TSPSC: టీఎస్‌పీఎస్సీ తాజా మాజీలపైనా విచారణ?

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కు రాజీనామా చేసిన గత బోర్డుపైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Updated : 26 Jan 2024 07:50 IST

లీకేజీల్లో వారి పాత్రపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం!

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కు రాజీనామా చేసిన గత బోర్డుపైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకూ పలువురు ఉద్యోగులను అరెస్టు చేయగా.. ఇప్పుడు బోర్డు తాజా మాజీల పాత్రపైనా దృష్టి సారించినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ పదవులకు ఛైర్మన్‌, నలుగురు సభ్యులు రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్‌ దర్యాప్తును కొనసాగించాలని, బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2010లో అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టరుగా పనిచేస్తున్న జగన్‌మోహన్‌పై అనిశా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లో స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్‌గా పనిచేస్తుండగా.. ఆమెపై కూడా కేసు నమోదైంది. అయితే వీరిపై చట్టపరమైన విచారణకు బదులు భారీ జరిమానా సరిపోతుందని చెబుతూ.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ దీనిపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకొని వివరాలు అనిశాకు పంపాల్సి ఉంది. అయితే వీరిద్దరిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంకా తమకు అందలేదని, దాన్ని వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధకశాఖ 2020లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అప్పట్నుంచి సంబంధిత అంశం పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అరుణకుమారిపై ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని