గ్రూప్‌-1పై కీలక అడుగులు

రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది.

Published : 12 Feb 2024 04:38 IST

సుప్రీం కోర్టులో అప్పీలు ఉపసంహరణకు పిటిషన్‌
ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది. గతేడాది అక్టోబరు 21న దాఖలు చేసిన ఈ స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే.. రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్‌ 11 రెండోసారి పరీక్షను నిర్వహించింది. దాదాపు 2.33 లక్షల మంది రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు.. తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్‌ బెంచ్‌ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది. ఇది అక్టోబరు నుంచి విచారణకు రాలేదు. తాజాగా ఈ అప్పీలు పిటిషన్‌ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి చేసింది.

అనుబంధంగానా.. కొత్త ప్రకటనా..?

గ్రూప్‌-1 పరీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని భావించి పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వేస్తామని ప్రకటించింది. ఇటీవల గ్రూప్‌-1లో మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. అయితే 2022లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌కు.. కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా..? దాన్ని రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వడమా..? అనేదానిపై చర్చిస్తోంది. పరీక్ష విధానం, సిలబస్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని