ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఐఆర్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం ఆర్థికశాఖను ఆదేశించింది.

Updated : 23 Feb 2024 08:32 IST

ఆర్థికశాఖకు సీఎంవో ఆదేశాలు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం ఆర్థికశాఖను ఆదేశించింది. కొత్త వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5% ఐఆర్‌ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆది నుంచి పీఆర్‌సీ పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్లు, వివిధ సొసైటీల ఉద్యోగులకు సైతం ఐఆర్‌ వర్తింపజేస్తున్నారు. కానీ అక్టోబరు నాటి ఉత్తర్వుల్లో వీరిని చేర్చలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం.. కొత్త ప్రభుత్వం ఏర్పడటం జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఐకాస ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమకు పీఆర్‌సీ వర్తింపజేయాలని, ఐఆర్‌ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. దీనిపై సీఎం స్పందించి వెంటనే ఆర్థికశాఖకు నోట్‌ పంపించాలని తన కార్యాలయ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రత్యేక కార్యదర్శి సైతం దీనిపై ఆర్థికశాఖకు లేఖ పంపించారు. అధికారులు దీనిపై ప్రతిపాదనలు రూపొందించి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని