ఉద్యోగి హామీ ఇవ్వాలని షరతులు చేర్చింది. ఈపీఎఫ్‌వో నిర్ణయించే డిమాండ్‌నోటీసు మేరకు పేర్కొన్న మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించేందుకు అంగీకరించడంతో పాటు గడువులోగా కట్టకుంటే దరఖాస్తును తిరస్కరించే హక్కు ఈపీఎఫ్‌వోకు ఉందని గుర్తించాలని పేర్కొంది.

పింఛను ఎందుకు తక్కువగా వస్తుందంటే..

* ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు 2014 సెప్టెంబరు 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం తీసుకునేవారు. (మూలవేతనం+డీఏ కలిపి.. అధిక పింఛను అవకాశం లేకుంటే గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ రూ.15 వేలపై లెక్కిస్తారు. తక్కువగా ఉంటే తక్కువ వేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.) చేసిన సర్వీసు ప్రకారం పింఛను లెక్కించేవారు. 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఏడాది సగటుకు బదులుగా చివరి అయిదేళ్ల సగటు పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్కిస్తున్నారు.

* ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, కార్మికులకు ఈపీఎఫ్‌ పింఛను మరింత తక్కువ వచ్చేలా లెక్కింపు విధానంలో సమూల మార్పులు చేసింది. చివరి అయిదేళ్ల సగటువేతనాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు దామాషా పద్ధతిన లెక్కిస్తోంది.   

* దామాషా పద్ధతి ప్రకారం 2014 సెప్టెంబరు 1 నాటికి సర్వీసుకు పింఛను అప్పటివరకు అమల్లో ఉన్న గరిష్ఠ వేతన పరిమితి రూ.6500 ప్రకారం లెక్కిస్తోంది. 2014 సెప్టెంబరు 1 తరువాత సర్వీసుకు రూ.15వేలపై అయిదేళ్ల సగటు తీసుకుని ఇస్తోంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 2000లో సర్వీసులో చేరి, 2023లో పదవీ విరమణ చేశారు. అతని చివరి అయిదేళ్ల సగటు వేతనం రూ.15 వేలుగా ఉందనుకుందాం. అప్పుడు అతనికి  రూ.4,928 పింఛను రావాలి. కానీ దామాషా పద్ధతి పేరిట 2014 నాటికి 14 ఏళ్ల సర్వీసుకు రూ.6500పై, ఆ తరువాత 2023 వరకు తొమ్మిదేళ్ల సర్వీసుకు రూ.15 వేలపై లెక్కిస్తోంది. ఈ లెక్కన రూ.3,228 మాత్రమే వస్తోంది. భవిష్యత్తులో ఇతర సవరణలు చేస్తే ఉద్యోగులకు పింఛను మరింత తగ్గే అవకాశాలున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

* పింఛను లెక్కింపు విధానం : పింఛను అర్హత వేతనం X సర్వీసు (సంవత్సరాల్లో) / 70.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని