Revanth Reddy: భద్రతా వలయంలో రేవంత్‌రెడ్డి నివాసం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 06 Dec 2023 12:09 IST

సమీపంలోని మల్కాజిగిరి ఎంపీ కార్యాలయం కూడా..
అక్కడే ప్రజా దర్బార్‌కు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సమాచారం

ఈనాడు- హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 44లో నివాసముంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్డులోనే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తిచేసే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

👉 Follow EENADU WhatsApp Channel

‘కాబోయే సీఎం నివాసానికి తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు ప్రస్తుతం సివిల్‌ పోలీసుల్ని ఉపయోగిస్తాం. తర్వాత దశలో ఏఆర్‌ సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచాం. బుధవారం నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారు’ అని పోలీసు అధికారులు తెలిపారు. ‘బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులు, అంతర్గత భద్రత విభాగం(ఐఎస్‌డబ్ల్యూ), ట్రాఫిక్‌ విభాగం అధికారులు అక్కడి పరిస్థితులు, భద్రతపరంగా ఉన్న లోపాలు, వాటిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రూట్‌మ్యాప్‌ తదితరాలు స్వయంగా పరిశీలిస్తారు. రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో పెద్దమ్మ గుడి, ఓ సినీ నటుడి నివాసం ఉన్నాయి. ఆలయం వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లకు ఆదేశిస్తారు’ అని పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని