TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు

రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది.

Updated : 08 Dec 2023 12:13 IST

సీఎం రేవంత్‌రెడ్డితో నేడు ఆర్టీసీ ఎండీ భేటీ.. 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థ ఆపరేషన్స్‌ ఈడీ మునిశేఖర్‌ నేతృత్వంలో అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్‌కు ప్రాథమిక సమాచారం అందించారు. శుక్రవారం కూడా అధ్యయనం కొనసాగనుంది.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశానికి శుక్రవారం అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందింది. ముఖ్యమంత్రితో భేటీలో ఆయా అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు.

బస్సులు సరిపోయేనా?

కర్ణాటక ప్రభుత్వం జూన్‌ నెల నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది. ఆ రాష్ట్రంలో 22 వేల పైచిలుకు బస్సులున్నాయి. తెలంగాణలో బస్సుల సంఖ్య 8,571గా ఉంది. ‘ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40-41 శాతంగా ఉండేదని సమాచారం. పథకం అమలు తర్వాత 12-15 శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది’ అని ఆర్టీసీ అధికారి ఒకరు ‘ఈనాడు’ తెలిపారు. ఆ ప్రకారం బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలుచేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వాసులకే ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు. ఉచిత ప్రయాణం ఆ రాష్ట్ర పరిధికే (అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచితం వర్తించదు) పరిమితం.


ఏయే బస్సుల్లో అనేది ప్రభుత్వ నిర్ణయమే

మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలుచేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలుచేస్తాం. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది.

వీసీ సజ్జనార్‌, ఆర్టీసీ ఎండీ



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు