Credit Card: ‘మోసపూరిత లావాదేవీల్లో బ్యాంకుది సేవాలోపమే’

క్రెడిట్‌ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగిన నిమిషాల్లోనే ఫిర్యాదుచేసినా వాటిని అడ్డుకోకుండా బాధ్యత నుంచి తప్పించుకోవాలన్న యాక్సిస్‌ బ్యాంకును రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తప్పుబట్టింది.

Updated : 05 Mar 2023 08:35 IST

క్రెడిట్‌ కార్డుదారుకు రూ.30 వేలు పరిహారం చెల్లించండి
యాక్సిస్‌ బ్యాంకుకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగిన నిమిషాల్లోనే ఫిర్యాదుచేసినా వాటిని అడ్డుకోకుండా బాధ్యత నుంచి తప్పించుకోవాలన్న యాక్సిస్‌ బ్యాంకును రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తప్పుబట్టింది. మోసపూరిత లావాదేవీల మొత్తాన్ని రద్దు చేయడంతోపాటు కార్డుదారుకు రూ.30 వేలు పరిహారం, రూ.5 వేలు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.సత్యనారాయణ రూ.1.22 లక్షల లిమిట్‌తో 2013లో యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు పొందారు. 2015 ఆగస్టు 26న తన ప్రమేయం లేకుండానే రూ.83,814 మొత్తానికి 4 లావాదేవీలు జరిగాయి. ఇందులో ఒకటి తిరస్కరణకు గురైంది. వీటి గురించి ఈమెయిల్‌ ద్వారా సమాచారం రావడంతో తక్షణం బ్యాంకుకు ఫోన్‌ చేసి ఆ లావాదేవీలను నిలిపివేయాలని, తన ఖాతాలో ఆ మొత్తాన్ని చేర్చరాదని విజ్ఞప్తిచేశారు. రాతపూర్వకంగా పత్రాన్ని కూడా సమర్పించారు. అయినా ఈ మొత్తాన్ని ఖాతాలో వేయడంతోపాటు బకాయిలు చెల్లించలేదన్న కారణంగా కార్డును బ్లాక్‌ చేయడంతో ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అక్కడ పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. దీన్ని సవాలు చేస్తూ యాక్సిస్‌ బ్యాంకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలను విన్న కమిషన్‌ బ్యాంకు తీరును తప్పుబటింది. మొదటి లావాదేవీ జరిగాక రెండోసారి కార్డును వాడినప్పుడు అప్రమత్తమై మిగిలిన వాటిని నిలిపివేసి ఉండాల్సిందని... లేదా కార్డుదారును హెచ్చరించి ఉండాల్సిందంది. కార్డుదారు ఇక్కడ ఉండగా విదేశాల్లో లావాదేవీ జరిగినప్పుడైనా అప్రమత్తం చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. లావాదేవీ పాస్‌వర్డ్‌ ఆధారంగానే జరిగిందని, సైబర్‌ పోలీసులను ఆశ్రయించాలంటూ కార్డుదారుకు సమాచారం ఇచ్చామన్న బ్యాంకు వాదన సరికాదంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బోగస్‌ లావాదేవీలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందించడం లావాదేవీలు ఖాతాదారు చేశారా లేదా అన్నది ధ్రువీకరించుకోవడానికేనంది. ఇక్కడ ఖాతాదారు లావాదేవీలు జరిగిన నిమిషాల్లోనే బ్యాంకుకు సమాచారం అందించినా వాటిని అడ్డుకోలేదంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని