Jeevan Reddy: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌కు కరెంటు కట్‌

ఓ షాపింగ్‌ మాల్‌ స్థలం అద్దె, విద్యుత్‌ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి.

Updated : 08 Dec 2023 08:53 IST

రూ.9.37 కోట్లకు చేరిన ఆర్టీసీ స్థలం అద్దె, విద్యుత్‌ బకాయిలు
వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ ప్రకటన

ఈనాడు, నిజామాబాద్‌: ఓ షాపింగ్‌ మాల్‌ స్థలం అద్దె, విద్యుత్‌ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక బస్టాండుకు ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7 వేల చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాళ్లు ఏర్పాటు చేశారు.

అయితే ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్‌ వద్దకు వెళ్లి.. మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు ప్రకటించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో గురువారం సరఫరాను నిలిపివేశారు. ఈ విషయాన్ని సంబంధితశాఖ ఏడీఈ శ్రీధర్‌ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌శాఖ అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని