కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటాం

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది.

Published : 07 Dec 2023 04:34 IST

తెలంగాణ ఉద్యోగుల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది. ప్రభుత్వానికి అండగా ఉండి అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలకు అందేందుకు సహాయ సహకారాలు అందిస్తామని సంఘం ఛైర్మన్‌ పద్మాచారి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీంద్రకుమార్‌, హరీశ్‌కుమార్‌రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు.


రేవంత్‌రెడ్డికి ఉపాధ్యాయ సంఘాల శుభాకాంక్షలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఎ.రేవంత్‌రెడ్డికి పలు ఉపాధ్యాయ సంఘాలు శుభాకాంక్షలు తెలిపాయి. ఎస్‌టీయూటీఎస్‌, టీఎస్‌యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ తెలంగాణ, టీఆర్‌టీఎఫ్‌, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం, ఎస్‌సీ, ఎస్‌టీటీఎఫ్‌, టీపీటీఎఫ్‌, డీటీఎఫ్‌ తదితర సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకీ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతి ఏడాది వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టేలా విధి విధానాలు రూపొందించాలని ఎస్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్‌ కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేస్తారని ఆశిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య, టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.


రేవంత్‌కు రాష్ట్ర పెన్షనర్ల ఐకాస, వయోవృద్ధ సంఘాల సమాఖ్య మద్దతు

ఈనాడు, హైదరాబాద్‌: కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస, తెలంగాణ వయోవృద్ధ సంఘాల సమాఖ్య (సీనియర్‌ సిటిజన్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మయ్య, టి.సుభాకర్‌రావులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రభుత్వానికి వారు తమ మద్దతును తెలియజేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని