JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కొంత కఠినమే..

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కొంత కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Updated : 05 Jun 2023 07:02 IST

260 మార్కులు దాటితే 100లోపు ర్యాంకు వస్తుందంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కొంత కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని, వాటితోపాటు రుణాత్మక మార్కులు ర్యాంకింగ్‌లో కీలకంగా మారతాయని అభిప్రాయపడుతున్నారు. ఒక్కో పేపర్‌లో మొత్తం 51 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు 17 ప్రశ్నలిచ్చారు. పేపర్‌-1లో మూడో సెక్షన్‌కు, పేపర్‌-2లో చివరి రెండు సెక్షన్లకు రుణాత్మక మార్కులు లేవు. వీటిలో ఎక్కువగా మార్కులు తెచ్చుకుంటేనే ర్యాంకులో ముందుంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు పేపర్‌-1లో మూడో సెక్షన్‌కు 24 మార్కులున్నాయి. వాటికి నెగిటివ్‌ మార్కులు లేవు. మిగిలిన మూడు సెక్షన్లకు ఒక్కో దానికి 12 మార్కులు మాత్రమేనని పేర్కొంటున్నారు. ‘ప్రశ్నపత్రం మొత్తం ఎన్ని మార్కులకో ముందుగా తెలియదు. ఒక్కో సబ్జెక్టులో ఎన్ని సెక్షన్లు.. ఎన్ని ప్రశ్నలు.. ఏ సెక్షన్‌కు రుణాత్మక మార్కులు ఉంటాయి కూడా తెలియవు. అందువల్ల అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో విద్యార్థుల వ్యూహం ఎంతో కీలకం’ అని శ్రీచైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ పేర్కొన్నారు. మొత్తం 360కి 275 మార్కులు దాటితే 10 ర్యాంకుల్లోపు, 260 దాటిన వారికి 100లోపు ర్యాంకులు వస్తాయని అంచనా వేశారు. ఈసారి కటాఫ్‌ మార్కులు సుమారు 60గా ఉండొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు