సారలమ్మ ఆగమనం.. పులకించె మేడారం

భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది.

Updated : 22 Feb 2024 06:56 IST

అట్టహాసంగా ప్రారంభమైన జాతర
గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు

మేడారం, న్యూస్‌టుడే: భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు.

సారలమ్మను కొలువుదీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. అంతకన్నా ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధిచేసి, ముగ్గులు వేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతోపాటు, కలెక్టర్‌ త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌ కన్నెపల్లికి చేరుకున్నారు. అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం 7.41 గంటలకు సారలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయల్దేరారు. దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు, భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు. వేల మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు. కన్నెపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆదివాసీలు సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు. ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులుదీరారు. అక్కణ్నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా, అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12.20 తర్వాత గద్దెలపై ప్రతిష్ఠించారు.

వనమా? జనమా?

జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రంతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు ‘వనమా? జనమా’ అన్నంతగా మారిపోయాయి. వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులుదీరడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మేడారానికి రానున్నట్టు అధికారులు తెలిపారు.

నేడు సమ్మక్క ప్రతిష్ఠ

జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం గురువారం జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

గద్దెల దగ్గరి వరకూ బస్సులు: సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. బస్సులు అమ్మవార్ల గద్దెలకు అతి సమీపం వరకు వెళతాయని తెలిపారు. ‘మహాలక్ష్మి పథకంతో జాతరకు వచ్చే ప్రయాణికులు గణనీయంగా పెరుగుతారని అంచనా వేశాం. అందుకు అనుగుణంగా ఆరు వేల బస్సులు నడుపుతున్నాం. వారికి అసౌకర్యం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక: ప్రధాని మోదీ

మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయి. సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయి’ అంటూ బుధవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని