Higher pension - EPFO: పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఆధారమేదీ?

ఉద్యోగుల అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారానికి ఈపీఎఫ్‌వో పలు కొర్రీలు పెడుతోంది. సరైన పత్రాలు జత చేయలేదని, నెల రోజుల్లోగా ఇవ్వకుంటే ఆయా దరఖాస్తులను తిరస్కరిస్తామని హెచ్చరిస్తోంది.

Updated : 20 May 2023 07:18 IST

అధిక పింఛను దరఖాస్తులకు ఈపీఎఫ్‌వో కొర్రీ

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారానికి ఈపీఎఫ్‌వో పలు కొర్రీలు పెడుతోంది. సరైన పత్రాలు జత చేయలేదని, నెల రోజుల్లోగా ఇవ్వకుంటే ఆయా దరఖాస్తులను తిరస్కరిస్తామని హెచ్చరిస్తోంది. దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టిన ప్రాంతీయ కార్యాలయాలు చందాదారులకు ఈ మేరకు నోటీసులు జారీచేస్తున్నాయి. అధిక పింఛను దరఖాస్తుకు పేరా 26(6) కింద అధిక చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్‌ పత్రం తప్పనిసరి కాదని పేర్కొన్నప్పటికీ, ఆ దరఖాస్తుల పరిష్కారానికి దీన్ని కీలకంగా పరిగణిస్తోంది. పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ కాపీని జత చేయలేదని, ఈ మేరకు ఆధారాన్ని ఇవ్వాలంటూ ఉద్యోగులకు నోటీసులొస్తున్నాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పేరా కింద ఆప్షన్‌ ఇవ్వకపోయినా.. అధిక వేతనంపై చందాను ఈపీఎఫ్‌వో తీసుకుని, చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అధికవేతనంపై చందాతో పాటు యాజమాన్యాల నుంచి సర్వీసు ఛార్జీలు వసూలు చేశాయని, ఇప్పుడు పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ కాపీ తప్పనిసరిగా ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం అన్యాయమని పేర్కొంటున్నాయి.

ప్రత్యేక బృందాల ఏర్పాటు..

అధిక పింఛను దరఖాస్తులను పరిశీలించేందుకు తెలంగాణ రీజియన్‌ పరిధిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయాలు- 1, 2 పరిధిలో నలుగురు సభ్యులతో కూడిన బృందాలున్నాయి. దరఖాస్తులు పెరిగితే బృందాల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

గడువు పొడిగింపునకు యాజమాన్యాల వినతి

అధిక పింఛను దరఖాస్తు గడువును ఈపీఎఫ్‌వో జూన్‌ 26 వరకు పొడిగించింది. కానీ దరఖాస్తులను పరిశీలించి, ఉద్యోగి వేతన వివరాలు, అధీకృత పత్రాలను జతచేసి పంపేందుకు యాజమాన్యాలకు కొంత సమయం పట్టనుంది. ఈక్రమంలో మరింత గడువివ్వాలని ప్రాంతీయ ఈపీఎఫ్‌ కమిషనర్లకు ఇప్పటికే విజ్ఞప్తులు అందజేస్తున్నాయి.

నోటీసుల్లో పేర్కొంటున్న కారణాలు..

* గరిష్ఠ పరిమితికి మించిన వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించినట్లు సమగ్ర ఆధారాలు.

* ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 26(6) కింద అధిక వేతనంపై అధిక చందా చెల్లించేందుకు ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వడంతో పాటు ప్రాంతీయ పీఎఫ్‌ అధికారి అనుమతి తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఆధారాన్ని తప్పనిసరిగా జత చేయాలని సూచిస్తోంది.

* ఉద్యోగి సర్వీసులోని పూర్తి స్థాయి వేతన ఆధారాలివ్వాలి. యజమానులు ఇచ్చిన వివరాలు, ఈపీఎఫ్‌వో వద్ద వేతన వివరాలు సరిగా లేకపోయినా నోటీసులు జారీ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని